Skip to main content

కెరీర్ గైడెన్స్..సీడీఎస్‌ఈ

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. దేశ రక్షణలో ఈ మూడు విభాగాలకు ఎనలేని ప్రాధాన్యత. వాటిలో అడుగుపెట్టి దేశ సేవ చేయాలనుకునే యువత ఎందరో. కనీసం ‘జవాన్’ గానైనా జనహితం కోసం పాటు పడితే చాలనుకునే వారు లెక్కకు మిక్కిలి. అంతటి ప్రాధాన్యమున్న త్రివిధ దళాల్లో ప్రారంభంలోనే ‘కమిషన్డ్ ర్యాంక్’లో అడుగు పెట్టేందుకు.. సంఘంలో గౌరవం, చక్కటి ఆదాయం పొందేందుకు సరైన అవకాశం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ). సీడీఎస్ పరీక్ష ద్వారా ఇండియన్ మిలటరీ అకాడెమీ , నావల్, ఎయిర్‌ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ప్రవేశం లభిస్తుంది. ఎంపికైన వాళ్లకు సంబంధిత విభాగంలో ఉన్నత హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది.

అర్హత:
ఇండియన్ మిలటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడెమీకి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు, ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి మాత్రమే మహిళలు అర్హులు.

వయసు:
  • ఇండియన్ మిలటరీ అకాడెమీ: 19-24 ఏళ్లు.
  • నావల్ అకాడెమీ: 19-22 ఏళ్లు.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ: 19-23 ఏళ్లు.
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ: 19-25 ఏళ్లు.
పరీక్ష విధానం:
సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలటరీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ ఔత్సాహికులకు ఒక విధంగా.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) ఔత్సాహికులకు మరోవిధంగా ఉంటుంది. ఆ వివరాలు..

మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రాత పరీక్ష
  • పేపర్-1 ఇంగ్లిష్ - 100 మార్కులు
  • పేపర్-2 జనరల్ నాలెడ్జ్ - 100 మార్కులు
  • పేపర్-3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ - 100 మార్కులు
ఓటీఏ పరీక్ష విధానం
  • పేపర్-1 ఇంగ్లిష్ - 100 మార్కులు
  • పేపర్-2 జనరల్ నాలెడ్జ్ - 100 మార్కులు
ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు.

సబ్జెక్ట్ విశ్లేషణ
జనరల్ ఇంగ్లిష్:
అభ్యర్థుల్లో ఇంగ్లిష్ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్, వర్డ్ యూసేజ్ వంటి వాటిపై దృష్టి సారించడం మేలు. వీటితోపాటు యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, ప్యాసేజ్ రీడింగ్, వాటిలోంచి కీలకాం శాలను పసిగట్టే నేర్పు ఉంటే ఈ విభాగంలో రాణించడం తేలికే. దీనికోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వంటి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది.

జనరల్ నాలెడ్జ్: భారత చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్నిరంగాల్లో (సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, పాలిటీ) ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా చరిత్రకు సంబంధించి భారత స్వాంతంత్రోద్యమంపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన సవరణలు -వాటి ఉద్దేశాలు; రాజ్యాంగ స్వరూపం-లక్షణాలు; సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి. జాగ్రఫీలో.. ప్రాథమికంగా భారత భౌగోళిక సరిహద్దులు, పర్వతాలు- అగాథాలు; నదులు- పరీవాహక ప్రాంతాలు- ప్రాజెక్టులు - డ్యాంలు; సహజ వనరులు వంటి అంశాలపై ప్రిపరేషన్ లాభిస్తుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా సమకాలీన అంశాల పైనే ప్రశ్నలడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులు ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన తాజా పరిణామాలు (క్షిపణి పరీక్షలు- ప్రయోగించిన తేదీలు- వాటి పరిధులు, రక్షణ శాఖలో నియామకాలు, భారత్ యుద్ధాలు-ప్రత్యర్థులు-సమయం -విజేతలు తదితర వివరాలు) తెలుసుకోవడం మంచిది.

మ్యాథమెటిక్స్: వాస్తవానికి సీడీఎస్ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌గా పేర్కొన్నారు. ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్ అంశాలను ప్రశ్నలుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి ఇంటిజర్స్, నంబర్ సిస్టమ్, రియల్ నంబర్స్, దూరం-కాలం; కాలం- పని; శాతాలు; వడ్డీ రేట్లు; లాభ నష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.

ఇక అల్జీబ్రాలో రిమైండర్ థీరమ్, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం; పాలినామియల్ థీరమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్ అండ్ కో-ఎఫిషియెంట్స్ తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అదే విధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధ ఫార్ములాలు, సిద్ధాంతాలు, భావనలు తెలుసుకోవాలి.

రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ :
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అంతకంటే కఠినమైన ప్రక్రియను సర్వీస్ సెలెక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్; థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్; వర్డ్ అసోసియేషన్ టెస్ట్; గ్రూప్ టెస్ట్ పేరిట అభ్యర్థుల్లోని మానసిక సామ ర్థ్యాన్ని, ధైర్య సాహసాలను పరీక్షిస్తారు.ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదారు రోజులపాటు సాగుతుందంటే దీని క్లిష్టత స్థాయి తెలుసుకోవచ్చు.

ఈ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కోవాల్సిన అంశాలు:
సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్: నిర్ణీత సంఘటనలకు సంబంధించి 60 ప్రశ్నలు అడుగుతారు. కేవలం 30 నిమిషాల్లో వాటికి సరైన పరిష్కారం కనుక్కోవాలి

థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్: అభ్యర్థికి 12 దృశ్యాలను చూపిస్తారు. వాటికి సరితూగే విధంగా 36 నిమిషాల్లో ఒక కథ రూపొందించాలి.

వర్డ్ అసోసియేషన్ టెస్ట్: ఇందులో అభ్యర్థికి మొత్తం 60 పదాలిస్తారు. ప్రతి పదాన్ని ఆధారం చేసుకుంటూ 60 అర్థవంతమైన వాక్యాలు రూపొందించాల్సి ఉంటుంది. ఒక్కో పదానికి కేటాయించే సమయం కేవలం పదిహేను సెకండ్లు.

గ్రూప్ టెస్ట్: ఎనిమిది నుంచి పదిమంది అభ్యర్థుల మధ్యలో జరిగే గ్రూప్ టెస్ట్‌లో నిర్ణీత సంఘటనలకు సంబంధించి ప్లానింగ్, డిస్కషన్, డిబేట్స్ ఉంటాయి.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి.

ట్రైనింగ్ అకాడెమీల్లో
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకున్న వాళ్లకు వారు ఎంచుకున్న ప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్ని బట్టి ఏదో ఒక సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ-డెహ్రాడూన్, నేవల్ అకాడెమీ-గోవా, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ-హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ-చెన్నైల్లో ఆయా విభాగాలకు చెందిన శిక్షణ నిర్వహిస్తారు. రక్షణ దళాలకు అవసరమైనవన్నీ శిక్షణలో నేర్పుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అకాడెమీల్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. ఓటీఏ అభ్యర్థులకు 11 నెలల శిక్షణ నిర్వహిస్తారు. ట్రెక్కింగ్, జంపింగ్, స్కిప్పింగ్, రైఫిల్ షూటింగ్ లాంటి సాహసకృత్యాలు, అందులోని మెలకువలు నేర్పుతారు. శత్రువుల వ్యూహాన్ని తిప్పికొట్టడం, లక్ష్యసాధన, ఆత్మ విశ్వాసం పెరిగేలా చేయడం శిక్షణ లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఆల్ రౌండర్‌గా రాణించేలా తర్ఫీదు నిర్వహిస్తారు. శిక్షణ కాస్త కఠినంగా ఉంటుంది. కాబట్టి మనో సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ శిక్షణ ద్వారా జీవితం పట్ల పరిణతి వస్తుంది. క్రమబద్ధ జీవనం అలవడుతుంది.

కెరీర్
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమతుంది. ఈ మూడూ సమాన హోదా ఉద్యోగాలే. హోదాకు తగ్గట్టుగానే బాధ్యతలుంటాయి. 24/7 పర్యవేక్షణ ఉంటుంది. బృందంతో కలిసి పనిచేయాలి. కొన్నిసార్లు పరుగులు తీస్తూ పని చేయాల్సి వస్తుంది. బృందనేతగా సభ్యులకు మార్గనిర్దేశం చేయాలి. ఏ సర్వీస్‌లో చేరినప్పటికీ కెరీర్ ఆరంభంలోనే అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ.45,000కు పైగా వేతనం లభిస్తుంది.

బెనిఫిట్స్
ఉన్నత స్థాయి వసతులు, అన్నింటా రాయితీలు, సివిల్స్ లాంటి పరీక్షలకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల వరకు సడలింపు, జీవితాంతం కుటుంబమంతటికీ ఉచితంగా పూర్తి స్థాయి మెడికల్ సదుపాయాలు, బీమా రక్షణ, సబ్సిడీ ధరల్లో ఆహార సామగ్రి, ఉచిత విమాన, రైలు ప్రయాణాలు, బంజరు భూముల కేటాయింపు, తక్కువ వడ్డీకి రుణాలు, ఉన్నత చదువుల కోసం రెండేళ్లపాటు పెయిడ్ లీవ్. అప్పుడప్పుడూ విదేశీ పర్యటనలూ ఉండొచ్చు. ఏటా 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు ఉంటాయి. పిల్లలకు ఉచిత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్, స్కాలర్‌షిప్పులు ఇస్తారు.

పదోన్నతులు
ప్రతి రెండు లేదా మూడేళ్లకు ప్రమోషన్లు ఉంటాయి. పన్నెండేళ్లు సర్వీస్‌లో కొనసాగితే సంబంధిత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ హోదా పొందొచ్చు.

నోటిఫికేషన్ షెడ్యూల్:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీడీఎస్‌ఈ కోసం ప్రతి ఏడాది సాధారణంగా రెండు సార్లు ఆగస్టు, మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆగస్టులో విడుదల చేసే నోటిఫికేషన్‌కు ఫిబ్రవరిలో, మార్చి నోటిఫికేషన్‌కు ఆగస్టులో రాత పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలకు: https://upsc.gov.in
Published date : 07 May 2012 06:19PM

Photo Stories