సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ (జనరల్, ఒకేషనల్) విద్యార్థులందరికీ 2023 పబ్లిక్ పరీక్షల (థియరీ)కు సంబంధించిన హాల్టికెట్లను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు మార్చి 13 రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.
వీటిని విద్యార్థులు స్వయంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఫస్టియర్ విద్యార్థులు వారి ఫస్టియర్ హాల్టికెట్ నంబర్ లేదా ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్ ఉపయోగించి ప్రస్తుత థియరీ పరీక్షల హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండియర్ విద్యార్థులు వారి ఫస్టియర్ లేదా సెకండియర్ హాల్టికెట్ నంబర్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్టికెట్స్లో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైన విద్యార్థులు వారి కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదని శేషగిరిబాబు పేర్కొన్నారు.