Private Schools Holiday Every 2nd Saturday : ఇక‌పై ప్రైవేట్ స్కూల్స్‌కు రెండో శనివారం సెలవు..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇక‌పై తెలంగాణ‌లోని ప్ర‌తి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు ప్ర‌తి నెల‌ రెండో శనివారం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను ఆగ‌స్టు 8వ తేదీన (గురువారం) హైదరాబాద్‌లో టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఏ విజరుకుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె రమేష్, నాయకులు సాయికిరణ్ కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిందే..
తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండో శనివారం సెలవు ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న  ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులను వాటిలో చేర్చుకోవద్దని పేర్కొన్నారు.  ప్రైవేట్ ఉపాధ్యాయులు విరామం లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర పనులు ఇంటివద్ద కూడా చేస్తారని పేర్కొన్నారు. అధిక సిలబస్, హోం వర్క్‌ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం సెలవును ప్రకటించాలని కోరారు. దీనిపై అదనపు సంచాలకులు లింగయ్య సానుకూలంగా స్పందించారనీ, ఉత్తర్వులను జారీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

చాలా మంది ఉద్యోగులు..
సాధారణంగా మన దేశంలో రెండో శనివారం విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రొఫెషనల్ ఇన్ స్టిట్యూట్స్ పలు కార్పోరేట్ సంస్థలకు సెలవులు ఇస్తుంటారు. ఇది బ్రిటీష్ కాలం నాటి నుంచి వస్తుంది. వీరు ప్రతి నెల రెండో శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రెండు రోజులు సెలవు కావడంతో చాలా మంది ఉద్యోగులు ఎన్నో రకాల ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యమైన పనులు చక్కబెట్టుకుంటారు. ఇక విద్యార్థులకైతే రెండు రోజులు పండగే. మరికొంత మంది రెండు వారలు పనిచేసి మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు. రిలాక్స్ కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. 

ప్రతిరోజూ 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్న తమకు శారీక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి పెరిగిపోతుందని దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఇకపై తమకు కూడా రెండో శనివారం సెలవు ఇవ్వాల్సిందే అని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.

దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది..
ఈ రెండో శనివారం సెలవు వెనుక ఓ పెద్ద కథే ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటీష్ ఆఫీసర్ వద్ద ఓ వ్యక్తి నిజాయితీగా పని చేసేవాడు. అతను తన తల్లిదండ్రులకు కలిసేందుకు సెలవు రోజున తన తల్లిదండ్రులను కలిసేందుకు ఊరికి వెళ్లేవాడు. కొన్నాళ్లకు పని ఒత్తిడి కారణంగా ఇంటికి వెళ్లడం మానివేశాడు. దీంతో కొడుకుపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు బ్రిటీష్ ఆఫీసర్ వద్దకు వచ్చి తమ కొడుకు గురించి చెప్పారు. అది విన్న బ్రిటీష్ ఆఫీసర్ ఆ ఉద్యోగి నిబద్దత, నిజాయితీకి మెచ్చి ప్రతి నెల రెండో శనివారం సెలవు తీసుకో అని చెప్పాడట. దాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. అప్పటి నుంచి భారత్ లో కొన్ని విభాగాల్లో రెండో శనివారం సెలవు ఇస్తున్నారు.

#Tags