Skip to main content

పది, ఇంటర్‌తోనే ప్రభుత్వ కొలువులెన్నో...

పదోతరగతి అర్హతతో ఏ ఉద్యోగం రాదా... ఇంటర్‌తో ఆగిపోతే ఇంటికి పరిమితం అవ్వాల్సిందేనా..?! ఎంతమాత్రం కాదు..! సాధించాలనే తపన, పట్టుదల ఉండాలేగానీ, చిన్న చదువులతోనూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర రక్షణ రంగ విభాగాలు.. పదోతరగతి, ఇంటర్(10+2) అర్హతతో పలు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే.. చిన్న వయసులోనే సర్కారీ కొలువు దక్కించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న సర్కారీ కొలువులపై ప్రత్యేక కథనం...

ఇండియన్ రైల్వే :
భారతీయ రైల్వే పదో తరగతి, ఇంటర్ అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీచేస్తోంది.

ట్రాక్‌మ్యాన్, గేట్‌మ్యాన్, పాయింట్స్‌మ్యాన్, హెల్పర్ అండ్ పోర్టర్, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ :
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత/ఐటీఐ/తత్సమానం/నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్‌‌స, జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ విభాగాలు ఉంటాయి. 90 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ :
అర్హత: పదోతరగతి+ఐటీఐ/డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
వయసు: 28 ఏళ్లకు మించరాదు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రెండు దశల్లో ఉంటాయి. అనంతరం కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
వెబ్‌సైట్: www.indianrailways.gov.in

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. పదోతరగతి, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి క్రమం తప్పకుండా వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఔత్సాహికులు సదరు పరీక్షల్లో సత్తా చాటడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు.

ఉద్యోగాలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్(ఐటీబీపీ), శశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ),సెక్రటేరియెట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్)లలోని కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ-జీడీ); అస్సామ్ రైఫిల్స్‌లోని రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ-జీడీ) పోస్టుల భర్తీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపడుతోంది.

కానిస్టేబుల్(జీడీ), అస్సామ్ రైఫిల్‌మ్యాన్(జీడీ) :
వేతనం:
వేతన శ్రేణి రూ.5,200-రూ. 20,200. గ్రేడ్ పే రూ.2000గా ఉంటుంది.
వయసు: 18-23 ఏళ్లు. రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
నియామక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఈ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్టు(పీఎస్‌టీ), మెడికల్ ఎగ్జామినేషన్.
విద్యార్హత: గుర్తింపు కలిగిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణత.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్) పోస్టులకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. ఏటా నవంబర్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. పదోతరగతి ఉత్తీర్ణులకు మల్టీటాస్కింగ్ స్టాఫ్ చక్కటి అవకాశమని చెప్పొచ్చు.
విద్యార్హత: పదో తరగతి.
వయసు: 18-25 ఏళ్లు. రిజర్వేషన్ల ఆధారంగా వివిధ వర్గాల వారికి వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
వేతనం: రూ.5,200-రూ.20,200+గ్రేడ్ పే రూ.1800.
పరీక్ష విధానం: రాత పరీక్ష రెండు దశల్లో ఉంటుంది.
పేపర్-1: ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష
పేపర్-2: డిస్క్రిప్టివ్ తరహా పరీక్ష
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.
వెబ్‌సైట్: https://ssc.nic.in

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్..
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(సీహెచ్‌ఎస్‌ఎల్) పరీక్షను నిర్వహిస్తోంది. ఎస్‌ఎస్‌సీ ఈ పరీక్షను రెండు దశల్లో జరుపుతుంది. తొలిదశ(టైర్1) ఆన్‌లైన్ విధానంలో, రెండో దశ(టైర్ 2) డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది.
వయోపరిమితి: 18-27 ఏళ్లు.
విద్యార్హత: 10+2 లేదా ఇంటర్ ఉత్తీర్ణత. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(సీఏజీ) ఆఫీసులోని డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్ 10+2 లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు టైపింగ్‌కు సంబంధించి స్పీడ్ టెస్టు నిర్వహిస్తారు.

స్టెనోగ్రాఫర్ :
ఎస్‌ఎస్‌సీ.. స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి(గ్రూప్-సి నాన్ గెజిటెడ్) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్టు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం రెండు గంటల సమయం కేటాయిస్తారు. అవి..
పార్ట్-1: జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు.
పార్ట్-2: జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్-100 ప్రశ్నలు-100 మార్కులు.
స్కిల్ టెస్టు: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో నిర్ణీత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు 10 నిమిషాల వ్యవధిలో ఒక డిక్టేషన్ ఇస్తారు. దీన్ని గ్రేడ్ సీ కేటగిరీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 100 పదాలను కంప్యూటర్‌పై స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడ్ డీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 80 పదాలను స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
వెబ్‌సైట్: https://ssc.nic.in  

తివిధ దళాలు:
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ(ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ ఇంటర్ అర్హతతో త్రివిధ దళాల్లో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తుంది. యూపీఎస్‌సీ ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
విద్యార్హతలు: ఆర్మీవింగ్ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్ పూర్తిచేసిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్‌లోని పోస్టులకు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 16½ - 19½ ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రెండంచెల్లో ఉంటుంది. రాతపరీక్షలో ప్రతిభ చూపిన వారికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ).. ఇంటెలిజెన్‌‌స, పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాల్లో.. లెఫ్ట్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి. దీనికంటే ముందు అభ్యర్థులకు నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాలకు ఒకే తరహా శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.56,000కు పైగా స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ.. ఆర్మీకి ఎంపికైతే బీఎస్‌సీ/బీఎస్‌సీ (కంప్యూటర్)/బీఏ సర్టిఫికెట్లను అందిస్తుంది. అదే విధంగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికై.. నిర్ణీత వ్యవధిలో శిక్షణ పూర్తి చేసుకుంటే బీటెక్ సర్టిఫికెట్ సొంతమవుతుంది.
వెబ్‌సైట్: https://upsc.gov.in

ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2) :
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2) ద్వారా ఇంటర్ అర్హతతో ఆర్మీలో ప్రవేశించొచ్చు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(10+2) ద్వారా ఇంజనీరింగ్ పట్టాతోపాటు లెఫ్టినెంట్ హోదాను అందిస్తుంది ఆర్మీ.
అర్హతలు: ఇంటర్‌లో 70 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. సంబంధిత విద్యార్హత కలిగిన అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 16½ ఏళ్ల నుంచి 19½ ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.

క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలు :
ఇంటర్ ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఒక్కో సబ్జెక్ట్‌లో కచ్చితంగా 50 శాతం మార్కులు పొందుండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్.
వయసు: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరంలో పేర్కొన్న నిర్దిష్ట తేదీ నాటికి 17½ నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అర్హులు.

సోల్జర్ (టెక్నికల్):
45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలోని టెక్నికల్ విభాగాల్లో సోల్జర్ కేడర్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

సోల్జర్ (నర్సింగ్ అసిస్టెంట్) :
50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ పూర్తిచేసుండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు వచ్చిండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ. గంట వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో జీకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in

నేవీలో 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్ :
భారత నావికా దళం ఇంటర్ ఉత్తీర్ణులకు అకడెమిక్ సర్టిఫికెట్లతోపాటు అద్భుతమైన కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. ఇంటర్ ఎంపీసీలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీమ్‌కు అర్హులు. పదోతరగతి, ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు పొందుండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా..ఎంపికైన అభ్యర్థులకు ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడెమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్సులో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి బీటెక్ సర్టిఫికెట్‌తోపాటు నేవీ ఉద్యోగం లభిస్తుంది.

సెయిలర్ :
ఇండియన్ నేవీలో ఎంట్రీ లెవల్ పోస్టుగా సెయిలర్‌ను పేర్కొంటారు. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్సుల నుంచి ఏదైనా ఒక సబ్జెక్టును చదివుండాలి. ఎంపిక ప్రక్రియలో ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు ఉంటుంది.
వయసు: 17-20 ఏళ్లు.

సెయిలర్-ఆర్టీఫీసర్ అప్రెంటీస్ :
మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో(లేదా) కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్టులు.

మ్యుజీషియన్ :
అర్హత: మెట్రిక్యులేషన్.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, ఫైనల్ స్క్రీనింగ్ బోర్డు(టెస్టు), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, మెడికల్ స్టాండర్డ్స్.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in  

ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్-ఎక్స్, గ్రూప్-వై :
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ఇంటర్ అర్హతతో గ్రూప్-ఎక్స్ టెక్నికల్, గ్రూప్-వై పేరుతో పోస్టులను భర్తీచేస్తుంది.
అర్హత: ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. గ్రూప్-ఎక్స్ టెక్నికల్ పోస్టులకు మెకానికల్(లేదా) ఎలక్ట్రానిక్స్/ఐటీలో మూడేళ్ల డిప్లొమా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగానికి ఎంపికైన అభ్యర్థులను ఎయిర్‌ఫోర్స్‌లోని పలు సాంకేతిక విభాగాల్లో ఎయిర్‌మెన్‌గా నియమిస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ విభాగాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రూప్-వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియెట్ బైపీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అదే విధంగా వయసు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్‌సైట్: http://indianairforce.nic.in  

రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు..
పోలీస్ కానిస్టేబుల్ :
తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, ఎస్‌పీఎఫ్ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేస్తున్నారు.
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులై నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ చదివితే సరిపోతుంది. వీరు ఉత్తీర్ణులుకాకున్నా పోటీపడొచ్చు.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాథమిక దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైతే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్టు(పీఈటీ)లకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితా ఆధారంగా ఉద్యోగాలు ఖరారు చేస్తారు.

ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ :
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇంటర్ అర్హతతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, రవాణా శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని చేపడుతున్నాయి. ఈ పోస్టులను దక్కించుకోవాలంటే ఇంటర్ విద్యార్హతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారికి మోటారు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ క్వాలిఫైయింగ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మాత్రం కేవలం రాత పరీక్ష ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తారు.

వీఆర్‌ఓ/వీఆర్‌ఏ :
ఇంటర్ అర్హతతో రెవెన్యూ శాఖలోని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్‌ఓ) కొలువులను దక్కించుకోవచ్చు. ఏదైనా గ్రూపుతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుదిజాబితా రూపొందిస్తారు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు రెవెన్యూ శాఖలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

పరీక్ష విధానం: పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీఆర్‌వో పోస్టులకు ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏలకు పదోతరగతి స్థాయిలో ఉంటుంది.

గ్రూప్-4 ఉద్యోగాలు :
ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాతో ఉద్యోగాల భర్తీకి గ్రూప్-4 పరీక్ష నిర్వహిస్తున్నాయి.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన వారు సదరు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్) ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 150 ప్రశ్నలు చొప్పున మొత్తం 300 ప్రశ్నలుంటాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://tspsc.gov.in , https://psc.ap.gov.in
Published date : 08 May 2019 08:54PM

Photo Stories