Skip to main content

సీఏ-సీపీటీ సన్నద్ధత - ప్రిపరేషన్ ప్రణాళిక

దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సమాంతరంగా కామర్స్ రంగం ఎదుగుతోంది. కంప్యూటర్ కోర్సుల కారణంగా ఈ రంగం కొంతకాలం వెనక్కితగ్గినా, మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో వస్తున్న మార్పుల కారణంగా సుశిక్షితులైన కామర్స్ నిపుణులకు దేశ, విదేశాల్లో కళ్లు చెదిరే వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ ఎంఈసీతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)-సీపీటీకి ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై స్పెషల్ ఫోకస్...
మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్
ఇంటర్మీడియెట్ గ్రూపుల్లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ గ్రూపును క్రేజీ గ్రూపుగా చెప్పొచ్చు. ఎంఈసీని దిగ్విజయంగా పూర్తిచేసి ఉజ్వల భవితను ఇచ్చే ప్రొఫెషనల్ కోర్సుల్లోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం చాలా మంది సీఏ లక్ష్యంగా నిర్దేశించుకొని, పదో తరగతి తర్వాత ఇంటర్ ఎంఈసీ గ్రూపులో చేరుతున్నారు. ఇంటర్‌తో పాటు సీఏ-సీపీటీ(కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)కు సిద్ధం కావచ్చు.

ఎంఈసీ+సీపీటీ
  • వీలైనంత వరకు ఎంఈసీ, సీపీటీలను ఒకేసారి బోధించే కళాశాలను ఎంపిక చేసుకోవటం మంచిది.
  • ఎంఈసీ, సీఏ-సీపీటీకి ఒకేసారి సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి.
  • ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే సీపీటీకి చదవాలి. రోజుకు పది గంటలు చదివామనుకుంటే ఎనిమిది గంటలు ఇంటర్‌కు, రెండు గంటలు సీపీటీకి కేటాయించాలి.
  • తరగతి గదిలో లెక్చరర్ చెప్పే అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి.
  • వీలైనంతలో సీపీటీ క్లాసులో లెక్చరర్ చెప్పిన కాన్సెప్టులను ఏరోజుకారోజే చదవాలి.
  • సీపీటీకి సంబంధించి కళాశాల నిర్వహించే పరీక్షలను తప్పకుండా రాయాలి. దీనివల్ల ప్రిపరేషన్ స్థాయిపై అంచనాకు రావొచ్చు.
  • జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగిశాక, వేసవి సెలవుల్లో సీపీటీకి సంబంధించిన జూనియర్ ఇంటర్ సిలబస్ మొత్తం పూర్తిచేసుకోవాలి.
  • ఎంఈసీ, సీపీటీలను సమాంతరంగా చదవటం వల్ల 6 నుంచి 9 నెలల సమయం వృథా కాకుండా చూడొచ్చు
  • ఎంఈసీలోని సబ్జెక్టులపై అవగాహన, సీపీటీలో మంచి స్కోర్ సాధించేందుకు ఉపకరిస్తుంది.

మ్యాథ్స్
ఎంఈసీలో మ్యాథమెటిక్స్ కీలకమైన సబ్జెక్టు. మొదటి ఏడాదిలో 100 మార్కులకు రెండు పేపర్లు (1ఎ, 1బి) ఉంటాయి. రెండో ఏడాదిలోనూ ఇదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు సీపీటీలోనూ ఉంటుంది కాబట్టి ఇంటర్ మ్యాథ్స్, సీపీటీ మ్యాథ్స్‌ను ఒకేసమయంలో చదవటం వల్ల సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.
  • 2-ఎ సిలబస్‌లో డిమోవియర్స్ సిద్ధాంతం, సమీకరణ వాదం, ద్విపద సిద్ధాంతం, విస్తరణ కొలతలు, సంభావ్యత, యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యతా విభాజనాలు ముఖ్యమైనవి.
  • 2-బి సిలబస్‌లో వృత్తం, పరావలయం, సమాకలనం, నిశ్చితసమాకలనులు, అవకలన సమీకరణాలు ముఖ్యమైనవి.

ఎకనామిక్స్
  • ఫస్టియర్‌లో ఎకనామిక్స్ సిలబస్‌లో పది యూనిట్లు ఉన్నాయి. అవి.. ఉపోద్ఘాతం; వినియోగ సిద్ధాంతం; డిమాండ్ సిద్ధాంతం; ఉత్పత్తి సిద్ధాంతం, విలువ సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతం, జాతీయాదాయం, స్థూల ఆర్థిక అంశాలు, ద్రవ్యం-బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, ఆర్థికశాస్త్రం-గణాంకాలు.
  • సెకండియర్‌లో ఆర్థికవృద్ధి, అభివృద్ధి; జనాభా, మానవ వనరుల అభివృద్ధి; జాతీయాదాయం; వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, తృతీయ రంగం, ప్లానింగ్-ఆర్థిక సంస్కరణలు, పర్యావరణం-సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ.
  • మొదటి ఏడాదిలో వంద మార్కులకు, రెండో ఏడాదిలో వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, ఆర్థికశాస్త్ర గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకోవాలి.

కామర్స్
  • ఎంఈసీలో చేరిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రం (కామర్స్) కొత్త సబ్జెక్టుగా ఎదురవుతుంది. అందువల్ల దీనిపై ఆసక్తి పెంచుకొని పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవడం అవసరం. ఇది సీఏకు ఉపయోగపడుతుంది.
  • ప్రతి ఏడాదిలోనూ కామర్స్ ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 కామర్స్ (థియరీ)కు 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి.
  • మొదటి సంవత్సరం సిలబస్‌లో వ్యాపార భావన, వ్యాపార కార్యకలాపాలు, వ్యాపార సంస్థలు, భాగస్వామ్యం, బహుళజాతి సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, వ్యాపార నూతన పద్ధతులు తదితర అంశాలుంటాయి. అకౌంటెన్సీలో బుక్‌కీపింగ్-అకౌంటింగ్,అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్,డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ వంటివి ఉంటాయి.
  • సెకండియర్‌లో పార్ట్-1లో అంతర్జాతీయ వర్తకం, మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యవస్థాపకులు, వ్యవస్థాపకత తదితర అంశాలుంటాయి.
  • అకౌంటెన్సీలో వర్తకం బిల్లులు, తరుగుదల, కన్‌సైన్‌మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు, కంపెనీ ఖాతాలు తదితర అంశాలుంటాయి.
  • అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, Calculations ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి.

సీఏ-సీపీటీ సన్నద్ధత
ఇటీవలి కాలంలో భారతీయ సీఏలకు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ).. 2016 నుంచి సీఏ కోర్సులో కొత్త సంస్కరణలను అమలు చేయనుంది. ఈ సంస్కరణల వల్ల దేశీయ సీఏలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.

ఒకవైపు ఎంఈసీలోని సబ్జెక్టులను చదువుతూ మరోవైపు సీపీటీకి సిద్ధమవాలి. దీనికి కచ్చితమైన సమయపాలన పాటించాలి. ప్రణాళిక ప్రకారం ఏ రోజు అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. లేదంటే తర్వాత ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.

అకౌంట్స్ (60 మార్కులు):
  • అకౌంట్స్‌కు సంబంధించిన ప్రతి చాప్టర్లో జర్నల్ ఎంట్రీలు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి.
  • ఎంట్రీ విషయంలో తప్పులు జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాతే సమాధానం రాయాలి.
  • అకౌంట్స్ సబ్జెక్టు సీపీటీతో పాటు ఐపీసీసీ, సీఏ ఫైనల్‌కు కూడా కీలకమైనది.
  • థియరీ విభాగంపై ఎక్కువ దృష్టిసారించాలి. థియరీ, సమస్యల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • Partnership Accounts, Company Accounts and Accounting an Introduction ముఖ్యమైన చాప్టర్లు.

మర్కంటైల్ లా:
  • మర్కంటైల్ లాలోని 40 మార్కులకు 32 నుంచి 35 మార్కులను తేలిగ్గా తెచ్చుకోవచ్చు.
  • ఇది వివాదాలతో కూడుకున్న సబ్జెక్టు కాబట్టి ప్రతి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉండదు.
  • సీపీటీ పరిధిలోని సెక్షన్ నంబర్స్,కేస్ స్టడీస్,ఆథర్ పేర్లు, నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • మర్కంటైల్ లా సబ్జెక్టుపై సీపీటీలో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
  • అన్ని చాప్టర్లలోనూ Identify the correct/incorrect/all of the above/none of the above ప్రశ్నలుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం గుర్తించాలి.
  • Indian Partnership Act, Sale of Goods Act ముఖ్యమైన చాప్టర్లు.

ఎకనామిక్స్ (50 మార్కులు):
  • ఎకనామిక్స్‌ను రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. అవి.. మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్.
  • డయాగ్రమ్స్, డెఫినిషన్స్, ఆథర్ పేర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సూత్రాలపై ఎక్కువ దృష్టికేంద్రీకరించాలి.
  • మైక్రో ఎకనామిక్స్ నుంచి సమస్యలు వస్తే కంగారు పడకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి, సమాధానం గుర్తించాలి.
  • మైక్రో ఎకనామిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్లు: థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రైస్ అండ్ అవుట్‌పుట్ డిటర్మినిషన్.
  • మైక్రో ఎకనామిక్స్‌లో facts and figures (సంవత్సరాలు, శాతాలకు సంబంధించిన సమాచారం చాలా ముఖ్యమైనవి).
  • ఇప్పటికే పాఠ్య పుస్తకాలు లేదా సీపీటీకి సంబంధించిన మెటీరియల్ చదివినట్లయితే, వాటినే మళ్లీమళ్లీ చదవాలి. కొత్త స్టడీ మెటీరియల్ లేదా ఇతర పుస్తకాలు చదవద్దు. కొత్త మెటీరియల్‌ను చదవటం వల్ల గందరగోళం తలెత్తే అవకాశముంది. ఉదాహరణకు మర్కంటైల్ లా సబ్జెక్టులోని కొన్ని కేస్‌స్టడీలు పుస్తకానికి, పుస్తకానికి మారిపోతాయి.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సంస్థ స్టడీ మెటీరియల్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. సీపీటీలోని అకౌంట్స్, మర్కంటైల్ లా సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. మొదటి ప్రయత్నంలో సీపీటీలో ఉత్తీర్ణత సాధించాలంటే ఈ రెండు సబ్జెక్టులపైనా పట్టు సాధించాలి. ప్రిపరేషన్‌లో అధిక సమయాన్ని వీటికి కేటాయించాలి.

టిప్స్
  • ర్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు 200 మార్కులకు కనీసం 186 మార్కులు సాధించగలిగితే ఆలిండియా స్థాయిలో టాప్-10 ర్యాంకు పొందొచ్చు.
  • మీకు తెలిసిన ఎంసీక్యూని మార్చి అడిగినా సమాధానం ఇవ్వగలిగేలా ఉండాలి. అప్పుడే ర్యాంకు లక్ష్యాన్ని సాధించగలరు.
  • ప్రతి సబ్జెక్టు నుంచి Identify correct statement or Identify incorrect statement అనే ఎంసీక్యూలు ఇస్తారు. ఇవి ముఖ్యమైనవి.
  • ప్రిపరేషన్ సమయంలో ఏవైనా సందేహాలు వస్తే, వాటిని ఒక పుస్తకంలో రాసుకోవాలి. తర్వాత వాటిని ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
  • ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తంమీద 100 మార్కులతో పాటు సబ్జెక్టు వారీగా 30 శాతం మార్కులు పొందాలి. అందువల్ల ప్రిపరేషన్‌లో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలి.
  • పరీక్షకు నెల రోజుల ముందు నుంచి కాలిక్యులేటర్‌ను వేగంగా ఉపయోగించేలా ప్రాక్టీస్ చేయాలి. ఇదే కాలిక్యులేటర్‌ను పరీక్ష సమయంలోనూ ఉపయోగించాలి.
  • సీపీటీ పరీక్ష ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు జరుగుతుంది. ఉదయం 100 మార్కులకు, మధ్యాహ్నం 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నిమిషం సమయం అందుబాటులో ఉంటుంది. అందువల్ల సమయపాలన పాటించాలి.
  • సమాధానం తెలియని ప్రశ్నను విడిచిపెట్టాలి. లేదంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
  • సీపీటీ పూర్తిచేసిన తర్వాత తొమ్మిది నెలలకు ఐపీసీసీ.. అందులో ఉత్తీర్ణత సాధించాక రెండున్నర సంవత్సరాలకు ఫైనల్ పరీక్ష రాసి సీఏ పూర్తిచేయొచ్చు. పదో తరగతి తర్వాత కేవలం ఆరేళ్లకే సీఏ కోర్సును పూర్తిచేసి, ఉన్నత కెరీర్‌ను అందుకోవచ్చు.
Published date : 11 Sep 2015 11:45AM

Photo Stories