Tenth Class Public Exams 2024: పదో తరగతి వార్షిక పరీక్షలకు 15 నిమిషాలు వెసులుబాటు
రాజవొమ్మంగి : జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీఈవో పి.బ్రహ్మాజీ రావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై రాజవొమ్మంగిలో హెచ్ఎంలు, ఎస్సీఆర్పీలు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక విద్యావనరుల కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 65 కేంద్రాలు ఏర్పా టు చేసినట్టు చెప్పారు. పాడేరు డివిజన్లో 40, రంపచోడవరం డివిజన్లో 25 ఉన్నాయన్నారు. ఈ ఏడాది మొత్తం 12,051 మంది విద్యార్థినీవిద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. వీరిలో 10,986 మంది రెగ్యులర్, 1,065 మంది ప్రైవేటు విద్యార్థులని చెప్పారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పరీక్షలు జరిగే విధానాన్ని నిత్యం పరిశీలిస్తాయన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిటింగ్ స్క్వాడ్లు ఉంటాయని తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, పారిశుధ్యం, వైద్యశాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టిక్కెట్టు చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. పరీక్షకేంద్రాల ఏర్పాటు ఏ విధంగా జరిగింది, వాటిలో సదుపాయాలు పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని ప్రతి కేంద్రానికి పంపినట్టు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగిన చర్యలు చేపడతామన్నారు.
15 నిమిషాలు వెసులుబాటు
విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షకేంద్రాలకు చేరుకోవాలని డీఈవో తెలిపారు. 15 నిమిషాల పాటు వెసులుబాటు ఉందని, అంత కంటే లేటుగా వస్తే అనుమతించబోమన్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు తమ పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందుగానే వెళ్లి చూడాలని, ఎంత దూరంలో ఉన్నదీ, తమకు ఏ రూం కేటాయించారు తదితర అంశాలను పరిశీలించుకోవాలన్నారు. ఇ న్విజిలేషన్ ఆర్డర్స్ సోమవారం జారీ చేసినట్టు చెప్పారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఎంఈవో–1 ఎల్.రాంబాబు ఉన్నారు.