Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్..పునశ్చరణ మంత్రం!

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర 24 ఉన్నత సర్వీసులకు అభ్యర్థులను ఎంపికచేసేందుకు వీలుకల్పించే పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.
మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. తొలిదశ ప్రిలిమ్స్ చాలా కీలకం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. అంటే.. ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఎంతోకాలంగా శ్రమిస్తున్న అభ్యర్థులు.. సన్నద్ధత తుది అంకంలో తమ ప్రిపరేషన్‌కు మరింత పదునుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తీవ్రపోటీ నెలకొన్న దృష్ట్యా ప్రిలిమ్స్‌లో విజయానికి ప్రతి మార్కూ ఎంతో కీలకం. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని.. పరీక్ష రోజు రాణించడమెలాగో చూద్దాం..

పూర్తిస్థాయి రివిజన్ :
సివిల్స్ ప్రిలిమ్స్ పరంగా ప్రస్తుత సమయంలో అభ్యర్థులు రివిజన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటికే చదివిన అంశాలన్నింటినీ మరోసారి సంపూర్ణంగా రివిజన్ చేసుకోవాలి. సొంతంగా రూపొందించుకున్న నోట్స్‌ను, ముఖ్యమైన పాయింట్ల రూపంలో ఉన్న ప్రామాణిక మెటీరియల్‌ను పునశ్చరణ చేయాలి. కరెంట్ అఫైర్స్ పరంగా కొత్త పరిణామాలు కనిపిస్తే వాటిని కూడా నోట్స్‌లో చేర్చుకోవాలి. ఇలా రాసుకున్నవన్నీ పరీక్షకు ముందురోజు వరకూ ఒకటికి నాలుగుసార్లు చదువుతుండాలి. రివిజన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత చదివాం అనే దానికన్నా.. ఎంత ఆకళింపు చేసుకున్నాం.. ఎంత గుర్తుంది అనేది ముఖ్యం!

కరెంట్ అఫైర్స్ కీలకం :
సివిల్స్ పరీక్షల్లో గత కొన్నేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థులు.. జాతీయం, అంతర్జాతీయం, రాష్ట్రీయం, బిజినెస్-ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వార్తల్లోని వ్యక్తులు, పర్యావరణం, అవార్డులు, స్పోర్ట్స్, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలకు సంబంధించి గత ఏడాదికాలంగా జరిగిన పరిణామాలను క్షుణ్నంగా పరిశీలించాలి. కోర్ సబ్జెక్టుకు తోడుగా సమకాలీన అంశాలను జోడించాలి. కరెంట్ అఫైర్స్ పరంగా అభ్యర్థులకు అనుకూలించేవి దినపత్రికలు. ప్రస్తుత సమయంలో దినపత్రికలు చదువుతూనే.. అందులో వచ్చిన ముఖ్యాంశాలు, ప్రశ్నార్హమైన అంశాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్, విధులు, బాధ్యతలు, రాజ్యంగంలో ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్స్ తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. గతేడాది కాలంగా అంతర్జాతీయంగా, జాతీయంగా చోటుచేసుకున్న ముఖ్య అంశాలపై ఎలాంటి ప్రశ్న అడిగినా.. సమాధానం గుర్తించేలా సన్నద్ధమవ్వాలి. మరోవైపు కోర్‌సబ్జెక్టులనూ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. చదవాల్సిన సబ్జెక్టులు, అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకొని సన్నద్ధత కొనసాగించాలి. అన్ని అంశాల రివిజన్‌కు సమయం ఉండేలా చూసుకోవాలి.

కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు..
అభ్యర్థులు గతంలో చదవని అంశాలను ఇప్పుడు కొత్తగా అభ్యసించాలనుకుంటే.. ప్రిపరేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అభ్యర్థుల్లో అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో కొత్త టాపిక్స్‌ను చదవకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. కోర్‌సబ్జెక్టుల వారీగా సమకాలీన అంశాలను జోడించుకోవచ్చు. కానీ పూర్తిగా కొత్త అంశాలను చదవడం సరికాదు. తెలిసిన టాపిక్స్‌కు సంబంధించి అప్‌డేట్స్, తాజా సమాచారం దొరికితే సేకరించుకుని రివిజన్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో విజయానికి అభ్యర్థులు పాటించాల్సిన ముఖ్య సూత్రం... తెలిసిన వాటిని మరోసారి క్షుణ్నంగా చదవటం. ఇప్పటికే చదివిన అంశాలను మరోసారి చదవటం వల్ల కచ్చితత్వంతో మార్కులు పొందే అవకాశం ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్‌లో కచ్చితత్వం చాలా అవసరం. అదేవిధంగా అభ్యర్థి తన ఆసక్తి మేరకు ఎంపిక చేసిన సబ్జెక్టులను లోతుగా చదవడం కూడా కలిసొస్తుంది. క్లిష్టంగా భావించే సబ్జెక్టులను ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట సమయం మేరకు సన్నద్ధమవ్వాలి.

మొదటి ప్రయత్నంలోనే..
ఇటీవల కాలంలో సివిల్స్‌లో కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టి మొదటి ప్రయత్నంలో నెగ్గుకొస్తున్న ధోరణి కనిపిస్తోంది. అయితే కొంతమంది అభ్యర్థులు మొదటి ప్రయత్నాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తొలి ప్రయత్నమే కదా.. ఇది కాకపోతే మరో అటెంప్ట్ ఇవ్వొచ్చు అనే ఆలోచనతో ఉంటున్నారు. అలాకాకుండా మొదటి ప్రయత్నమే.. చివరి ప్రయత్నమని భావించి చదవాలని విజేతలు సూచిస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే విజయావకాశాలు మెరుగుపరచుకునేలా రివిజన్ ఉండాలంటున్నారు. నాలుగు, అయిదు ప్రయత్నాల్లో విజయం సాధించిన అభ్యర్థులు గతంలో చేసిన పొరపాట్లను తెలుసుకొని.. అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇప్పటికే వేర్వేరు సర్వీసుల్లో చేరిన అభ్యర్థులు కూడా ఐఏఎస్ లక్ష్యంగా సన్నద్ధమవుతుంటారు. మరికొంత మంది నాలుగు, అయిదేళ్లుగా సీరియస్‌గా ప్రయత్నం చేసే వారూ ఉంటారు. ఏటా సివిల్స్ ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో రిపీటర్స్ 30 శాతంపైనే ఉంటున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫైనల్ ఫలితాల్లో నిరాశ ఎదురైన అభ్యర్థులు గతేడాది కంటే మరింత మెరుగ్గా రాణించేందుకు కృషిచేయాలి.

మాక్‌టెస్ట్‌లతో మేలు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో మాక్‌టెస్టులు రాసేలా ప్రణాళిక వేసుకోవాలి. అలా రాసిన మాక్ టెస్టుల ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఏ రోజుకారోజు ఫలితాలను బేరీజు వేసుకోవాలి. తక్కువ మార్కులు వస్తే నిరాశ చెందొద్దు. ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా రాశారో గుర్తించాలి. మరుసటి రోజు రాసే పరీక్షకు మరింత మెరుగ్గా అడుగులు వేయాలి. అలానే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసేందుకు కొంత సమయం కేటాయించుకోవాలి. మాక్‌టెస్టుల పరంగా సంబంధిత సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన పేపర్లకు హాజరుకావడం మేలు చేస్తుంది. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహించే టెస్టులకే పరిమితం కాకుండా.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ప్రమాణిక పరీక్షలకు హాజరుకావచ్చు. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ టెస్టులకు ప్రత్యేక పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఇన్‌స్టిట్యూట్లు కూడా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి విశ్లేషణాత్మక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ టెస్టులతోపాటు వాస్తవ పరీక్ష మాదిరిగా ఓఎంఆర్ షీట్ విధానంలో ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

ఆరోగ్యంగా..
గత విజేతల్లో ఎక్కువ మంది పరీక్షకు నెల రోజుల ముందు రోజూ 15, 16 గంటలు చదివామని చెబుతారు. మీరు కూడా వారిలా అంత సమయం చదవాలని ప్రయత్నించకండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా మీకు అందుబాటులో ఉన్న సమయంలోనే అన్ని అంశాలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోండి. అలాకాకుండా మన శక్తికి మించి ఎక్కువ గంటలు చదవాలని ప్రయత్నిస్తే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముంది. ఒక్కోసారి పరీక్షకు గైర్హాజరయ్యే పరిస్థితి కూడా రావొచ్చు. కాబట్టి వ్యక్తిగత సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి. అలానే, అభ్యర్థులు పరీక్షకు రెండ్రోజుల ముందు నుంచి మానసికంగా ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి. పరీక్ష బాగా రాయగలం అనే సానుకూల దృక్పథం పెంచుకోవాలి. ఇది విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పరీక్షకు ముందు రోజు అభ్యర్థులు వ్యవహరించే తీరు ఒక్కొక్కరిదీ ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది పరీక్ష ముందు రోజు కూడా చదవడానికి సంసిద్ధంగా ఉంటారు. మరికొందరు పరీక్ష ముందు రోజు చదవడం వల్ల ఆందోళనకు గురవుతారు.వాస్తవానికి పరీక్షకు ముందు రోజు ప్రశాంతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరుసటి రోజు పరీక్షకు అవసరమైన హాల్‌టికెట్ వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి.

ఆత్మవిశ్వాసంతో అడుగేయాలి..
ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే సగం విజయం సాధించినట్లే. చాలామంది ‘లాస్ట్ మినిట్ టెన్షన్’ ఫోబియాతో ఆందోళన చెందుతారు. ఇది పరీక్ష రోజు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో వ్యవహరించాలి. పోటీ గురించి పట్టించుకోకుండా.. తాము పరీక్షలో రాణించడంపైనే దృష్టిపెట్టాలి. వాస్తవానికి గత మూడు, నాలుగేళ్లుగా ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 50 శాతం మేరకే హాజరు నమోదవుతోంది. మిగతా 50 శాతం మందిలో 20 నుంచి 30 శాతం మంది లాస్ట్ మినిట్ టెన్షన్ వల్ల ఈసారికి కాదులే! వచ్చేసారి చూద్దాం! ఇంత పోటీలో రాణించడం కష్టం, పరీక్షకు హాజరవడం వల్ల అటెంప్ట్ వేస్ట్ అవడం తప్ప ఫలితం ఉండదు.. అనే అభిప్రాయాలతో గైర్హాజరయ్యే వారే. కానీ ఏడాది, ఏడాదిన్నర కాలంగా ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉండాలి!!

ప్రిపరేషన్ టిప్స్..
(కర్నాటి వరుణ్‌రెడ్డి, సివిల్స్ 2018 విజేత (7వ ర్యాంకు).
  • పరీక్ష సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆతృత పెరుగుతుంది. కొందరు ఇప్పటి వరకు చదివినది సరిపోదని భావిస్తారు. తమ పక్కవారు కొత్త పుస్తకాలు చదువుతుంటే వారిని అనుకరించే ప్రయత్నంలో గందరగోళానికి గురవుతారు. ప్రిలిమినరీలో విజయానికి ప్రధాన సూత్రం.. పరిమిత పుస్తకాలను వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయటం. రివిజన్ లేకుండా కొత్త పుస్తకాలను రిఫర్ చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇప్పటివరకు చదివిన పుస్తకాలనే విశ్వసించి పునశ్చరణ చేయాలి.
  • పరీక్ష సమీపిస్తున్న తరుణంలో ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలి. రోజూ సమయాన్ని నిర్దేశించుకొని జనరల్ స్టడీస్ టెస్ట్ రాయాలి. సీశాట్‌లో అర్హత సాధించలేమనుకునే వారు ఆ పరీక్ష కూడా రాయాలి. పరీక్ష రాసిన తర్వాత వచ్చిన మార్కులను చూసి ఆందోళన చెందకుండా.. సమాధానాలను విశ్లేషించుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. ఏ సబ్జెక్టులో, విభాగాల్లో తప్పులు చేస్తున్నారో చూసుకోవాలి. అదే విధంగా ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి ఇంటెలిజెన్స్ గెస్సింగ్ ద్వారా గుర్తించిన సమాధానాల్లో ఎన్ని సరైనవో గుర్తించాలి. దీనివల్ల ప్రిపరేషన్ స్థాయిపై ఓ అంచనాకు రావొచ్చు.
  • రోజూ రాసే ప్రాక్టీస్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఆందోళన చెందొద్దు. తప్పులను తెలుసుకొని, కొత్త అంశాలను నేర్చుకునేందుకు వాటిని మార్గంగా చేసుకోవాలి. పరీక్షల్లో కాన్సెప్టుల వారీగా, ఫ్యాక్చువల్ పొరపాట్లను నోట్‌బుక్‌లో రాసుకోవాలి. వాటిని రోజుకు రెండు, మూడుసార్లు రివిజన్‌చేసుకోవాలి. ఎక్కువ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల కచ్చితత్వం పెరుగుతుంది.
  • పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ విభాగాలకు సమ ప్రాధాన్యమిస్తూ రివిజన్ చేయాలి. ప్రిలిమ్స్ పేపర్ చాలా డైనమిక్‌గా ఉంటోంది. ఏ సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యం లభిస్తుందో చెప్పడం కష్టమవుతోంది కాబట్టి అన్ని సబ్జెక్టులను సమ దృష్టితో చదవాలి. పరీక్షకు కొన్ని రోజుల ముందు ఫ్యాక్చువల్ సమాచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ పథకాలు, హిస్టరీ, కల్చర్, కరెంట్ అఫైర్స్‌పై మరింత దృష్టిసారించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
  • పరీక్ష రోజు ఎలాంటి ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగేయాలి. తెలియని ప్రశ్నల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాకూడదు. తొలుత తెలిసిన వాటికి సమాధానాలు గుర్తిస్తూ వెళ్లాలి. మరోసారి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సమాధానాలు రాబట్టాలి. పరీక్ష గదిలో ప్రశాంతంగా ఉండాలి.
Published date : 10 May 2019 09:14PM

Photo Stories