Maha job mela: ఆర్ట్స్ కళాశాలలో మహా జాబ్మేళా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం మహా జాబ్మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మేళాను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా విజయభాస్కర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక చేతిలో డిగ్రీ పట్టా పట్టుకుని మరోచేతిలో ఉద్యోగ నియామకపత్రంతో కళాశాలను వీడాలన్నారు. కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికీ కాలేజియెట్ ఎడ్యుకేషన్ జాబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు తయారుచేసి, వివిధ జాబ్ సెక్టార్ కౌన్సెళ్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఉద్యోగావకాశాలు అందిస్తున్నామన్నారు.
ఉన్నత విద్య ప్రాంతీయ సంచాలకులు చప్పిడి కృష్ట మాట్లాడుతూ నోడల్స్ రిసోర్స్ సెంటర్లయిన రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం పరిధిలోని సుమారు 19 కళాశాలల నుంచి 4 వేల మంది విద్యార్థులు జాబ్మేళాకు హాజరయ్యారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రరావు, సీసీఈ ఓఎస్డీ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్లేస్మెంట్ అధికారి బాషా పాల్గొన్నారు.