TS Mega DSC 2024: 823 పోస్టులు ఖాళీ.. 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాలో కేవలం 485 పోస్టులను ఖాళీలు చూపిస్తూ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వేలాది మంది అభ్యర్థులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తూనే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్‌ 20 నుంచి 30 మధ్యలో డీఎస్సీ నిర్వహించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.

అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం డీఎస్సీకి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రాథమికో న్నత, ఉన్నత పాఠశాలలు 2,737 ఉన్నాయి. ఇందులో 2,65,000కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెండేళ్లుగా విద్యావలంటీర్లు లేకపోవడం, సబ్జెక్టు టీచర్ల కొరత, డీఎస్సీ నియామకాలు జరుగకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి మోక్షం కలగలేదు.

చదవండి: TS DSC 2024 Notification: 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. విభాగం, పోస్టుల సంఖ్య ఇలా..

ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉండటం, విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉండటంతో మిగులుబాటుగా ఉన్న టీచర్లను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇతర బడుల్లో సర్దుబాటు చేశారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ప్రతి పాఠశాలలో టీచర్లు ఉండాల్సిందేనని, మూతపడిన స్కూళ్లను తెరిపించాలని సూచించారు. దీంతో విద్యాశాఖ అధికారులు గతంలో నివేదించిన ఖాళీలకు తోడు కొత్తగా అవసరమయ్యే టీచర్ల నియామకానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించింది.

చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

తాజాగా విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో (వివిధ కేటగిరీల్లో)334 పోస్టులు ఉండగా, కరీంనగర్‌లో 245, రాజన్న సిరిసిల్లలో 151, పెద్దపల్లి జిల్లాలో 93 పోస్టులు భర్తీ కానున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేవలం 20 పోస్టులే పీఈటీలకు ఉండటంతో వ్యాయామ ఉపాధ్యాయుల్లో నిరాశ అలుముకుంది.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష..

డీఎస్సీ నియామకానికి ప్రభుత్వం తొలిసారిగా అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుంది. ఈనెల 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది వెలువరించిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అవాంతరాలు అధిగమించేనా..?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 మే 22న ఒకసారి, 2017 జూలై 13న రెండోసారి, గతేడాది జూన్‌ 12న మూడోసారి టెట్‌ నిర్వహించింది. 2017లో టీఆర్‌టీని సైతం నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది. అప్పటి నుంచి టీచర్ల నియామకాలు లేవు.

ప్రభుత్వం టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏ టా జిల్లాలో దాదాపు 1,500 మందికి పైగా అభ్యర్థులు డీఎడ్‌, బీఈడీ పూర్తి చేసి టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా టీచర్‌ ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

ఈ రెండుమూడేళ్లలో డీఎడ్‌, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు వేలల్లో ఉండటం విశేషం. వారంతా ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే తపనలో ఉన్నారు. అయితే ఏటా డీఎస్సీ ప్రక్రియకు ఎదురవుతున్న ఇబ్బందులు ఈసారి కూడా ఎదురుకాకుండా సజావుగా నియామకాలు జరగాలని విద్యాభిమానులు కోరుకుంటున్నారు.

స్కూల్‌ అసిస్టెంట్‌: 308
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌: 421
భాష పండితులు: 74
పీఈటీలు: 20
మొత్తం: 823

#Tags