Skip to main content

ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్స్‌ ఉద్యోగాలు.. విజ‌యం సాధించేందుకు ప్రిప‌రేష‌న్ టిప్స్ ఇవే..

బ్యాంకింగ్‌ రంగంలో కొలువు.. క్లర్క్‌ నుంచి స్పెషలిస్ట్‌ కేడర్‌ వరకు.. ఏ పోస్ట్‌లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్‌ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్‌ జాబ్‌ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తీపి కబురు చెప్పింది.

క్లరికల్‌ కేడర్‌లో 5వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ 2021 నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్‌ వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..

మొత్తం 5,454 పోస్ట్‌లు..
► ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయిలో 5,454 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్‌ నియామకాల ద్వారా 5,000 పోస్ట్‌లను, బ్యాక్‌లాగ్‌ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది. క్లరికల్‌ కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

► అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 16, 2021లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

► వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

హైదరాబాద్‌ సర్కిల్‌–275 పోస్టులు..
మొత్తం పోస్ట్‌లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 275 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. జనరల్‌ కేటగిరీలో 111, ఎస్‌సీ కేటగిరీలో 44, ఎస్‌టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 27 ఖాళీలను కేటాయించారు. హైదరాబాద్‌ సర్కిల్‌లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను పరీక్ష మాధ్యమాలుగా పేర్కొనాల్సి ఉంటుంది.

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్‌ రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.

ప్రిలిమినరీ పరీక్ష
► అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇది మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటుంది.

► ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం నిబంధన అమల్లో ఉంటుంది. ఈ నిబంధన కారణంగా.. అభ్యర్థులు ఒక విభాగానికి సంబంధించిన సమాధానాలను దానికి కేటాయించిన సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

► అభ్యర్థులు పరీక్ష హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్‌ మాధ్యమం ఉంటుంది. –ఒకవేళ మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు.. మెయిన్‌ తర్వాత ప్రత్యేకంగా వారు ఎంపిక చేసుకున్న భాషలో లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్‌లో అధికార భాషకు సంబంధించిన లాంగ్వేజ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి.

మెయిన్‌ ఎగ్జామినేషన్
► ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది చొప్పున మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్‌ పరీక్ష కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50ప్రశ్నలు–60 మార్కులకు చొప్పున మొత్తంగా190 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

తుది జాబితా ఇలా
ఎంపిక ప్రక్రియలో రెండు దశల(ప్రిలిమినరీ, మెయిన్‌) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. నియామకం ఖరారు చేసే క్రమంలో మెయిన్‌లో చూపిన ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్‌ మార్కులు పొందితేనే.. మెయిన్‌ పరీక్ష పేపర్‌ మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ చూపేలా సన్నద్ధం కావాలి.

ఉమ్మడి ప్రిపరేషన్‌
రెండు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ నుంచే మెయిన్‌పైనా దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీలను మెయిన్‌లోని జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీలతో అనుసంధానించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించే వీలుంది.

జూన్‌లో పరీక్ష
ఎస్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో జరిగే ∙అవకాశముంది. అదే విధంగా మెయిన్‌ను జూలై 31న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే విధంగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. ముందుగా ప్రిలిమ్స్‌ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లను చదవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్‌ ఎగ్జామ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేలా సమయం కేటాయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రిపరేషన్‌ పటిష్టంగా
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్,సెంటెన్స్‌ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్‌ ఇం గ్లిష్‌ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్‌ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ
మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి.

రీజనింగ్‌
ఇది కూడా రెండు దశల్లోనూ(ప్రిలిమ్స్, మెయిన్స్‌) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా ప్రిలిమ్స్‌ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది.

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
మెయిన్‌లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్‌ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
మెయిన్‌లో మాత్రమే ఉండే మరో విభాగం.. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి.

ప్రీవియస్‌ పేపర్స్, మాక్‌ టెస్ట్స్‌..
గత ప్రశ్న పత్రాల సాధన, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్‌ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్‌ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది.

క్లర్క్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ఇలా..
► క్లర్క్‌ కేడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌గా కొలువు సొంతం చేసుకుంటే.. చీఫ్‌ మేనేజర్,డీజీఎం వంటి స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.
► ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే క్లర్క్‌గా కెరీర్‌ మొదలవుతుంది.
► ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
► క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే ట్రైనీ ఆఫీసర్‌ హోదా లభిస్తుంది.
► జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రమోషన్‌ ఛానల్‌ విధానంలో 20 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు సైతం చేరుకోవచ్చు.
► ప్రస్తుతం అమలవుతున్న సర్వీస్‌ నిబంధనల ప్రకారం–క్లర్క్‌ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకోవడం ఖాయం.

ఎస్‌బీఐ నోటిఫికేషన్‌– ముఖ్య సమాచారం..
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 27, 2021 నుంచి మే 17, 2021;
► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్‌ నెలలో జరుగుతుంది.
► మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: జూలై 31, 2021
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌ కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers

Published date : 11 May 2021 02:11PM

Photo Stories