Prof Tatikonda Ramesh: ఎల్‌బీ కళాశాలకు ఘన చరిత్ర.. పేద విద్యార్థులకు విద్యనందించిన ఏకై క విద్యాసంస్థ

రామన్నపేట : ఎల్‌బీ కళాశాలకు ఘన చరిత్ర ఉందని, ఉత్తర తెలంగాణలో వేలాది మంది పేద విద్యార్థులకు విద్యనందించిన ఏకై క విద్యాసంస్థ ఎల్‌బీ కళాశాల అని కేయూ వీసీ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ పేర్కొన్నారు.

లాల్‌బహదూర్‌ కళాశాల 50 సంవత్సరాల గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు డిసెంబ‌ర్ 7న‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వీసీ రమేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ఇక్కడి అధ్యాపకులు, యాజమాన్యం చేసిన కృషిని కొనియాడారు.

ఎల్‌బీ కళాశాల అన్ని రంగాల్లో పోటీ తట్టుకుని 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సబ్జెక్టులో గొప్ప అధ్యాపకులు ఉండడం వల్ల ఆరోజుల్లో ఈ కళాశాలలోఅడ్మిషన్‌ లభించితే ఉద్యోగం దొరికినంత గొప్పగా భావించే వారని పేర్కొన్నారు.

చదవండి: Department of Education: విద్యార్థుల అభ్యసన పరిశీలన

నేటికీ నాణ్యతాప్రమాణాలతో విద్యనందిస్తూ మారుమూల ప్రాంతాల విద్యార్థులను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని కొనియాడారు. మరో విశిష్ట అతిథి 10వ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ అజయ్‌ నంద కండూరి కళాశాల ప్రతిష్టను కొనియాడారు. కళాశాల సెక్రటరీ రాజేందర్‌ మాట్లాడుతూ కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు యాజమాన్యం తరఫున కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కళాశాల 50 వసంతాల ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. అంతకుముందు ఎల్‌బీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అరుణ డీహెచ్‌రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

#Tags