Tribal University: గిరిజన విద్యార్థుల్లో విద్యావికాసం
దత్తిరాజేరు: పార్వతీపురం(మన్యం)జిల్లా సాలూరు నియోజకవర్గంలో చినమేడపల్లి వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేయనున్న గిరిజన యూనివర్సీటీతో గిరిజన విద్యార్థుల్లో విద్యావికాసం కలగనుందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యలతో కలిసి మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద ఆవిష్కరించనున్న శిలాఫలకం పనులు, దత్తిరాజేరు మరడాం వద్ద సభావేదికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు స్థల పరిశీలనలు చేయడమే తప్ప వర్సీటీని నిర్మించాలన్న ఆలోచన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడి అన్ని వసతులు ఉన్న ప్రదేశాన్ని చూపించడంతో వర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన వెంటనే విజయనగరంలో తాత్కాలిక భవనాల్లో తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకుందన్నారు. 561 ఎకరాల్లో సుమారు రూ.840 కోట్ల వ్యయంతో వర్సిటీ నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రిఅప్పలనాయుడు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు కడుబండి రమేష్నాయుడు పాల్గొన్నారు.
చదవండి: Tribal University-Andhra Pradesh: గిరిజన వర్సిటీ శంకుస్థాపనకు పక్కా ఏర్పాట్లు