కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్(ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం)’’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
పాఠశాలల్లో ‘పీఎం పోషణ్’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 29న సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు సైతం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
పిల్లలకు ‘తిథి భోజనం’
పీఎం పోషణ్ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం.
తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం.
పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు.