Skip to main content

కేంద్ర - రాష్ట్ర సంబంధాలు

భారత రాజ్యాంగ నిర్మాతలు పటిష్టమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐక్యత, సమన్వయం, సర్దుబాటు ఉన్నప్పుడే భారతదేశ ప్రగతి సాధ్యమని వారు బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా స్పష్టమైన విధి, విధానాలు; కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన; శాసన, పరిపాలన, ఆర్థికపరమైన సంబంధాలను పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రతను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పాలనాధికారాలు ఇచ్చారు.
భారతదేశం సమాఖ్య తరహా విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగానికి ప్రత్యేకత ఉంది. మన దేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య వ్యవస్థగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా పని చేస్తుంది. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి 7వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. 11వ భాగంలో మొదటి అధ్యాయంలోని అధికరణలు 245 నుంచి 255 వరకు కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు, రెండో అధ్యాయంలోని అధికరణలు 256 నుంచి 263 వరకు పరిపాలనా సంబంధాల గురించి వివరిస్తాయి.
స్వాతంత్య్రానంతరం భారత్‌లో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అపోహలు, వైరుధ్యాలు ఉత్పన్నమయ్యాయి. వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ (1966), సర్కారియా కమిషన్ (1983), వెంకటాచలయ్య కమిషన్ (2000), పూంచీ కమిషన్ (2007) వీటిలో ముఖ్యమైనవి. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు. కె.సి. వేర్ భారత సమాఖ్య వ్యవస్థను అర్ధసమాఖ్యగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మౌఖికంగా సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఏకకేంద్ర వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో కొన్ని సమాఖ్య లక్షణాలు కనిపిస్తాయని ఐవర్‌జెన్నింగ్ పేర్కొన్నారు.

భారత సమాఖ్య వ్యవస్థ - చారిత్రక నేపథ్యం
1870లో లార్డ్ మేయో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ విధానం ద్వారా భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ప్రారంభమైందని చెప్పవచ్చు. మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం (భారత ప్రభుత్వ చట్టం 1919) ఈ దేశానికి నిజమైన సమాఖ్య వ్యవస్థ లక్షణాలను అందించింది. 1927లో ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ కూడా భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను అనుసరించాలని చెప్పింది. భారత ప్రభుత్వ చట్టం 1935 రాజ్యాంగానికి నిర్మాణాత్మక సమాఖ్య లక్షణాలను ఇచ్చింది.
స్వదేశీ సంస్థానాలు సమాఖ్య వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాయి. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి సమాఖ్య తరహా వ్యవస్థను ఎంచుకుంది. దీనికి అనుగుణంగా రాజ్యాంగ రచన చేశారు.
  • సమాఖ్యను ఆంగ్లంలో Federation అంటారు. ఇది లాటిన్ భాషా పదమైన Foedus నుంచి ఉద్భవించింది. ఫోడస్ అంటే ఒప్పందం లేదా అంగీకారం అని అర్థం.
  • ప్రపంచంలో సమాఖ్య తరహా విధానాన్ని అనుసరిస్తున్న దేశాలు.. అమెరికా, స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, కెనడా, పాకిస్తాన్, శ్రీలంక, అర్జెంటీనా మొదలైనవి.
సమాఖ్య వ్యవస్థలకు కొన్ని ప్రధాన లక్షణాలు ఉంటాయి. అవి:
  1. రాజ్యాంగ ఆధిక్యత: సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం అత్యున్నతమైన చట్టంగా ఉంటుంది. అధికారాలన్నింటికీ మూలం ఇదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైనా చట్టాన్ని రూపొందిస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది.
  2. పటిష్ట (దృఢ) రాజ్యాంగం: సమాఖ్య తరహా వ్యవస్థకు పటిష్ట రాజ్యాంగం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన, శాసన, ఆర్థిక పరమైన అవసరాల కోసం రాజ్యాంగాన్ని సులభంగా సవరించలేవు. పటిష్టమైన విధి, విధానాలతో రూపొందించిన రాజ్యాంగం మాత్రమే ఉంటుంది. ఇలా లేకపోతే రాజ్యాంగం తన ఔన్నత్వాన్ని కోల్పోతుంది. రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. దీని కోసం ప్రత్యేక మెజార్టీ కావాలి. భారత రాజ్యాంగంలోని చాలా భాగాలను ప్రత్యేక మెజార్టీ ద్వారానే సవరించాలి. అందువల్ల భారత రాజ్యాంగం మౌలికంగా పటిష్టమైంది.
  3. అధికారాల పంపిణీ: సమాఖ్య వ్యవస్థ అత్యంత ముఖ్య లక్షణం ‘అధికారాల పంపిణీ’. రాజ్యాంగం ప్రకారం కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఈ అధికారాలు ఎన్ని జాబితాల్లో ఉండాలనే అంశంపై సార్వత్రిక సమ్మతి లేదు. భారత రాజ్యాంగంలోని అధికారాలను 3 జాబితాలుగా పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగంలో ఒకే జాబితా ఉంది. ఆస్ట్రేలియా రాజ్యాంగంలో మూడు జాబితాలు ఉన్నాయి.
  4. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన పరిధిలోనే పనిచేసేలా చూస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కోసం మన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు.
  5. లిఖిత రాజ్యాంగం: ఇది కూడా సమాఖ్య వ్యవస్థ ముఖ్య లక్షణం. లిఖిత రాజ్యాంగం ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధుల్లో సక్రమంగా పనిచేస్తాయి.
కేంద్ర-రాష్ట్ర శాసన సంబంధాలు (245- 255 అధికరణలు)
కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన పరిధిని ప్రధానంగా 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి:
) ప్రాదేశిక పరిధి: మన రాజ్యాంగం ప్రాదేశిక పరిధిని భౌగోళిక సరిహద్దుల ఆధారంగా గుర్తించింది. దేశం మొత్తానికి లేదా దేశంలోని నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు వర్తించేవిధంగా చట్టాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది. ప్రవాస భారతీయుల వ్యవహారాలు, ఆస్తులను క్రమబద్ధీకరించే చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. పార్లమెంటుకు ఒక రాష్ట్ర శాసన పరిధిని విస్తరించే అధికారం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల వెనుకబాటును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి కూడా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు (అండమాన్ నికోబార్, లక్షదీవులు), షెడ్యూల్ ప్రాంతాలను పార్లమెంటు శాసన పరిధి నుంచి మినహాయించవచ్చు.
బి) విషయ పరిధి: భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాలనా అంశాలను స్పష్టంగా విభజించింది. రాజ్యాంగం ప్రకారం కేటాయించిన అంశాలపై వాటికి శాసనం చేసే అధికారం ఉంటుంది. కొన్ని పరిపాలనా అంశాలపై రెండు ప్రభుత్వాలకు శాసనాధికారం ఉమ్మడిగా ఉంటుంది. వాటిపై రెండు ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు. ఒకే అంశంపై రెండు ప్రభుత్వాలు చట్టాలు చేస్తే.. కేంద్ర ప్రభుత్వ చట్టమే చెల్లుబాటు అవుతుంది.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - ముఖ్యాంశాలు
  • అధికరణం-245 ప్రకారం పార్లమెంట్‌కు కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని అంశాలపై శాసనాలు చేసే అధికారం ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో పొందుపరచని అధికారాలను అవశిష్ట అధికారాలు అంటారు.
  • అధికరణం-245(2) ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాలు భారత భూభాగంలోని ఆస్తులు, వ్యక్తులతో పాటు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న భారతీయులకైనా వర్తిస్తాయి.
  • అధికరణం-246 ప్రకారం కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయవచ్చు.
  • అధికరణం-247 ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాల అమలు కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
  • అధికరణం-248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో పొందుపరచని అంశాలపై శాసనం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది.
  • అధికరణం-249 ప్రకారం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యసభ 2/3 వ వంతు మెజార్టీతో ఒక తీర్మానం ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపై అయినా పార్లమెంట్ శాసనం రూపొందిస్తుంది. ఇది 6 నెలలు అమల్లో ఉంటుంది. అవసరమైతే మరో 6 నెలలు పొడిగించుకోవచ్చు.
  • జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అధికరణం-250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ శాసనం చేస్తుంది.
  • అధికరణం-251 ప్రకారం 249, 250వ అధికరణల్లో ఉన్న అంశాలు రాష్ట్రాల శాసన అధికార పరిధిని తగ్గించవు.
  • అధికరణం-252 ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల విధాన సభలు ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనాన్ని రూపొందించాలని కోరితే పార్లమెంట్ శాసనం రూపొందిస్తుంది. ఆ శాసనం సంబంధిత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉదా:
    1. ఎస్టేట్ సుంకం చట్టం (1953)
    2. జల కాలుష్య నివారణ చట్టం (1974)
    3. పట్టణ ఆస్తుల పరిమితి చట్టం (1976)
  • అధికరణం-253 ప్రకారం భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం అవసరమైన శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. ఉదా:
    1) జెనీవా ఒప్పంద చట్టం (1960)
    2) హైజాకింగ్ వ్యతిరేక చట్టం (1982)
  • అధికరణం-254 ప్రకారం పార్లమెంట్ రూపొందించిన శాసనానికి, రాష్ట్ర విధాన సభ రూపొందించిన శాసనం విరుద్ధంగా ఉంటే.. పార్లమెంట్ శాసనానికే ఆధిక్యత ఉంటుంది.
  • అధికరణం-255 ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా భారత యూనియన్‌లోకి నూతన రాష్ట్రాలను విలీనం చేయవచ్చు.
  • నూతన రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్దేశించిన శాసనం పార్లమెంటు రూపొందించవచ్చు.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీని 3 జాబితాలుగా వర్గీకరించారు. అవి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా.
  • కేంద్ర, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై పార్లమెంట్ శాసనాలు చేస్తుంది.
పరిపాలనా సంబంధాలు
కేంద్ర, రాష్ట్రాల మధ్య బలమైన సంబంధాలు నెలకొనడానికి పరిపాలనా సంబంధాలు చోదకశక్తిగా పని చేస్తాయి. పరిపాలనాపరమైన సంబంధాలు సమాఖ్య తరహా రాజ్య వ్యవస్థలో అతి క్లిష్టమైన సమస్యల్లో ఒకటిగా చెప్పొచ్చు. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలను స్పష్టంగా పేర్కొనకపోతే ఆచరణలో వైరుధ్యం, సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల విషయంలో ముందుచూపుతో వ్యవహరించి రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఉండవలసిన పరిపాలనా విషయాలను 11వ భాగంలోని రెండో అధ్యాయంలో 256 -263 వరకున్న అధికరణల్లో పేర్కొన్నారు. ఇవే కాకుండా సందర్భానుసారం రాజ్యాంగంలో ఇతర చోట్ల కూడా క్లుప్తంగా వివరించారు.
ముఖ్యమైన పరిపాలనా సంబంధాలు:
  • 256వ అధికరణం ప్రకారం పార్లమెంటు ఆమోదించిన చట్టాలకు లోబడి రాష్ర్ట కార్యనిర్వాహాక వర్గం తన అధికారాలను చెలాయించాలి.
  • 257వ అధికరణం ప్రకారం కేంద్రం తన కార్యనిర్వాహాక అధికారాల విషయంలో రాష్ట్రాలు ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు కల్పించకూడదు. జాతీయ భద్రత, రైల్వే ఆస్తులు, ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు, సూచనలు చేయొచ్చు.
  • 258వ అధికరణం ప్రకారం సంబంధిత రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం తన విధుల్లో కొన్నింటిని రాష్ర్ట ప్రభుత్వాలకు అప్పగించవచ్చు.
  • 258(ఎ) ఆర్టికల్ ప్రకారం రాష్ర్ట ప్రభుత్వాలు కొన్ని అంశాలను, పరిపాలనా విధులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చు.
  • 260వ అధికరణం ప్రకారం కేంద్ర అధికార పరిధి భారతదేశానికి అవతల ఉన్న భూభాగాలపై ఒప్పందాల ద్వారా లేదా చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయిస్తుంది.
  • 261వ అధికరణం ప్రకారం ప్రభుత్వం అమలు చేసే చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయపరమైన చర్యలు. ఇవి పూర్తిపరస్పర నమ్మకంతో తీసుకుంటాయి.
  • 262వ అధికరణం ప్రకారం అంతర్ రాష్ర్ట నదీ జలాల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు.

అంతర్ రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునళ్లు

భారత రాజ్యాంగంలోని అధికరణం 262 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1956లో అంతర్ రాష్ర్ట నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డ్ చట్టాన్ని రూపొందించింది. అంతర్ రాష్ర్ట నదీ జలాల వివాదాలను నేరుగా ట్రిబ్యునళ్లు మాత్రమే పరిష్కరిస్తాయి. ఇప్పటి వరకు దేశంలో 8 అంతర్ రాష్ర్ట నదీ జలాల ట్రిబ్యునళ్లను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ తాత్కాలిక ట్రిబ్యునళ్లు దేశంలోని నదీ జలాల వివాదాలను పరిష్కరిస్తాయి. సుప్రీం లేదా ఇతర ఏ కోర్టులు ట్రిబ్యునళ్ల తీర్పుపై జోక్యం చేసుకోవు. వీటి పరిష్కార తీర్పు అంతిమంగా చెప్పొచ్చు.
1. నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్
నర్మదా నదీ పరివాహక ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్యలపై గుజరాత్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో 1969లో నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటైంది.
2. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్-1
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమస్యలు వస్తే 1969లో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఇది 1973లో అవార్డు ప్రకటించింది.
3. గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్
గోదావరి నదీ పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోసం 1969లో దీన్ని ఏర్పాటు చేశారు.
4. కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్
ఈ ట్రిబ్యునల్‌ను ఎన్.సి. సింగ్ అధ్యక్షతన 1990 జూన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరిలకు సంబంధించిన వివాదాలను పరిశీలిస్తుంది.
5. రావి, బియాస్ నదీ జలాల ట్రిబ్యునల్
ఈ ట్రిబ్యునల్‌ను 1986లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నదీ జలాల వివాదాలు, పంపకాలను పరిశీలించడానికి ఏర్పాటు చేశారు.
6. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్-2
ఈ ట్రిబ్యునల్‌ను 2004 ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు. మహారాష్ర్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాలను సమర్థంగా, పారదర్శకంగా పంపకం చేయడం, పంపకాల విషయంలో మరోమారు వివాదాలు తలెత్తకుండా కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్-2 ను ఏర్పాటు చేశారు.
7. వంశధార నదీ జలాల ట్రిబ్యునల్
ఈ ట్రిబ్యునల్‌ను 2010 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాల కోసం ఏర్పాటు చేశారు.
8. మహాదయి(మాండోవి నది) నదీ జలాల ట్రిబ్యునల్
ఈ ట్రిబ్యునల్‌ను గోవా, కర్ణాటక, మహారాష్ర్టల కోసం 2010లో ఏర్పాటు చేశారు.

అంతర్ రాష్ట్ర మండలి
సమాఖ్య తరహా విధానం పాటిస్తున్న దేశాల్లో జాతీయ, రాష్ర్ట ప్రణాళికలను సమన్వయం చేసేందుకు అంతర్‌రాష్ర్ట మండలిని ఏర్పాటు చేస్తారు. భారత్‌లో అంతర్‌రాష్ర్ట మండలిని సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అంతర్‌రాష్ర్ట మండలి చైర్మన్‌గా ప్రధాని వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఆరుగురు కేంద్ర కేబినేట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు. చర్చల్లో పాల్గొనడానికి అవసరమైన పక్షంలో ఇతర కేంద్రమంత్రులను పిలవొచ్చు. అంతర్ రాష్ర్ట మండలి సమావేశం ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది.
సర్కారియా కమిషన్ అంతర్ రాష్ర్ట మండలిని ‘అంతర్ ప్రభుత్వ మండలి’గా పిలవాలని సూచించింది. యూపీఏ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించిన అంతర్ రాష్ర్ట మండలి స్థాయీ సంఘానికి కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చైర్మన్‌గా వ్యవహరించారు.
బాధ్యతలు:
  • రాష్ట్రాల మధ్య విభేదాలను పరిశీలించి తగిన సూచనలు చేయడం.
  • రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనం కలిగే అంశాలను గుర్తించి చర్చించడం.
  • ప్రణాళిక అమలు, పర్యవేక్షణలో అవసరమనుకున్న సిఫారసులు చేయడం.
అంతర్ రాష్ట్ర మండలి సచివాలయం
అంతర్ రాష్ర్ట మండలి విధులను సక్రమంగా, పారదర్శకంగా నిర్వర్తించడానికి 1991లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా 1996లో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాయి సంఘానికి చైర్మన్‌గా కేంద్ర హోం మంత్రి వ్యవహరిస్తారు. ఇందులో అయిదుగురు కేబినెట్ మంత్రులు, తొమ్మిది మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ స్థాయి సంఘాన్ని నిరంతరం పనిచేసే ఒక సలహా సంస్థగా పేర్కొనవచ్చు.
గమనిక:
  • ఆర్థిక, అభివృద్ధి, ప్రణాళికాపరమైన విధులను అంతర్‌రాష్ర్ట మండలి నిర్వర్తించదు.
  • 1990 నుంచి 2005 వరకు అంతర్ రాష్ర్ట మండలి తొమ్మిది ముఖ్యమైన సమావేశాలను నిర్వహించింది.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్లు
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిశీలించి, పరిష్కరించడానికి అనేక కమిటీలు, కమిషన్లను నియమించారు.

మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం
1966 జనవరి 5న కేంద్ర, రాష్ర్ట సంబంధాలను, పరిపాలనా అంశాలను అధ్యయనం చేసేందుకు మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని నియమించారు. దీనికి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో కె. హనుమంతయ్య ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. దీనిలోని సభ్యులు..
1) హెచ్.వి.కామత్
2) డి. ముఖర్జీ
3) వి. శంకర్
4) టి.ఎన్.సింగ్
5) కె. హనుమంతయ్య
ఈ సంఘం 1970లో సుమారు 5780 సిఫారసులతో సుమారు 20 నివేదికలను కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికల అధ్యయనం కోసం ప్రసిద్ధ రాజ్యాంగ న్యాయనిపుణులు, మొదటి అటార్నీ జనరల్ ఎం.సి. సెతల్వాడ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.

ముఖ్యమైన సిఫారసులు:
  1. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల ఆంతరంగిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదు.
  2. అనుత్పాదక వ్యయానికి రాష్ట్రాలకు గ్రాంట్ రూపంలో కేంద్రం నిధులివ్వాలి.
  3. గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారం నిర్వహణకు కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి.
  4. మంత్రి మండలి మెజార్టీ కోల్పోయిందని భావించినప్పుడు తక్షణమే శాసనసభను సమావేశపర్చి ముఖ్యమంత్రిని తన మెజార్టీ నిరూపణకు గవర్నర్ ఆదేశించాలి.
  5. అంతర్ రాష్ర్ట నదీ జలాల వినియోగం విషయంలో ఏర్పడే వివాదాలను మూడేళ్ల వ్యవధిలో పరిష్కరించాలి. కాలపరిమితి దాటిన తర్వాత నిర్బంధ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించాలి.
  6. అవినీతి నియంత్రణకు కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  7. ప్రజా జీవితం, పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న పక్షపాతానికి, దురభిమానానికి అతీతంగా ఉండే వ్యక్తిని గవర్నర్‌గా నియమించాలి. గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ర్ట ముఖ్యమంత్రిని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలి.
  8. శాంతి భద్రతల సమస్య, ఆంతరంగిక పరిస్థితులు తలెత్తితే రాష్ర్ట దళాలకు సహాయంగా సైనిక దళాలను రాష్ర్ట ప్రభుత్వం కోరిన వెంటనే పంపాలి. ఒకవేళ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని కేంద్రం భావిస్తే రాష్ట్రాల అనుమతి లేకుండానే కేంద్రం తన సాయుధ దళాలను రాష్ట్రాలకు పంపొచ్చు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలు
భారతదేశం అనుసరిస్తోంది సూత్రబద్ధ సమాఖ్య వ్యవస్థ కాదు అంటే ఒప్పందం ద్వారా నిర్మితమైన సమాఖ్య వ్యవస్థ కాదు. దీంతో భారతదేశంలోని రాష్ట్రాలకు యూనియన్ నుంచి విడిపోయే అధికారం లేదు. - డా. బి.ఆర్.అంబేద్కర్

భారతదేశ సమాఖ్య ‘అర్ధ సమాఖ్య’. - కె.సి.వేర్

భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య తరహా ప్రభుత్వ విధానంగా, అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర తరహా ప్రభుత్వంగానూ వ్యవహరిస్తుంది.
- డా. బి.ఆర్. అంబేద్కర్

భారతదేశ సమాఖ్య వ్యవస్థలో అనేక బేరసారాలాడే లక్షణాలు ఉన్నాయి. అందుకే భారత సమాఖ్య వ్యవస్థ ‘బేరమాడే సమాఖ్య’.
- సర్ ఐవర్ జెన్నింగ్, మారిస్ జాన్స్

సర్కారియా కమిషన్ సిఫారసులు
అత్యవసర పరిస్థితి (అధికరణం 356)
అత్యవసర అధికారాలు దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటానికేగానీ కేంద్రానికి మితిమీరిన అధికారాలు కావని సర్కారియా కమిషన్ పేర్కొంది. కాబట్టి అధికరణం 356ను ఆచితూచి ఉపయోగించాలని, చిట్టచివరి అవకాశంగా మాత్రమే ప్రయోగించాలని సూచించింది. అలాంటి కొన్ని సందర్భాలు..
  • రాజకీయ అనిశ్చిత పరిస్థితి
  • అంతర్గత విచ్ఛిన్నకర పరిణామాలు
  • రాజ్యాంగ నిర్దేశాల అమల్లో నిర్లక్ష్యం
  • పరిపాలనా యంత్రాంగం వైఫల్యం
రాష్ర్టపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఆమోదించాక రాష్ర్ట విధాన సభను రద్దు చేయొద్దు. అప్పుడే పార్లమెంటుకు రాష్ర్టపతి పాలనకు సంబంధించిన విషయాల మీద తగిన నియంత్రణ అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఏ పరిస్థితుల్లో రాష్ర్టపతి పాలన విధించాల్సి వచ్చిందో ప్రకటనలో పేర్కొనాలి. అప్పుడే న్యాయ సమీక్ష జరిపే వీలుంటుంది. రాజస్థాన్ రాష్ర్టం- భారత ప్రభుత్వాల వివాదం, మినర్వా మిల్లుల వివాదం సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
రాష్ట్రాలకు ఆదేశాల విషయంలో..
సర్కారియా కమిషన్ 256, 257 అధికరణల ప్రకారం కార్యనిర్వహక విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆధిపత్యంలో ఎలాంటి మార్పులు చేయనవసరం లేదని భావించింది. అయితే 258 అధికరణను ఉదారంగా అన్వయించి వికేంద్రీకరణను ప్రోత్సహించాలని సూచించింది.
కేంద్ర సాయుధ దళాల మొహరింపు
సాయుధ దళాల మొహరింపు నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వాన్నీ సంప్రదించాలి. ఇలాంటి చర్య కొన్నిసార్లు చట్టబద్ధంగా సహేతుకమైనప్పటికీ, రాజకీయంగా సరైన నిర్ణయం కాకపోవచ్చని కమిషన్ అభిప్రాయం.
అఖిల భారత సర్వీసులు
అఖిల భారత సర్వీసులను కొనసాగించాలని వాటిని శక్తివంతం చేయాలని సర్కారియా కమిషన్ భావించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి. దీని కోసం క్యాబినెట్ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక సలహా సంఘాన్ని నియమించాలి. మరిన్ని అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు రాష్ట్రాలు సిద్ధం కావాలి.
అంతర్రాష్ర్ట మండలి (అధికరణం-236)
శాశ్వత అంతర్రాష్ర్ట మండలిని అంతర్ ప్రభుత్వ మండలి పేరుతో అధికరణం-263 కింద ఏర్పరచి సామాజిక, ఆర్థిక, ప్రణాళికేతర విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. జాతీయ అభివృద్ధి మండలి అలాగే కొనసాగాలి. కానీ జాతీయ అభివృద్ధి మండలి స్థాయిని లాంఛనప్రాయం చేసి అధికరణం-263 కింద పునర్నిర్మించి జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలి అనే కొత్త పేరు ఇవ్వాలని కమిషన్ అభిప్రాయపడింది.
అధికార భాష
భాషను రాజకీయం చేయడం దేశ ఐక్యత, సమగ్రతకు మంచిదికాదు. అధికార భాషా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి సర్కారియా కమిషన్ కొన్ని సిఫారులు చేసింది. త్రి భాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి.
ప్రసార సాధనాలు (మీడియా)
ప్రసార సాధనాలను ఉమ్మడి జాబితా లేదా రాష్ర్ట జాబితాకు బదిలీ చేయడానికి కమిషన్ సుముఖత చూపలేదు. కానీ ఆకాశవాణి, దూరదర్శన్‌ల విషయంలో సహేతుకమైన అధికార వికేంద్రీకరణ చేపట్టాలని సూచించింది. జాతీయ ప్రయోజనాలకు, రాష్ట్రాల అవసరాలకు మధ్య సమతుల్య పూర్వక సయోధ్య ఉండాలని కమిషన్ సూచించింది.
విచారణ చట్టం
విచారణ చట్టాన్ని సవరించాలని, కేంద్ర రాష్ర్ట మంత్రులపై విచారణ సంఘాన్ని వీలైనంత వరకూ నియమించొద్దని కమిషన్ అభిప్రాయపడింది. విచారణ సంఘాన్ని నియమించే ముందు పార్లమెంటు ఉభయ సభలు మెజారిటీ ఓటు ద్వారా తీర్మానం ఆమోదించాలని కమిషన్ సూచించింది. విచారణ సంఘం నియామకానికి ముందు ఈ విషయాన్ని అంతర్ ప్రభుత్వ మండలిలో ఉంచాలని కమిషన్ అభిప్రాయం.
అంతర్రాష్ర్ట వివాదాలు
అంతర్రాష్ర్ట నదీ జలాల ట్రిబ్యునల్‌కు సంబంధించిన చట్టాన్ని సవరించాలని, అయిదేళ్లలోపు నిర్ణయాలు అమలు జరగాలని సూచించింది.
హైకోర్టు జడ్జిల నియామకం
రాజ్యాంగాన్ని సవరించి నిర్ణీత కాలంలో కేంద్ర రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకొని హైకోర్టు జడ్జిలను నియమించేలా చట్టాన్ని రూపొందించాలని సర్కారియా కమిషన్ సూచించింది.

డి.ఆర్. గాడ్గిల్ ఫార్ములా
దేశం అనుసరిస్తున్న సమాఖ్య తరహా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన రీతిలో ఆర్థిక వనరుల పంపిణీ కోసం మార్గదర్శక సూత్రాలు, సహేతుకమైన సూచనలు చేయాల్సిందిగా మాజీ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ డి.ఆర్. గాడ్గిల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రణాళిక సహాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి ఒక ఫార్ములా (సూత్రాన్ని)రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి 1971లో అందించింది. డి.ఆర్.గాడ్గిల్ నివేదికపై 1981లో ఒకసారి, 1992లో మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ గాడ్గిల్ ఫార్ములాను అనుసరించి జనాభా ఆధారంగా 60 శాతం నిధులు, తలసరి ఆదాయం ఆధారంగా 25 శాతం నిధులు రెవెన్యూ వ్యయాలను సరిచూసుకొని ఫిస్కల్ డెఫిసిట్‌ను తగ్గించినందుకు 7.5 శాతం, ఎడారి, కొండ ప్రాంతాలు, శిశుమరణాలు, ఆరోగ్యం తదితర సమస్యల ఆధారంగా 7.5 శాతం నిధులను కేటాయించాలని స్పష్టంగా విశదీకరించింది.
నోట్: కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సహాయాన్ని అందిస్తుంది. కానీ వెనుకబడిన, పేద రాష్ట్రాలకు ఈ ఫార్ములా ప్రకారం నిధుల పంపిణీ అంత ఉపయోగకరంగా లేదు.
విత్త రంగంలో చూపిన క్రమశిక్షణను గాడ్గిల్ ఫార్ములా ప్రోత్సహించేలా లేదని కొందరు నిపుణుల అభిప్రాయం.

జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ కమిషన్
కేంద్ర, రాష్ర్ట సంబంధాలను అధ్యయనం చేసి సూచనలు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం 2007 ఏప్రిల్ 28న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ సభ్యులు
  1. ధీరేంద్రసింగ్ (హోంశాఖ మాజీ కార్యదర్శి)
  2. అమరేశ్ బాంగ్జీ(మాజీ డెరైక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ)
  3. వినోద్ కుమార్ దుగ్గల్ (హోంశాఖ మాజీ కార్యదర్శి)
  4. డాక్టర్ ఎన్‌ఆర్ మాధవ మీనన్ (మాజీ డెరైక్టర్, జాతీయ న్యాయ అకాడమీ, భోపాల్) పూంచీ కమిషన్ తన నివేదికను 7 అధ్యాయాలుగా రూపొందించి 2010 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
నివేదికలోని ముఖ్య అధ్యాయాలు
  1. కేంద్ర, రాష్ర్ట సంబంధాల పరిణామ క్రమాన్ని మొదటి అధ్యాయంలో వివరించింది.
  2. పౌరహక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను తెలిపే 19వ అధికరణం, అత్యవసర పరిస్థితిని వివరించే 353 అధికరణం, రాష్ట్రాల సంక్షేమం, సంరక్షణను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా తెలిపే 355అధికరణం, రాష్ర్టపతి పాలనను తెలిపే 356 అధికరణం, అంతర్రాష్ర్ట మండలిని తెలిపే 263 అధికరణం గురించి అధ్యయనం చేసి సమగ్ర వివరాలను 2వ అధ్యాయంలో కమిషన్ వివరించింది.
  3. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, విత్త సంబంధాలు, ప్రాంతీయ అసమానతలను 3వ అధ్యాయంలో పొందుపరిచింది.
  4. 73,74 రాజ్యాంగ సవరణలు, 6వ షెడ్యూల్‌కు సంబంధించిన సూచనలను 4వ అధ్యాయంలో పొందుపరిచింది. తీవ్రవాదం, తిరుగుబాట్లు, నక్సలిజం, హింస, మత కల్లోలాలు, జాతీయ అంతరంగిక భద్రతను 5వ అధ్యాయంలో పొందుపరిచింది. పర్యావరణ సమస్యలు, వనరుల విభజనకు సంబంధించి 6వ అధ్యాయంలో పేర్కొంది. సామాజికాభివృద్ధి, సుపరిపాలన, ఎలక్ట్రానిక్ సేవలను 7వ అధ్యాయంలో పొందుపరిచింది. ఇలా 7 అధ్యాయాలుగా కమిషన్ నివేదికను తయారుచేసింది.
సిఫారసులు
  • తీవ్రవాద సమస్యకు గురైన ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్ర ప్రభుత్వం పాలనలోకి తెచ్చేందుకు 355, 356వ అధికరణలను సవరించాలి.
  • 355, 356 అధికరణల కింద అత్యవసర నిబంధనలను స్థానికీకరణం చేయాలంటే రాష్ర్టం మొత్తం రాష్ర్టపతి పాలన విధించకుండా సమస్యాత్మక, యంత్రాంగం వైఫల్యం చెందిన ప్రాంతాల్లో మాత్రమే రాష్ర్టపతి పాలన విధించాలి. రాష్ర్టపతి పాలనను 3 నెలలకు మించకుండా చూడాలని కమిషన్ సిఫారసు చేసింది.
  • రాష్ట్రాల్లో మత కల్లోలాలు, హింస, అంతరంగిక ప్రాంతీయ వైషమ్యాలు సంభంవించినప్పుడు కేంద్ర బలగాలు నేరుగా మొహరించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్ర బలగాలను పంపాలి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వారం పాటు నిరంతర పర్యవేక్షణ, కేంద్ర బలగాలను, కేంద్ర హోంశాఖ సమీక్షించాలి.
  • రాష్ట్రాల మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించే హక్కు గవర్నర్లకు ఉండాలి. విశ్వవిద్యాలయాలకు చైర్మన్లుగా గవర్నర్లను నియమించొద్దని కమిషన్ అభిప్రాయపడింది.
  • సరైన కారణాలు తెలపకుండా గవర్నర్ల తొలగింపు సరికాదని పేర్కొంది. గవర్నర్ పదవీ కాలాన్ని ఐదేళ్లుగా నిర్ణయించాలని తెలిపింది. రాష్ర్టపతి మహాభియోగతీర్మానం ద్వారానే గవర్నర్లను తొలగించాలని అభిప్రాయపడింది.
  • అధికరణం 163(2) ద్వారా గవర్నర్లకు సంక్రమించిన విచక్షణాధికారాల పరిధిని రాజ్యాంగ సవరణ చేసి తగ్గించాలి. బిల్లులను తన వద్ద అట్టిపెట్టుకొనే అధికారాన్ని తగ్గించి 4 నెలల్లోగా కచ్చితంగా బిల్లుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని సూచించింది.
  • జాతీయ సమగ్రతా మండలి ఏడాదికోసారి సమావేశం కావాలని చెప్పింది. జాతీయ పరిశోధనా ఏజెన్సీ వంటి కొత్త సంస్థలను అధ్యయనం చేసి నివేదించింది.
వీరప్ప మొయిలీ అధ్యక్షతన రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 2005 ఆగస్టు 31న నియమించింది. దీనిలో సభ్యులు.
1. వి. రామచంద్రన్
2. డాక్టర్ ఏ.పి.ముఖర్జీ
3. డాక్టర్ ఎ.హెచ్. ఖత్రో
4. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ (రాజీనామా చేశారు)
5. శ్రీమతి వినితా రాయ్ (కార్యదర్శి)
వీరప్పమొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో పరిపాలనా సంస్కరణ సంఘం ప్రభుత్వం, పాలనా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి బాధ్యతాయుత, జవాబుదారీతనం, సమర్థ పాలనకు సంబంధించి మొత్తం 15 అధ్యయన నివేదికలను కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.
Published date : 28 Oct 2015 05:12PM

Photo Stories