Skip to main content

ఉజ్వల కెరీర్, దేశసేవకు.. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి మంచి మార్గం..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) పరీక్ష. యూపీఎస్సీ ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్ అర్హతతో త్రివిధ దళాల్లో అధికారిగా కెరీర్‌ను సుస్థిరం చేసుకోవడంతో పాటు దేశ రక్షణలో భాగస్వామి అయ్యేందుకు వీలుకల్పిస్తోంది ఈ పరీక్ష. దీనిపై స్పెషల్ ఫోకస్..

ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ద్వారా పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో 135వ కోర్సు లేదా ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ 97వ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఈ కోర్సులు 2016, జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయి.

ఖాళీల వివరాలు:
మొత్తం:
375
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ): 320 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70).
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 55

విద్యార్హత:
ఎన్‌డీఏ (ఆర్మీ వింగ్):
స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు లేదా యూనివర్సిటీ పరిధిలో 10+2 ఉత్తీర్ణత.
ఎన్‌డీఏ (ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలు), ఇండియన్ నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వీరు 1996, జూలై 2-జూలై 1, 1999 మధ్య జన్మించి ఉండాలి. నిర్దేశించిన విధంగా తగిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: రాతపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.

రాత పరీక్ష విధానం:

సబ్జెక్టు

సమయం

మార్కులు

 మ్యాథమెటిక్స్

2½ గంటలు

300

జనరల్ ఎబిలిటీ టెస్ట్

2½ గంటలు

600


ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ విభాగాల్లోని ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.

జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో రెండు విభాగాలుంటాయి. వీటిలో 200 మార్కులకు ఇంగ్లిష్, 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు జవాబుకు సరైన సమాధానాలకు ఇచ్చే మార్కుల నుంచి 0.33 మార్కులు కోత విధిస్తారు.

ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్:
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఈ పరీక్షలు/ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో రెండు దశలుంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే రెండో దశ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు.

మొదటి రోజు: ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్, నాన్ వెర్బల్), పిక్చర్ పెర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్.
రెండో రోజు: సైకలాజికల్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్.
మూడో రోజు: గ్రూప్ డిస్కషన్, ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, గ్రూప్ అబ్‌స్టెకల్ రేస్, లెక్చరేట్.
నాలుగో రోజు: ఇండివిడ్యువల్ అబ్‌స్టెకల్స్, కమాండ్ టాస్క్, ఫైనల్ గ్రూప్ టాస్క్.
ఐదో రోజు: కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి.

శిక్షణ వివరాలు:
అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైన వారిని సర్వీస్‌తో నిమిత్తం లేకుండా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణకు ఎంపిక చేస్తారు. దీన్ని మూడేళ్లపాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రెండున్నరేళ్లు ఈ మూడు సర్వీస్‌లకూ శిక్షణ ఒకేవిధంగా ఉంటుంది. డిగ్రీ తరగతులతోపాటు సంబంధిత ట్రైనింగ్ ఉంటుంది. చివర్లో అభ్యర్థుల ఎంపికను అనుసరించి బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీఏ డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. తర్వాత ఆర్మీ క్యాడెట్లు ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్), నేవల్ క్యాడెట్లు ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లో సంబంధిత అంశాల్లో ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. ఈ సమయంలో నెలకు రూ.21 వేల వేతనం చెల్లిస్తారు.

నేవల్ అకాడమీకి ఎంపికైన వారు నాలుగేళ్లపాటు ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల)లో శిక్షణ పొందుతారు. తర్వాత వీరికి బీటెక్ డిగ్రీ అందిస్తారు.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలిన వారు రూ.100 ఫీజును ఎస్‌బీఐలో చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 23, 2015.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19, 2015.
వెబ్‌సైట్: www.upsconline.nic.in

ప్రిపరేషన్
మ్యాథమెటిక్స్:
ఈ విభాగానికి మూడు వందల మార్కులు కేటాయించారు. ఆల్జీబ్రాలో కాన్సెప్ట్ ఆఫ్ ఎ సెట్, ఆపరేషన్స్ ఆన్ సెట్స్, వెన్‌డయాగ్రమ్స్, డీ మోర్గాన్ లాస్, కార్టీసియన్ ప్రొడక్ట్, రిలేషన్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యునిటీ, ప్రోగ్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్-కాంబినేషన్స్, బైనామియల్ థీరమ్ తదితర అంశాలుంటాయి. మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్‌లో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ మెథడ్ వంటివి ఉంటాయి. ట్రిగనోమెట్రీలో ట్రిగనోమెట్రిక్ రేషియోస్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. అనలిటికల్ జామెట్రీ (2డీ, 3డీ), డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీ చాప్టర్ల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్ష స్థాయి ఇంటర్మీడియెట్ కాబట్టి సంబంధిత తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన భావనలను, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వివిధ సూత్రాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ప్రాక్టీస్ చేయాలి. రెండో పేపర్‌తో పోలిస్తే మొదటి పేపర్‌లోనే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్, ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లకు సిద్ధమయ్యేవారు ఈ ప్రశ్నలకు మిగిలినవారితో పోలిస్తే సులువుగానే సమాధానాలు గుర్తించొచ్చు. సిలబస్‌లోని చాప్టర్లపై దృష్టిసారించి, సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేస్తే ప్రశ్నల సరళి తెలియడంతోపాటు ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజ్ ఉందో తెలుస్తుంది. అందుకనుగుణంగా విద్యార్థులు ప్రిపరేషన్ శైలిని మలచుకోవాలి.

పేపర్-2 జనరల్ ఎబిలిటీ టెస్ట్:
పార్ట్-ఎ ఇంగ్లిష్:
దీనికి 200 మార్కులు ఉంటాయి. అభ్యర్థికి ఇంగ్లిష్‌పై ఏ మాత్రం అవగాహన ఉందో పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. పదాలు ఉపయోగించడం, వ్యాకరణం, పదసంపద (వొకాబులరీ), కాంప్రహెన్షన్ అంశాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. సెంటెన్స్ కరెక్షన్, ఆర్టికల్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, డెరైక్ట్ ఇన్‌డెరైక్ట్ సెంటెన్సెస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ స్థాయిల్లో ఉండే జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఉన్న వివిధ వ్యాకరణాంశాలను సాధన చేయాలి.

పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్: ఇందులో ఆరు సెక్షన్‌లు (సెక్షన్ ఎ నుంచి ఎఫ్ వరకు) ఉంటాయి. వీటికి 400 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.

సెక్షన్-ఏ ఫిజిక్స్: 25 శాతం ప్రశ్నలు ఈ సబ్జెక్ట్ నుంచే అడుగుతారు. సూత్రాలు, నియమాలు, ప్రమాణాలు, పదార్థాల ధర్మాలు, ద్రవ్యరాశి, భారం, ఘనపరిమాణం, పీడనం, వేగం, త్వరణం, గురుత్వాకర్షణ శక్తి, న్యూటన్ నియమాలు, శక్తి, శబ్దతరంగాలు, లఘు లోలకం, కాంతి, పరావర్తనం, వక్రీభవనం.. ఇలా భౌతికశాస్త్రంలోని అన్ని ప్రాథమికాంశాలనూ బాగా చదువుకోవాలి. జేఈఈ మెయిన్ వంటి పోటీపరీక్షల మెటీరియల్‌ను సిలబస్ ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో చదవడంతోపాటు ఇంటర్ రెండేళ్ల ఫిజిక్స్ పాఠ్యపుస్తకాల్లోని ప్రధాన సూత్రాలను, భావనలను చదివితే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించొచ్చు.

సెక్షన్-బీ కెమిస్ట్రీ: ఈ సబ్జెక్టుకు 15 శాతం మార్కులు కేటాయించారు. పదార్థ భౌతిక, రసాయన మార్పులు; సూత్రాలు, సంకేతాలు, సమీకరణాలు, ధర్మాలు, ఆమ్లా లు, క్షారాలు, లవణాలు, ఆక్సీకరణం, క్షయకరణం; కార్బన్, దాని రూపాంతరాలు; సహజ, రసాయన ఎరువులు; వివిధ పదార్థాల ఉత్పత్తికి అవసరమయ్యే ఇతర పదార్థాలు, పరమాణు సిద్ధాంతాలు మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. 9, 10 తరగతుల్లోని సంబంధిత టాపిక్స్‌లోని ప్రాథమిక అంశాలను చదువుతూ నోట్స్ రాసుకోవాలి. ఈ ప్రాథమిక భావనలను దగ్గర ఉంచుకుని ఇంటర్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందొచ్చు.

సెక్షన్-సి జనరల్ సైన్స్: ఈ విభాగం నుంచి 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఎక్కువ ప్రశ్నలు జీవశాస్త్రం నుంచే వస్తాయి. సజీవులు-నిర్జీవుల మధ్య భేదాలు, కణాల జీవనం, మొక్కలు, జంతువుల ఎదుగుదల, వాటి పునరుత్పత్తి, మానవ దేహం-ముఖ్యావయవాలపై ప్రాథమిక పరిజ్ఞానం, సాధారణ రోగాలు- కారణాలు- నివారణ, ఆహారం, శక్తి కేంద్రకాలు, సమతులాహారం, సౌర కుటుంబం, ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు..వంటి అంశాల్లో ప్రశ్నలొస్తాయి. 8, 9,10 తరగ తుల జీవ శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో ముఖ్యాంశాలను సినాప్సిస్ రూపంలో రాసుకుని చదువుకుంటే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించొచ్చు.

సెక్షన్-డీ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం: 20 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచి వస్తాయి. భారతదేశ చరిత్ర, నాగరికత, సంస్కృతి, భారత స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగం ప్రాథమికాంశాలు, కార్యనిర్వహణ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు- ప్రాథమిక అంశాలు, పంచాయతీరాజ్, గాంధీజీ బోధనలు, ఆధునిక ప్రపంచం, అమెరికా స్వాతంత్య్రోద్యమం, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, రష్యా విప్లవం, సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం, పంచశీల సూత్రాలు, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, ఆధునిక ప్రపంచంలో భారత్ పాత్ర... అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి.

సెక్షన్-ఈ జాగ్రఫీ: ఈ విభాగానికి 20 శాతం ప్రశ్నలు కేటాయించారు. భూమి, ఆకారం, పరిమాణం, అక్షాంశాలు, రేఖాంశాలు, భూ భ్రమణం, భూ పరిభ్రమణం- వాటి ప్రభావాలు, శిలాజాలు-వాటి వర్గీకరణ, భూకంపాలు, వాతావరణం, పీడనం, గాలులు, తుఫాన్‌లు, తేమ, భారతదేశ భౌగోళిక స్వరూపం, దేశంలో లభించే ఖనిజాలు, ముఖ్య శక్తి ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయం, పారిశ్రామిక కేంద్రాలు, దేశంలో రేవు పట్టణాలు, రోడ్డుమార్గాలు-రవాణావ్యవస్థ, ఎగుమతులు, దిగుమతులు అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.

సెక్షన్-ఎఫ్ (కరెంట్ ఈవెంట్స్): ఈ విభాగానికి 10 శాతం మార్కులు కేటాయించారు. ఇందుకోసం ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను అధ్యయనం చేయాలి. వ్యక్తులు- అవార్డులు, క్రీడలు, వ్యక్తులు, సదస్సులు- ప్రదేశాలు వంటి వాటిపై దృష్టిపెట్టాలి. పరీక్ష తేదీనాటికి పది నుంచి ఎనిమిది నెలల ముందు వరకు ముఖ్య పరిణామాలను చదివితే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు. మలయాళ మనోరమ ఇయర్ బుక్, ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది.
Published date : 16 Jan 2015 02:25PM

Photo Stories