Promotions: గురుకుల ఉద్యోగులకు పదోన్నతులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ రెండు సొసైటీల పరిధిలో పదోన్నతులు ఇవ్వక ఆరు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నేతలతో సొసైటీ కార్యదర్శి జూన్ 13న‌ సమావేశం నిర్వహించారు.  కొత్తగా బోధన సిబ్బంది నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు, పదో న్నతులు చేపట్టాలని సంఘాల నేతలు కోరారు. దీనిపై సొసైటీ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు స్పందించారు.

బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేస్తేనే వాటిని నిర్వహించే వీలుంటుందని, అయితే పదోన్నతుల విషయాన్ని  పరిశీలిస్తామని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. నెలాఖరులోగా ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

చదవండి: TS TET 2024 Results: టెట్‌లో పెరిగిన ఉత్తీర్ణత.. పరీక్ష మళ్లీ రాస్తే ఇది ఉండదు

పదోన్నతుల  తర్వాతే బదిలీలు చేపడితే ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని ఆల్‌ తెలంగాణ గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఎట్‌గ్రివా) అధ్యక్ష, కార్యదర్శులు కూకుట్ల యాదయ్య, పాపిరెడ్డి ఈ సమావేశంలో సూచించారు.

కొత్త నియామకాలకు ముందుగా పదోన్నతులతో పాటు బదిలీలు కూడా నిర్వహించాలని, కొందరు ఉద్యోగులు ఎనిమిదేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌.బాలరాజు, ఎన్‌.దయాకర్‌.. కార్యదర్శికి సూచించారు. కాగా, త్వరలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఉద్యోగ సంఘాలకు అధికారులు వివరించినట్లు తెలిసింది. 

#Tags