Telangana CM Revanth Reddy : ఈ ఏడాది డిసెంబర్ చివరికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇలా.. కానీ..
అన్నింటా పారదర్శకతతో..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు (యూపీఎస్సీ) సుమారు వందేళ్ల చరిత్ర ఉంది, సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్దిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం.. అన్నింటా పారదర్శకత పాటిస్తోంది. ఈ విషయంలో మేం యూపీఎస్సీకి అభినందనలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాలని తాము నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనికి తెలిపారు.న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శ్రీ శశిరంజన్ కుమార్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పని తీరుపై సుమారు గంటన్నర పాటు వారు చర్చించారు.
ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా..
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.
2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి, దానినో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందన్నారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందన్నారు.
☛ టీఎస్పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని, కానీ గత ప్రభుత్వ అసమర్థతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు. తామ రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తాం..
టీఎస్పీఎస్సీలో అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వివరించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నందున టీఎస్పీఎస్సీ ఛైర్మన్తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
☛ TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివరాలు ఇవే..
ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్విస్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పీఎస్సీ మెరుగ్గా ఉందని, ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో ముందుందని అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేసిన ఘంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్ల తో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు.
దరఖాస్తుల నుంచి పరీక్షలు, నియామకాల దాకా టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నా యి. అయితే పలు పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది.
కొత్త సాంకేతికతతో.. కఠిన నిబంధనలతో..
టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి.. అత్యాధునిక సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం టెక్ దిగ్గజాల సహకారం తీసుకోనుంది. కమిషన్లో కంప్యూటర్లను సైతం పూర్తిగా మార్చేసి.. సరికొత్త, భద్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగుల బయోమెట్రిక్ ఉంటేనే కంప్యూటర్లు పనిచేసే లా సాంకేతికతను వినియోగించాలని భావిస్తోంది. ఇప్పటివరకు కేరళ, ఇతర రాష్ట్రాల్లో పబ్లిక్ సర్విస్ కమిషన్ల పనితీరును రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. మరింత లోతుగా అధ్యయనం జరిపాక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని అధికారులు చెప్తున్నారు.