Skip to main content

ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్‌.. ట్రైనీల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసుకోండిలా..!

ఇంటర్న్‌షిప్‌.. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకం! అకడమిక్‌ కోర్సు సమయంలోనే.. కొద్దికాలం కంపెనీల్లో పనిచేసి అనుభవం పొందే విధానమే.. ఇంటర్న్‌షిప్‌! వాస్తవ పరిస్థితుల్లో పని చేసి.. నైపుణ్యాలు పొందేందుకు ఇది చక్కటి మార్గం!

ముఖ్యంగా ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులు ఇంటర్‌్ాషిప్‌ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుత కరోనా పరిణామాలతో ఇంటర్న్‌షిప్‌ ఎంపికతో పాటు ఇంటర్న్‌ ట్రైనీ విధుల పరంగా వర్చువల్‌ విధానం తెరపైకి వచ్చింది! ఈ నేపథ్యంలో..

వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ అంటే ఏమిటి.. విధి విధానాలు.. వాటిని అందుకోవడానికి మార్గాలు.. ఇంటర్న్‌ ట్రైనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..


గత ఏడాది కరోనా మొదటి దశ ప్రారంభం అయినప్పటి నుంచే.. వర్చువల్, ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. గత సంవత్సరం వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ భారీగా పెరిగాయి. మొత్తం ఇంటర్న్‌ నియామకాల్లో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ 63 శాతంగా ఉన్నాయి. వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ కోసమే దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య.. మొత్తం అభ్యర్థుల సంఖ్యలో 76 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం రెండో దశ కరోనా కారణంగా ఇంటర్న్‌ ట్రైనీలకు వర్చువల్‌గా∙విధులు నిర్వర్తించేలా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.


వర్చువల్‌ విధానం..

ఏదైనా కోర్సు చదువుతున్న విద్యార్థులు రెండు లేదా మూడు నెలలపాటు సంస్థల్లో ప్రాక్టికల్‌గా పనిచేసి.. వాస్తవ నైపుణ్యాలు పొందేందుకు సరైన మార్గం.. ఇంటర్న్‌షిప్‌. వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అంటే.. విద్యార్థులు ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌ ట్రైనీగా పనిచేసే విధానం. కరోనా కాలంలో.. ప్రస్తుతం సంస్థలు ఉద్యోగులకు కల్పిస్తున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం లాంటిదే ఈ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌.


అంతా ఆన్‌లైన్‌లోనే..

ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం అందుకున్న విద్యార్థులు.. టీమ్‌ మేనేజర్‌తోపాటు, బృందంలోని ఇతర ఉద్యోగులతో స్కైప్, జూమ్‌ తదితర ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ పనిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టీం మేనేజర్‌ నుంచి అందే సూచనలకు అనుగుణంగా ఇంటర్న్‌ ట్రైనీలు తమకు కేటాయించిన విధులు ఇంటి నుంచే నిర్వర్తిస్తారు. వీరి పని తీరును సైతం ఆన్‌లైన్‌లోనే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. తగిన సలహాలు ఇస్తుంటారు.


వర్చువల్‌ విధానంలో ఇంటర్న్‌షిప్‌ చేసే విద్యార్థులు.. వాస్తవ పరిస్థితుల్లో సంస్థలో పని చేస్తున్నట్లుగానే భావించి విధులు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తమ పనితీరుపై నిత్యం ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. ఇంకా మెరుగుపరచుకోవాల్సిన మెళకువలను అడిగి తెలుసుకోవాలి. ఇందుకోసం సంస్థలోని సీనియర్లను, తమతోపాటు ఇంటర్న్‌ ట్రైనీగా పని చేస్తున్న సహచరులతో సంప్రదిస్తూ ఉండాలి. సంస్థ కోరుకునే రీతిలో ప్రాజెక్ట్‌ పూర్తిచేసేలా చురుగ్గా వ్యవహరించాలి.


ఆర్థిక ప్రోత్సాహకం..

ఇంటర్న్‌ ట్రైనీలకు సంస్థలు స్టయిపండ్‌ రూపంలో కొంత ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తాయి. ఇది రూ.పది వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. వర్చువల్‌ విధానంలో స్టయిపండ్‌ను సంస్థలు యాభై శాతం మేరకు తగ్గించినట్లు తెలుస్తోంది. స్టయిపండ్‌ గురించి విద్యార్థులు ఎక్కువగా ఆలోచించకుండా.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అయినప్పటికీ.. ఆ సమయంలో విద్యార్థులు చూపిన ప్రతిభ, పనితీరు ఆధారంగా ఆయా సంస్థల్లో శాశ్వత కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.


ఆన్‌లైన్‌ పోర్టల్స్‌..

వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందుకునేందుకు ఇప్పుడు పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌.. ఇంటర్న్‌షిప్స్‌ ఖాళీల గురించి సమాచారం అందిస్తున్నాయి. ఇవి సంస్థలకు, విద్యార్థులకు అనుసంధాన వేదికలుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు ఆయా పోర్టల్స్‌ను సందర్శించడం ద్వారా అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్‌ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.


డిజిలాకర్‌..

ప్రస్తుతం నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ విభాగంలోని డిజిలాకర్‌లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను పొందుపరుస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ డిజిలాకర్‌లో అధిక శాతం ఇంటర్న్‌షిప్స్‌.. కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ తదితర సాంకేతిక విభాగాలకు సంబంధించినవి ఉంటున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ డెవలపర్, ఐటీ టెస్టర్‌పై ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే.. అభ్యర్థులు డిజిలాకర్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. దీంతోపాటు గ్రామీణ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ వంటి ఇతర విభాగాల్లోనూ ఇంటర్న్‌షిప్స్‌ నియామకాలు జరుగుతుంటాయి. విద్యార్థులు వీటి కోసం ఆయా శాఖల వెబ్‌సైట్స్‌ను పరిశీలిస్తుండాలి.


ఏఐసీటీఈ–తులిప్‌

జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్‌ విద్య నియంత్రణ సంస్థ ఏఐసీటీఈ(ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) కూడా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు TULIP (The Urban Learning Internship Program) పేరిట ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా స్మార్ట్‌ సిటీస్‌ కాన్సెప్ట్‌ను వృద్ధి చేసే విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్‌ అందుకునే వీలుంది. 2025 నాటికి కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించాలని ఏఐసీటీఈ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని.. ఇంటర్న్‌ ట్రైనీ నియామకాలు చేపడుతోంది. ఇటీవలే సిస్కోతో కలిసి సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో భారీగా వర్చువల్‌ ఇంటర్న్‌ ట్రైనీ అవకాశాలను కల్పించింది.
 
Published date : 04 Jun 2021 02:38PM

Photo Stories