Skip to main content

తెలంగాణ - వ్యవసాయ రంగం

వ్యవసాయ కాలాలు
పంట సాగు కాలాన్ని బట్టి సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులు (కాలాలు)గా విభజించారు.

ఖరీఫ్
దీన్నే నైరుతి రుతుపవన కాలం అని కూడా అంటారు. ఈ కాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ రుతువులో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, పత్తి తదితర పంటలు పండుతాయి.

రబీ

ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ రుతువులో గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు మొదలైన పంటలు పండుతాయి.

జయాద్ / జైద్
దీన్నే వేసవి కాలపు పంట అంటారు. ఈ సీజన్‌లో నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పంట సాగు చేస్తారు. ఈ పంట కాలం మార్చి నుంచి మే వరకు ఉంటుంది. ఈ సీజన్‌లో వరి, దోస, పుచ్చకాయ, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు పండుతాయి.

రాష్ర్ట వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్లు
మృత్తిక రకం, ఉష్ణోగ్రత, వర్షపాతం తదితర వ్యవసాయ, వాతావరణ లక్షణాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు(జోన్లు)గా విభజించారు. అవి..
1. ఉత్తర తెలంగాణ జోన్
ఈ వ్యవసాయ మండలంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. దీని ప్రధాన కేంద్రం కరీంనగర్ జిల్లాలోని ‘జగిత్యాల’. ఈ జోన్‌లో 144 మండలాలు, ఆరు పరిశోధనా కేంద్రాలున్నాయి. దీని విస్తీర్ణం 35.5 వేల చ.కి.మీ.
2. మధ్య తెలంగాణ జోన్
ఈ వ్యవసాయ మండలంలో వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం వరంగల్. ఈ జోన్‌లో 132 మండలాలు, ఏడు పరిశోధనా కేంద్రాలున్నాయి. దీని విస్తీర్ణం సుమారు 30.6 వేల చ.కి.మీ.
3. దక్షిణ తెలంగాణ జోన్
ఈ వ్యవసాయ మండలంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్ ప్రధాన కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘పాలెం’. 164 మండలాలు, ఆరు పరిశోధనా కేంద్రాలు ఈ జోన్‌లో ఉన్నాయి. దీని విస్తీర్ణం సుమారు 39.3 వేల చ.కి.మీ.
4. అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల జోన్
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి. ఈ వ్యవసాయ మండల ప్రధాన కేంద్రం చింతపల్లిలో ఉంది. దీని పరిధిలో 13 మండలాలు, మూడు పరిశోధనా కేంద్రాలున్నాయి. విస్తీర్ణం 4.66 వేల చ.కి.మీ.
  • విస్తీర్ణం, మండలాల సంఖ్య పరంగా పెద్ద వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్ దక్షిణ తెలంగాణ జోన్.
  • విస్తీర్ణం, మండలాల సంఖ్య పరంగా అతి చిన్న వ్యవసాయ శీతోష్ణస్థితి మండలం అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల జోన్.
  • రాష్ర్ట స్థూల పంట సాగు విస్తీర్ణం 62.88 లక్షల హెక్టార్లు.
  • తెలంగాణ రాష్ర్ట నికర సాగు విస్తీర్ణం 49.61 లక్షల హెక్టార్లు.
  • రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం 43.20 శాతంగా ఉంది.
  • రాష్ర్టంలో 27.43 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో ఇది 23.89 శాతం.
  • రాష్ర్ట వ్యవసాయేతర భూమి 8.95 లక్షల హెక్టార్లు. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో ఇది 7.79 శాతం.
  • రాష్ర్ట బీడు భూమి 6.15 లక్షల హెక్టార్లు. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో ఇది 5.36 శాతం.
  • రాష్ర్ట బంజరు భూమి 7.17 లక్షల హెక్టార్లు. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో ఇది 6.24 శాతం.
  • రాష్ర్టంలో నికర సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్. తక్కువగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • రాష్ర్టంలో బంజరు భూములు అధికంగా ఉన్న జిల్లా నల్గొండ, తక్కువగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • తెలంగాణ రాష్ర్టంలోని విస్తాపన వ్యవసాయాన్ని ‘పోడు’ వ్యవసాయం అంటారు.

పంటల రకాలు

రాష్ర్టంలో పండే పంటలను ఆహార పంటలు, ఆహారేతర పంటలుగా విభజించవచ్చు.
1. ఆహార పంటలు: ఆహార ధాన్యాల్ని అందించే పంటల్ని ‘ఆహార పంటలు’ అంటారు. ఆహార పంటల్ని తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
ఎ) కాయధాన్యాలు: వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కొర్రలు మొదలైనవి.
బి) పప్పుధాన్యాలు: మాంసకృత్తుల్ని అందించే కందులు, శనగలు, పెసలు, ఉలవలు, మినుములు మొదలైన వాటిని పప్పుధాన్యాలు అంటారు.
2. ఆహారేతర పంటలు (లేదా) వాణిజ్య పంటలు
ఆహారేతర అవసరాల కోసం ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేసే పంటలను ఆహారేతర పంటలు అంటారు. వీటిని నాలుగు రకాలు విభజించవచ్చు.
ఎ) నార పంటలు: పత్తి, జనపనార.
బి) నూనె గింజలు: వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సోయాబిన్, పొద్దుతిరుగుడు.
సి) తోట పంటలు: రబ్బరు, టీ, కాఫీ, మల్బరి మొదలైనవి.
డి) సుగంధ ద్రవ్యాలు: లవంగాలు, యాలకులు, పసుపు, మిరియాలు.
రాష్ర్టంలో సాగుకు అనువైన భూమిలో 60 శాతం విస్తీర్ణంలో ఆహార పంటలను సాగు చేస్తున్నారు. రాష్ర్టంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు 3.97 శాతం.
  • ఆహార పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్, తక్కువగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
  • ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్, తక్కువగా ఉన్న జిల్లా రంగారెడ్డి.

రాష్ర్టంలో పండే పంటలు
వరి

ఇది ప్రధాన ఆహార పంట. ఉష్ణ మండల పంట. వరి పండించడానికి ఒండ్రు నేలలు అత్యంత అనుకూలమైనవి. రాష్ర్టంలో సాగుకు యోగ్యమైన భూమిలో 25 శాతం విస్తీర్ణంలో వరి సాగవుతోంది. వరి పంట 75 శాతం ఖరీఫ్ లోనే పండుతోంది.
  • కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వరి అధికంగా సాగవుతోంది.
  • రాష్ర్టంలో వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. అందుకే కరీంనగర్ జిల్లాను ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ అంటారు.
  • రాష్ర్టంలో వరి ఉత్పాదకత/దిగుబడిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా నిజామాబాద్.
  • వరి ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
  • దేశంలో వరిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టం పశ్చిమ బెంగాల్.
  • కేంద్ర వరి పరిశోధనా సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) ఒడిశాలోని కటక్‌లో ఉంది.
  • అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం మనీలా(ఫిలిప్పైన్‌‌స)లో ఉంది.
గోధుమ
  • ఇది సమశీతోష్ణ మండల పంట, దేశంలో రెండో ప్రధాన ఆహార పంట.
  • రాష్ర్ట వాతావరణం గోధుమ సాగుకు అనుకూలం కాదు. కాబట్టి మన రాష్ర్టంలో అతి తక్కువగా గోధుమ సాగు చేస్తున్నారు. ఇది రబీ పంట. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో గోధుమను అధికంగా పండిస్తున్నారు.
  • గోధుమ ఉత్పాదకతలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
  • దేశంలో గోధుమ ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం పంజాబ్.
  • రాష్ర్టంలో గోధుమ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పరంగా ఆదిలాబాద్ జిల్లా తొలి స్థానంలో ఉంది.
  • గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం - చైనా.
మొక్కజొన్న
  • రాష్ర్టంలో మొక్కజొన్న ఉత్పత్తి, విస్తీర్ణంలో మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
  • ఉత్పాదకతలో ఖమ్మం జిల్లా తొలి స్థానంలో ఉంది.
  • మొక్కజొన్న పరిశోధన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది.
జొన్న
  • దీన్ని గ్రేట్ మిల్లెట్‌గా పిలుస్తారు. మన రాష్ర్టంలో వరి తర్వాత ముఖ్యమైన పంట జొన్న.
  • జొన్న పంట విస్తీర్ణం, ఉత్పత్తి పరంగా మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
  • రాష్ర్టంలో జొన్న ఉత్పాదకతలో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది.
సజ్జలు
  • వీటినే ‘ముత్యాల తృణధాన్యాలు’గా పిలుస్తారు. ఇది వర్షాధార పంట. ఎక్కువగా ఖరీఫ్‌లో పండుతుంది.
  • సజ్జ పంట విస్తీర్ణం, ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉత్పాదకతలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
  • సజ్జలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టం రాజస్థాన్.
రాగులు
  • వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.
  • ఈ పంట ఖరీఫ్, రబీ రెండు కాలాల్లోనూ పండుతుంది.
  • రాగుల సాగువిస్తీర్ణం, ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
  • రాష్ర్టంలో ఉత్పాదకతలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది.
  • దేశంలో రాగులను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టం కర్ణాటక.
పప్పుధాన్యాలు
  • ఇవి ప్రోటీన్‌లకు ప్రధాన వనరులు.
  • ఐక్య రాజ్య సమితి 2016 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం’గా గుర్తించింది.
  • పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పరంగా రాష్ర్టంలో మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
  • ఉత్పాదకత/దిగుబడి పరంగా నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.

రాష్ర్టంలో వ్యవసాయాభివృద్ధికి దోహదం చేస్తున్న వ్యవసాయ సంబంధిత సంస్థలు
  1. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం.
    ఈ విశ్వవిద్యాలయాన్ని 2014 జూలై 31న పునర్ వ్యవస్థీకరించారు. దీని పాత పేరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. 2014 ఆగస్టు 6న దీని పేరు మార్చారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మూడు వ్యవసాయ శిక్షణ కళాశాలలు ఉన్నాయి.
    అవి..
    ఎ. పొలాస (జగిత్యాల), కరీంనగర్
    బి. పాలెం, మహబూబ్‌నగర్
    సి. అశ్వారావుపేట, ఖమ్మం
  2. డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (డీఆర్‌ఆర్) - రాజేంద్రనగర్ (రంగారెడ్డి). దీని పాత పేరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్.
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ (ఐటీవోఆర్) - రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా.
  4. డెరైక్టోరేట్ ఆయిల్ రీసెర్చ్ (డీవోఆర్) - రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  5. సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (సీఆర్‌ఐడీఏ) - సంతోష్ నగర్, రంగారెడ్డి జిల్లా
  6. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఏఏఆర్‌ఎం) - రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) - రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  8. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ (ఎన్‌ఆర్‌సీఎం) - చెంగిచర్ల, రంగారెడ్డి జిల్లా
  9. డెరైక్టోరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ (డీపీఆర్) - రంగారెడ్డి జిల్లా
  10. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) - రాజేంద్రనగర్ (రంగారెడ్డి).
  11. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ) - రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  12. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ ఎఫ్‌డీబీ) -రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  13. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సోర్గమ్ (ఎన్‌ఆర్‌సీఎస్)-రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
  14. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్ (ఇక్రిశాట్) - పటాన్ చెరు, మెదక్ జిల్లా.

విత్తన భాండాగారం
భారతదేశ విత్తన రాజధాని - తెలంగాణ.
  • నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత 20 - 25 శాతం పెరుగుతుంది.
  • వరి, మొక్కజొన్న, కందులు, పత్తి, సోయాబీన్, ఆముదం తదితర పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులు, నేలలు రాష్ర్టంలో ఉన్నాయి. అందువల్ల రాష్ట్రాన్ని భారతదేశ విత్తన భాండాగారంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది.
  • దేశంలోనే సాగయ్యే అన్ని పంటల విత్తనాల్లో 40 శాతం తెలంగాణలో ఉత్పత్తయిన విత్తనాలనే వినియోగిస్తున్నారు. హైబ్రిడ్ వరి విత్తనాల ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లాలో 84 జాతీయ, అంతర్జాతీయ విత్తన సంస్థలు విత్తనోత్పత్తి చేస్తున్నాయి. హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తి సాగును గ్రామాల్లో ఆడ, మగ వరి అంటారు.

మన ఊరు - మన కూరగాయలు పథకం
2014 ఆగస్టు 6న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ఉద్దేశాలు..
  1. కూరగాయల ధరల స్థిరీకరణ
  2. హైదరాబాద్ నగర కూరగాయల అవసరం తీర్చడం.
  3. మధ్యవర్తులను తొలగించడం.
  4. ఈ పథకం కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలను ఎంపిక చేశారు.
  5. ప్రభుత్వం 35 గ్రామాలను, 1900 మంది రైతులను ఎంపిక చేసింది. ఈ గ్రామాలను 10 క్లస్టర్లుగా విభజించింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా అయిదు క్లస్టర్లున్నాయి.
  6. ప్రతి క్లస్టర్ రోజూ 3 టన్నుల కూరగాయలను నగరానికి పంపిణీ చేయాలి.

సునందిని

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సునందినిని అమలు చేస్తున్నారు. ఇది లేగదూడల ఆహార సబ్సిడీ కార్యక్రమం. పాల కోసం పశుసంతతిని పెంచాలనేదే దీని లక్ష్యం. లేగదూడను బట్టి రూ. 5 వేల నుంచి రూ. 18 వేల వరకు బీమా సౌకర్యం ఉంటుంది.
Published date : 30 Oct 2015 05:06PM

Photo Stories