Skip to main content

నయా కెరీర్ డిజిటల్ పబ్లిషింగ్‌

ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే చరణ్.. ప్రతి రోజు కాలేజీకి బస్‌లో వెళ్తుంటాడు.. బస్‌లో వెళ్తున్న సమయాన్ని కూడా వృథా చేయకుండా ఐఫోన్ అప్లికేషన్ ద్వారా తన బ్రాంచ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.

వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడిన మహబూబ్‌నగర్‌కు చెందిన సుశాంత్ తన సొంత ఊర్లో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో ఉంటాడు.. ఇందుకోసం సుశాంత్ ప్రతి రోజూ తెలుగు దినపత్రికలను ఇంటర్నెట్ ద్వారా ఈవెర్షన్ (ఈ పేపర్)లో వీక్షిస్తుంటాడు.

మోహన్‌కు సాహిత్యం అంటే ఎంతో మక్కువ. కానీ తన బాధ్యతల రీత్యా వివిధ రకాల రచనలను సేకరించడానికి తగినంత సమయం చిక్కడం లేదు.. దీనికి సమాధానంగా.. ఇటీవల తాను కొనుగోలు చేసిన ట్యాబ్ ద్వారా అందుబాటులోని సమయంలో వివిధ రచయితల పుస్తకాలను చదువుతూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నాడు..

ఈ జాబితా కేవలం చరణ్, సుశాంత్, మోహన్‌తోనే ఆగిపోలేదు.. ఇలా ఎందరో ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ పఠనానికి ప్రాధాన్యతనిస్తున్నారు.. ఐఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్, ఈ-వెర్షన్స్ వంటి నూతనంగా వచ్చిన సాంకేతిక మాధ్యమాలను తమ అధ్యయనానికి వేదికగా చేసుకుంటున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం విప్లవంలా సాగుతున్న ప్రస్తుత యుగంలో.. మారిన ప్రజల దృక్పథం, ఆసక్తి మేరకు అన్ని రంగాలు మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. అందుకు ప్రచురణ రంగం (పబ్లిషింగ్) కూడా మినహాయింపేమీ కాదు. దాంతో ప్రస్తుతం వార్తా సంస్థల నుంచి విద్య, వైద్య, సాహిత్యం ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రచురణ సంస్థలు..తమ ప్రచురణలను డిజిటలైజేషన్, ఈ-వెర్షన్‌లుగా రూపాంతరం చేస్తున్నాయి.. దీంతో పబ్లికేషన్ రంగంలో డిజిటలైజేషన్ ప్రక్రియ కొత్త తరహా కెరీర్ అవకాశాలకు తెర తీస్తుంది.

ఇలా:
ప్రచురణ సంస్థలు.. తమ ప్రచురణలను ఈ-బుక్స్ రూపంలోకి మారుస్తున్నాయి. వీటిని ఈపబ్స్ లేదా పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటువంటి ప్రక్రియ ప్రస్తుతం జోరుగా కొనసాగుతుంది. అంతేకాకుండా కొన్ని సంస్థలు ఈ విషయంలో సంబంధిత ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నాయి. ఆయా మాధ్యమాల్లో పొందుపరుస్తున్న కంటెంట్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంలోనూ ప్రత్యేకత చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కంటెంట్‌ను కేవలం టెక్ట్స్ రూపంలోనేకాకుండా ప్రభావవంతంగా రూపొందించడానికి యానిమేషన్, సబ్‌టైటిలింగ్ వంటి ప్రక్రియలను అనుసరిస్తున్నాయి. యూట్యూబ్, గూగుల్ ప్లే, ఆపిల్ స్టోర్, కిండల్, డీటీహెచ్ మాధ్యమాల్లో కూడా పని చేసే విధంగా డిజిటల్ వెర్షన్స్‌ను రూపొందిస్తున్నాయి. పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చే ప్రక్రియ గత కొంత కాలంగా ఊపందుకుంది. ఉదాహరణకు పెంగ్విన్ ఇండియా స్మార్ట్ ఫోన్లను దృష్టిలో ఉంచుకుని 2011లోనే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను, 2012లో ఈ-బుక్‌ను ప్రారంభించింది. బ్రిటానికా ఎన్‌సైక్లోపిడీయా పూర్తిగా డిజిటల్ పబ్లిషింగ్ రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించింది.

జాబ్ ప్రొఫైల్స్:
నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి సరిపోయే కెరీర్ ఇది. ఈ రంగంలో సాధారణంగా ఉండే జాబ్ ప్రొఫైల్స్-ఆన్‌లైన్ ఎడిటర్, ఆన్‌లైన్ జర్నలిస్ట్, వెబ్ డిజైనర్, వీడియోగ్రాఫర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, డిజిటల్ టైప్ సెట్టింగ్, ఈ-పబ్లిషింగ్, కాపీ ఎడిటింగ్, ఇండెక్సింగ్, డేటా కన్వర్షన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మల్టీ లాంగ్వేజ్ టైప్ సెట్టింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్, ఆర్కీవింగ్, ప్రీ-మీడియా సర్వీసెస్, మల్టీ మీడియా సర్వీసెస్, న్యూ మీడియా సర్వీసెస్, కోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వెబ్ పబ్లిషింగ్ వంటివి. కాంపోజర్స్, ప్రూఫ్ రీడర్స్, కాపీ ఎడిటర్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్స్, ప్రొడక్షన్ కో ఆర్డినేటర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, అంతేకాకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్స్, డిజిటల్ పరికరాలను రూపొందించే అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉంటాయి. వేతనాల విషయానికొస్తే.. పని చేసే హోదాను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య వేతనాలు లభిస్తాయి.

కెరీర్ వేదికలు:
జాతీయ, స్థానిక దినపత్రికలు, వార పత్రికలు, ఆన్‌లైన్ న్యూస్‌పోర్టల్స్, ఈ-మ్యాగజైన్స్, న్యూస్‌వెబ్‌సైట్స్, ఈ-న్యూస్‌పేపర్స్, పబ్లిషింగ్ హౌసెస్, ఔట్ సోర్సింగ్ రూపంలో డిజిటల్ పబ్లిషింగ్, ఈ-వెర్షన్ సేవలను అందించే ఏజెన్సీలు, సంబంధిత సంస్థలు అవకాశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.

కావల్సిన నైపుణ్యాలు:
ఒక రకంగా చెప్పాలంటే ఈ రంగం చాలా ప్రత్యేకమైంది. కాబట్టి ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఎందుకంటే సాధారణ పాఠకులకు భిన్నంగా ఆన్‌లైన్ పాఠకుల అభిరుచి, ఆసక్తి ఉంటాయి. ఉదాహరణకు ఆన్‌లైన్ పాఠకులు ఏదైనా ఒక అంశంపై ఎక్కువ సమయం వెచ్చించరు. తక్కువ సమయంలోనే ఫింగర్‌టిప్స్‌తో సమాచారం కావాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో అనవసరమైన అంశాల జోలికిపోకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ సోర్స్‌పై దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తుంటారు. కాబట్టి అనవసర అంశాల జోలికి పోకుండా కంటెంట్‌ను ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయగలిగే నేర్పు ఉండాలి. అదే సమయంలో డిజైన్ పరంగా కూడా సిస్టమ్ ఫ్రెండ్లీ/యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వెబ్‌సైట్స్ ఎక్కువగా నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. కాబట్టి డిజైన్ పరమైన పరిజ్ఞానం కూడా అవసరం. కంటెంట్‌కనుగుణంగా ఎటువంటి ప్లాట్‌ఫామ్‌ను డిజైన్ చేయాలి? ఎటువంటి ఫాంట్ ఉపయోగించాలి? ఏయే కలర్లు వాడాలి? దాన్ని యూజర్ ఫ్రెండ్లీగా మరింత ప్రభావవంతంగా ఏవిధంగా రూపొందించవచ్చు? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి. వీటన్నింటికీ తోడు సాంకేతిక నైపుణ్యం కూడా అవసరం. పుస్తకాలు/ ప్రచురణలను డిజిటల్ వెర్షన్ రూపంలోకి మార్చే సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా డిజైనర్లకు ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్లపై పూర్తి పరిజ్ఞానం అవసరం. ఆడోబ్ ఫోటోషాప్, ఇన్ డిజైన్, ఇల్యూస్టేటర్, ఫ్లాష్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదే సమయంలో సంస్థలను బట్టి ప్రోగ్రామర్లు వినియోగించే సాఫ్ట్‌వేర్లలో తేడాలు ఉంటాయి. ఈ రంగం లో ప్రోగ్రామర్లు సాధారణంగా ఐఓఎస్ అప్లికేషన్స్ కోసం ఎక్స్‌కోడ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కోసం ఎక్లిప్స్ వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. కేవలం సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, సాంకేతిక చాతుర్యమేకాకుండా ఆ రంగానికి సంబంధించి నూతనంగా అందుబాటులోకి వచ్చిన/వస్తున్న పరికరాలు(గాడ్జెట్స్), జరుగుతున్న పరిశోధనలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి. కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉంటేనే సరిపోదు. పాఠకులను అవగాహన చేసుకునే నిపుణుల అవసరం కూడా డిజిటల్ పబ్లిషింగ్ రంగానికి ఉంది. అంటే ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు విశ్లేషణాత్మక సామర్థ్యం, సోషల్ మీడియాను వినియోగించుకునే చాతుర్యం, డిజిటల్ పబ్లిషింగ్ రంగం ఒక రకంగా ఇంకా అవసాన దశలో ఉంది.. ఈ నేపథ్యంలో టెక్నాలజీతో మార్పు సాధ్యం అనే భావనను కలిగి ఉండాలి.

కారణాలెన్నో
ప్రస్తుతం చిన్న, పెద్దా తేడా అని లేకుండా అన్ని రకాల ప్రచురణ సంస్థల వరకు డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రాధాన్యతనిస్తున్నాయి. విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే దీనికి కారణాలు ఎన్నో. విప్లవంలా దూసుకు వ చ్చిన స్మార్ట్ ఫోన్లు.. రోజు రోజుకు అధికమవుతున్న ట్యాబ్‌ల వినియోగం, చౌక ధరలకే లభ్యమవుతున్న ఇంటర్నెట్ సేవలు, నచ్చిన సమయంలో ఎంచుకున్న మాధ్యమంలో చదివే సాదుపాయం, వృత్తి రీత్యా పుస్తకాల సేకరణకు సమయం వెచ్చించలేకపోవడం, సంబంధిత అప్లికేషన్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, చౌక ధరకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, ప్రజల అవగాహన స్థాయి పెరగడం, ఆసక్తి మారడం వంటివి ఎన్నో డిజిటలైజేషన్ ప్రక్రియ ఊపందుకోవడానికి కారణాలుగా పేర్కొనవచ్చు.

అర్హతలు
ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు వారి హోదాను బట్టి విద్యార్హతలు అవసరం. ఎడిటర్స్, జర్నలిస్ట్‌లు, ఫ్రూఫ్ రీడర్లు, కంపోజర్లు, పేజ్‌మేకర్స్‌కు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సాంకేతిక విభాగాల కోసం బీటెక్/బీఈ (ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఏదైనా టెక్నాలజీ నేపథ్యం ఉన్న విద్యార్థులు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఎడిటర్స్, జర్నలిస్ట్‌లు, ఫ్రూఫ్ రీడర్లకు ఇంగ్లిష్/సంబంధిత భాషలపై పట్టు ఉండాలి. కంపోజర్ సంబంధిత విభాగాలకు కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ (బైలింగ్వల్) వంటి నైపుణ్యాలు అవసరం. గ్రాఫిక్ ఆర్టిస్ట్‌లకు కోరల్ డ్రా, పేజ్‌మేకర్, ఫోటోషాప్, కంటెంట్‌ను డిజిటల్ రూపంలోకి మార్చాలి కాబట్టి హెచ్‌టీఎంఎల్ పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి. డిజిటల్ పబ్లికేషన్‌కు సంబంధించి కొన్ని యూనివర్సిటీలు మాత్రమే కోర్సులను అందిస్తున్నాయి. అవి.. అన్నామలై యూనివర్సిటీ (బీఎస్సీ-డిజిటల్ పబ్లిషింగ్, వెబ్‌సైట్: www.dpub.info) పెరియార్ మనియామై యూనివర్సిటీ (పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, వెబ్‌సైట్: www.pmu.edu)

భవిష్యత్ చిత్రం
డిజిటల్ పబ్లికేషన్ రంగం విలువ 430బిలియన్ డాలర్లు. భవిష్యత్‌లో సంప్రదాయ పద్ధతుల్లో పుస్తకాల ప్రచురణ తగ్గొచ్చు. ఆన్‌లైన్‌లో డిజిటల్‌పుస్తకాలు అందుబాటులోకి రావడం అధికమవుతుంది. ఎలక్ట్రానిక్ రూపంలో వెలువడే పత్రికల సంఖ్య పెరగొచ్చు. దాంతో డిమాండ్ మేర కు ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అధిక స్థాయిలో మానవ వనరుల అవసరం ఉంటుంది. దాంతో భవిష్యత్‌లో ఈ రంగం క్రేజీయెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సంప్రదాయ.. సాంకేతికతల సమ్మేళనం
Bavitha నేటి టెక్నాలజీ యుగంలో జర్నలిజంలోనూ ఆధునిక పోకడలకు చిరునామా వెబ్ జర్నలిజం. ఒకవైపు సంప్రదాయ జర్నలిజం అంశాలు.. మరోవైపు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల సమ్మేళనంగా ఈ కోర్సును పేర్కొనొచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దినపత్రికలతోపాటు.. వేల సంఖ్యలో న్యూస్ వెబ్‌సైట్స్ 24x7 దృక్పథంతో సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో పోటీ పెరిగింది. ‘తాజా సమాచారం’ పేరుతో నిమిషానికో కొత్త వార్త ప్రత్యక్షమవుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పాత్రికేయులు సేకరించిన సమాచారాన్ని అందుకుని.. ఇంటర్నెట్ రిసోర్సెస్ ద్వారా దానికి గల నేపథ్యం, కారణాలు, ఇతర విశ్లేషణలు, వర్ణనలు, గ్రాఫికల్ ప్రజెంటేషన్ ద్వారా సదరు వెబ్‌సైట్ వీక్షకులకు ఆకర్షణీయంగా సమాచారాన్ని అందించడానికి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ఈ నైపుణ్యాలు కల్పించే కోర్సు వెబ్ జర్నలిజం. ఈ కోర్సులో అడుగుపెట్టే వారికి ప్రధానంగా విశ్లేషణ, పరిశోధన నైపుణ్యాలు కావాలి. అంతేకాకుండా మాతృభాషతోపాటు కనీసం రెండు ఇతర భాషల్లో పరిజ్ఞానం ఉంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ కోర్సుకు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పలు షార్ట్‌టర్మ్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఔత్సాహిక విద్యార్థులు, సుస్థిర భవిష్యత్తు కోరుకునే వారు ఆయా కోర్సుల స్వరూపాన్ని తెలుసుకోవాలి. సదరు కరిక్యులంలో సంప్రదాయ జర్నలిజం అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటేనే చేరాలి. బేసిక్ జర్నలిజం నాలెడ్జ్ లేకుండా ఈ రంగంలో రాణించడం అంత సులువు కాదు. ఇక.. కోర్సు పూర్తయిన వారికి అవకాశాల విషయంలో ఆందోళన అనవసరం. న్యూస్ పోర్టల్స్, వెబ్‌సైట్స్‌తోపాటు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, సాఫ్ట్‌వేర్ సంస్థల్లోనూ ఆన్‌లైన్ ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్ విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
Published date : 22 May 2014 04:32PM

Photo Stories