సర్కార్ గ్రీన్సిగ్నలిస్తేనే ఫీజుల పెంపు
దీనిపై సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చేవరకూ వేచిచూడాలని నిర్ణయించింది. ఎఫ్ఆర్సీ మే 26న సమావేశమై ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మా, ఇతర కోర్సుల ఫీజులుపై సుదీర్ఘంగా చర్చించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి ప్రైవేటు కాలేజీల ఫీజులను ఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. 2019లో నిర్ణయించిన ఫీజులు 2022 వరకూ కొనసాగుతున్నాయి. 2022–23కు కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. సర్కారు ఒప్పుకుంటే పెంపు..: కాలేజీల యాజమాన్యాలు ఎఫ్ఆర్సీకి సమర్పించిన ఆడిట్ రిపోర్టుల ఆధారంగా 10–15 శాతం మేర ఫీజుల పెంపు అనివార్యమని భావించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు ఏఐసీటీఈ శ్రీకృష్ణ కమిటీ– 2015లో ఫీజులపై చేసిన సిఫార్సులను ముందుకు తెచ్చింది. దీంతో ఎఫ్ఆర్సీ దీనిపైనా చర్చించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను అమలుచేస్తే ఫీజులు డబుల్ అయ్యే అవకాశం ఉందని గుర్తించింది. దీంతో విషయాన్ని తెలిపి, నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని కమిటీ సభ్యులు భావించినట్టు తెలిసింది. కాగా, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే డిప్లొమా కోర్సులకు రూ. 67 నుంచి 1.40 లక్షలు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు రూ.79 నుంచి 1,89 లక్షలు, పీజీ కోర్సులకు రూ.1.41 నుంచి రూ.3 లక్షలపైన ఫీజులు పెరిగే అవకాశముందని కమిటీ భావిస్తోంది.
చదవండి: