Andhra Pradesh: అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి 2022–23 పథకం అమలుకు ప్రభుత్వం జూన్ 16న మార్గదర్శకాలు జారీ చేసింది.
తమ పిల్లలను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో జూన్ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది.
- ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు.
- పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదు.
- ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.
- విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే.
- నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి పథకానికి అర్హులే.
- పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు.
- పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు.
Published date : 17 Jun 2023 05:32PM