G Kishan Reddy: శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి
![Youth engaging in science and technology learning Interest in science and technology should be increased Union Tourism Minister G. Kishan Reddy speaking at Lalapeta](/sites/default/files/images/2024/03/05/04sec80-160063mr-1709626351.jpg)
మార్చి 4న ఆయన తార్నాక ఐఐసిటీ జెడ్ ఎమ్ హైస్కూల్ ప్లే గ్రౌండ్లో ‘ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్కు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా గత ప్రభుత్వ వైఖరి కారణంగా జాప్యం జరిగిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఐసీటీలోనే సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Government Jobs: ప్రభుత్వ కొలువుల్లో సైన్స్ కళాశాల విద్యార్థులు
నగరంలో రక్షణ శాఖకు సంబంధించిన సంస్థలు, ఐటీ, ఫార్మా, హెల్త్ సైన్స్ సంస్థలు ఉన్నా సైన్స్ సిటీ లేని లోటు తెలుస్తుందన్నారు. ఏడాది లోగా సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, అందుకుగాను రూ 400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే భవిష్యత్తులో సైన్స్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
చదవండి: Attaluri Sai Anirudh: వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ టాపర్ అనిరుధ్
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా. జితేందర్ సింగ్ మాట్లాడుతూ దేశంలో సైన్స్, సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కోవిడ్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో సీఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించిందన్నారు.
సైన్స్ లేకుండా సంస్కృతి లేదని, సంసృతి లేకుండా సైన్స్ పూర్తి కాదన్నారు. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని పెంపొందించడానికి ఎగ్జిబిషన్లు, గ్యాలరీలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డా. ఎన్. కలైసెల్వీ, డా. జి. సతీష్రెడ్డి, ఐఐసిటీ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస్రెడ్డి, ఎస్. కుమార్, ఐఏఎస్ అధికారి ముగ్దా సిన్హా, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.