Anganwadi Workers Update News 2024 : ఈ జిల్లాల్లో తిరిగి విధుల్లో చేరిన అంగన్‌వాడీలు.. వీరు మాత్రం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 12వ తేదీ నుంచి వీరు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే.

జూన్‌ నుంచి వేతనాలు పెంచేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. 

అనకాపల్లి జిల్లాలోని.. మంగళాపురం, విజయరామరాజుపేట –1, విజయరామరాజుపేట–2 గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, లోపూడి, కుముదాంపేట గ్రామాల్లో ఆయాలు శుక్రవారం విధుల్లోకి చేరారు. విధుల్లో చేరినట్టు కొందరు ఫోన్‌, వాట్సప్‌ ద్వారా, మరికొందరు నేరుగా ఐసీడీఎస్‌ పీవో ఉషారాణిని కలిసి తెలిపారు. ఐసీడీఎస్‌ పరిధిలో 284 అంగన్‌వాడీ కేంద్రాలుండగా శుక్రవారం 74 కేంద్రాలు తెరుచుకున్నట్టు ఐసీడీఎస్‌ పీవో తెలిపారు. 144 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు విధుల్లో చేరినట్టు ఆమె చెప్పారు.

వేతనాలు వచ్చే జూలైలో పెంచుతామని.. 

అంగన్‌వాడీ కార్యకర్తలు జ‌న‌వ‌రి 17వ తేదీన (బుధవారం) విధుల్లో చేరారు. 30 రోజులుగా సమ్మె చేస్తున్న కార్యకర్తలు కొందరు విధుల్లో చేరేందుకు అంగీకరిస్తూ లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. కార్యకర్తలు మాట్లాడుతూ.. తమ సమస్యలలో అత్యధిక భాగం ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. వేతనాలు వచ్చే జూలైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో విధుల్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ షేక్‌ ఇమాంబీ మాట్లాడుతూ.. అమరావతి సెక్టార్‌లో 33 అంగన్‌వాడీ సెంటర్‌లు, ధరణికోట సెక్టార్‌లో 31 సెంటర్‌లు ఉండగా గతంలోనే ధరణికోట సెక్టార్‌లో ఉన్న 31 అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె విరమించి విధులలో చేరారన్నారు.

అమరావతి సెక్టార్‌లోని..
జ‌న‌వ‌రి 17వ తేదీన అమరావతి సెక్టార్‌లోని 33 కేంద్రాలలో 22 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 15 మంది ఆయాలు లిఖితపూర్వకంగా తాము విధులలో చేరతామని రాసి ఇచ్చి విధులలో చేరారన్నారు. మరికొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులలో చేరటానికి తమను సంప్రదిస్తున్నారని వారు కూడా గురువారం విధుల్లో చేరతారని వెల్లడించారు.

నరసరావుపేటలో..
నరసరావుపేట.. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు వెంటనే విధుల్లో చేరాలని జిల్లాలో మహిళా, శిశుసంక్షేమశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.అరుణ జ‌న‌వ‌రి 17వ తేదీన (బుధవారం) ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లలో 2,031 మంది అంగన్‌వాడీలు పనిచేస్తుండగా వీరిలో కార్యకర్తలు 1996, సహాయకులు 1925 మంది పనిచేస్తున్నారన్నారు. వీరందరూ గత నెల 12 నుంచి సమ్మెలో ఉండగా ప్రభుత్వం చేసిన సూచన మేరకు 1413 మంది విధుల్లోకి చేరారన్నారు.

అంగన్‌వాడీ సహాయకులు కార్యకర్తలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచిందని, టీఏ, డీఏలు పెంచిందని, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, సేవా ముగింపు ప్రయోజనం పెంచుతూ జీఓలు జారీ చేసిందని చెప్పారు. వీటిని గమనించి మిగతా కార్మికులు కూడా విధుల్లో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్ర‌భుత్వం ఇచ్చిన హామీతో.. వివిధ జిల్లాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు తిరిగి విధుల్లోకి చేర‌డానికి సిద్దంగా ఉన్నారు. 

#Tags