Skip to main content

పదో తరగతి తర్వాత...ఇంటిగ్రేటెడ్ బీటెక్

బాసర ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్- ఆర్‌జీయూకేటీ).. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలచేసింది.
గ్రామీణ విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన వృత్తి విద్యను అందించాలనే ఉన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. అలా ఏర్పాటైన బాసరలోని ట్రిపుల్ ఐటీ.. ఏటా వందల మంది విద్యార్థులకు ఉత్తమ సాంకేతిక విద్యను అందిస్తూ... ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కెరీర్‌లో ఉత్తమంగా రాణిస్తున్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు.. కోర్సు తీరుతెన్నులు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం...

ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ :
  • ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మొదటి రెండేళ్లపాటు ఇంటర్మీడియట్‌తో సమానమైన ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) ఉంటుంది. ఇందులో అందరికి ఒకే విద్యావిధానం ఉంటుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు/ సంస్కృతం సబ్జెక్టులు బోధిస్తారు.
  • పీయూసీలో కనీసం 6 సీజీపీఏ సాధించిన విద్యార్థులనే ఇంజనీరింగ్‌కు అర్హులుగా ప్రకటిస్తారు. పీయూసీ అనంతరం విద్యార్థులు ఇంజనీరింగ్ బ్రాంచుల ప్రాధాన్యత క్రమాన్ని వెబ్‌కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
  • పీయూసీలో పొందిన సీజీపీఏ ప్రకారం-రిజర్వేషన్లకు అనుగుణంగా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకవేళ విద్యార్థులకు ఒకే సీజీపీఏ ఉంటే.. పీయూసీలో సబ్జెక్టుల వారిగా పొందిన మార్కులకు వెయిటేజీ ప్రకారం, విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల క్రమానికి అనుగుణంగా బ్రాంచ్‌లు కేటాయిస్తారు.
ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు..
  • కెమికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
  • మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్.
మొత్తం సీట్ల సంఖ్య: 1500
  • ట్రిపుల్ ఐటీ బాసరలో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 85 శాతం సీట్లను స్థానిక కోటాలో తెలంగాణ ప్రాంత విద్యార్థులతో భర్తీచేస్తారు. మిగతా 15 శాతం సీట్లను ఓపెన్ కోటాలో మెరిట్ ప్రాతిపదికన తెలంగాణ, ఏపీ విద్యార్థులతో భర్తీచేస్తారు. వీరితోపాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు సూపర్ న్యూమరరీ సీట్లలో ప్రవేశాలకు అర్హులు.
  • ట్రిపుల్ ఐటీలో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ ఉంటుంది. ఎస్సీ: 15 శాతం, ఎస్టీ: 6 శాతం, బీసీ-ఎ: 7 శాతం, బీసీ-బి: 10 శాతం, బీసీ-సి:1 శాతం, బీసీ-డి: 7 శాతం, బీసీ-ఈ: 4 శాతం, పీహెచ్: 3 శాతం, సైనికుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో అన్ని కేటగిరీలలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్ విధానం అమలవుతుంది.
అర్హతలు..
  • ఈ సంవత్సరం పదోతరగతి/తత్సమాన పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 2019, డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 21 ఏళ్ల లోపు ఉండాలి. పదోతరగతిలో పొందిన జీపీఏ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు ఖరారు చేస్తారు.
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు సాధించిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలుపుతారు. అంటే... ఉదాహరణకు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 9.6 జీపీఏ వస్తే.. 0.4 జీపీఏ పాయింట్లు డిప్రివేషన్ స్కోరుగా అదనంగా కలపడంతో 10 జీపీఏ అవుతుంది.
సబ్జెక్టు మార్కులు కీలకం :
చాలామంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించి ఉంటారు. దీంతో విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు సబ్జెక్టు మార్కులు కీలకం కానున్నాయి. మొదట గణితంలోఎక్కువ జీపీఏ పాయింట్లు సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అందులోనూ టై ఏర్పడితే ప్రాధాన్య క్రమంలో వివిధ సబ్జెక్టుల్లో పొందిన జీపీఏ పాయింట్లను పరిశీలిస్తారు. అవి.. మ్యాథ్స్ తర్వాత జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మొదటి లాంగ్వేజ్‌లలో వచ్చిన జీపీఏ పాయింట్లను పరిశీలిస్తారు. వీటన్నింటిలోనూ సమానమైన మార్కులు వస్తే పుట్టిన తేదీని బట్టి వయసు ఎక్కువ ఉన్నవారిని ఎంపిక చేస్తారు. పుట్టినతేది కూడా ఒకటే ఉంటే... తక్కువ హాల్ టిక్కెట్ నెంబర్‌ను పరిగణిస్తారు.

విద్యావిధానం :
ట్రిపుల్ ఐటీలో విభిన్న విద్యావిధానం ఉంటుంది. పీయూసీ నుంచే సెమిస్టర్ విధానం అమలవుతుంది. మొత్తం 100 మార్కులకు 30 మార్కులు నెలవారీ ఎగ్జామ్స్, మరో 10 మార్కులు అసైన్‌మెంట్ల ద్వారా పొందొచ్చు. 60 మార్కులకు సెమిస్టర్ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి మూడున్నర నెలలకు ఒక సెమిస్టర్ ఉంటుంది. ప్రతి నెల ఒక్కో సబ్జెక్టులో 15 మార్కులకు మంత్లీ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మూడు మంత్లీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో మెరుగైన ప్రతిభ కనబరచిన రెండు పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంకో 10 మార్కులను అసైన్‌మెంట్స్/క్విజ్‌లు పూర్తిచేయడం ద్వారా పొందొచ్చు.

"క్యాంపస్" కొలువులు :
ట్రిపుల్ ఐటీ బాసరలో ఇంజనీరింగ్ ఫైనలియర్ ప్రారంభంలోనే కంపెనీలు ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. 2018-19లో 50 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీహరి తెలిపారు. గరిష్టంగా ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీ, కనిష్టంగా రూ.1.5 లక్షల ప్యాకేజీ లభించింది. సగటున రూ.3.35 లక్షల వేతనం అందుతుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 666 మంది ప్లేస్‌మెంట్స్‌కు అర్హత సాధిస్తే.. వీరిలో 328 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది అత్యధికంగా 67 కంపెనీలు ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించాయి. గతేడాది జొట్టర్ ఏఐ అనే ఐటీ సంస్థ ఇక్కడి విద్యార్థికి గరిష్టంగా రూ.9.5 లక్షల ప్యాకేజీ అందించింది. కొందరు విద్యార్థులు ఉన్నత విద్యవైపు అడుగులు వేస్తుండడం వల్ల ప్లేస్‌మెంట్స్‌కు హాజరు కావడం లేదు.

దరఖాస్తు :
విద్యార్థులు టీఎస్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేయాలి. జనరల్, బీసీ విద్యార్థులు అప్లికేషన్ ఫీజు రూ.200; ఎస్సీ, ఎస్టీలు రూ.150 చెల్లించాలి. అదనంగా సర్వీస్ ట్యాక్స్ రూ.25 చెల్లించాలి.

ఫీజుల వివరాలు..
  • ట్రిపుల్ ఐటీల్లో పూర్తిస్థాయి ఉచిత విద్య లభించదు. కానీ, నామమాత్రపు ఫీజులతో కోర్సు పూర్తిచేయొచ్చు. పీయూసీ కోర్సులో భాగంగా మొదటి రెండేళ్లు ఏడాదికి ఫీజు రూ.36 వేలుగా.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ఫీజు ఏడాదికి రూ.40వేలుగా ఉంది. రూ.లక్షలోపు సంవత్సరాదాయం ఉంటే ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంటు సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వార్షికాదాయ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది.
  • తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య, చక్కటి భోజన వసతి, హాస్టల్‌వసతి, ల్యాప్‌టాప్ తదితర వసతులు ట్రిపుల్ ఐటీ బాసరలో కల్పిస్తున్నారు. 24/7 ఈ-లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 2019, ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు.
దరఖాస్తు కాపీల స్వీకరణకు చివరి తేదీ: 2019, మే 31.
ఎంపిక జాబితా ప్రకటన: 2019, జూన్ 10.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rgukt.ac.in
Published date : 08 May 2019 05:10PM

Photo Stories