APPSC Group 1 Applications 2024 : గ్రూప్–1 దరఖాస్తు గడువు పెంచే ఆలోచన లేదు.. కారణం ఇదే..! ‘ఎడిట్’ మాత్రం..?
ఈ గ్రూప్-1కు భారీగానే దరఖాస్తులు వచ్చినట్టు ఏపీపీఎస్సీ వర్గాలు సమాచారం మేరకు తెలుస్తుంది. జనవరి 24వ తేదీ వరకు గ్రూప్-1 దరఖాస్తును ‘ఎడిట్’ చేసే అవకాశం ఉంది.
అయితే.., గ్రూప్-1 దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వీస్ కమిషన్కు భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ క్రమంలో గ్రూప్-1 దరఖాస్తు గడువును పెంచే ఆలోచన లేదని ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ పరిగి సుధీర్ ట్వీట్టర్(X) వేదికగా తెలిపారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని.. ఇక దరఖాస్తుకు అదనపు సమయం ఇచ్చేదిలేదని ఆయన తెలిపారు.
ఈ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్ట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు), డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, కో–ఆపరేటివ్ సర్వీస్ డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తదితర ఉన్నతస్థాయి పోస్టులు ఉన్నాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 (జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు–120 మార్కులు); పేపర్–2 (జనరల్ ఆప్టిట్యూడ్ 120 ప్రశ్నలు–120 మార్కులు).
మెయిన్ ఎగ్జామినేషన్ :
గ్రూప్-1 మెయిన్లో అయిదు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవి.. పేపర్–1 జనరల్ ఎస్సే; పేపర్–2–ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం; పేపర్–3–పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా,ఎథిక్స్; పేపర్–4 ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి; పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
899 గ్రూప్–2 పోస్టులకు 4,83,525 దరఖాస్తులు.. పోటీ మాత్రం..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇచ్చిన 899 గ్రూప్–2 పోస్టులకు మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్టు సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గతనెలలో ఇచ్చిన నోటిఫికేషన్లో తొలుత 897 పోస్టులను ప్రకటించగా, అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం 899 పోస్టులు ఉన్నట్లు తేలింది. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీపడుతున్నారు. దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు జనవరి 24వ తేదీ వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది.
ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకుని, సరిచేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్టు తేలింది. ఆ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్కు జత చేయనున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్–2 పోస్టుల సంఖ్య 1000కి పైగా చేరే అవకాశం ఉంది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.