KTR : ఈ టీఎస్పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..
![Minister KTR Press Meet On TSPSC Paper Leak Issue in telugu news](/sites/default/files/images/2023/03/20/ktr-1679318412.jpg)
టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలనే బాధ్యత తమపై ఉందన్నారు. అవకతవకలు జరిగాయనే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో గత ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశామని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటి వరకు 155 నోటీఫికేషన్లు.. 35 వేల ఉద్యోగాలు :
![tspsc notification details in telugu](/sites/default/files/images/2023/06/01/tspsc-news-1685608001.jpg)
టీఎస్పీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. 155 నోటీఫికేషన్ల ద్వారా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు వచ్చిన మన సంస్కరణలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి పరిశీలించారని ప్రస్తావించారు. ‘పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్కు నివేదిక ఇచ్చాం.
☛ TSPSC Paper Leak 2023 : టీఎస్పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
సీఎం ఆదేశాలతోనే..
ప్రజలకు నిజానిజాలు తెలియాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం ఆదేశాలతోనే సమీక్ష నిర్వహించాం. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనక ఎవరున్న కఠినంగా శిక్షిస్తాం.
పేపర్ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా..
![tspsc paper leak press meet ktr news telugu](/sites/default/files/inline-images/tspsc%20ktr%20press%20meet.jpg)
తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. యువత విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇద్దరు చేసిన తప్పును యువతలో అశాంతి చెలరేగేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు. రాజకీయ నిరుద్యోగులు చేసే విమర్శలకు యువత రెచ్చిపోవద్దు. పేపర్ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే అంటే ఎలా.
ఈ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే ఉచితంగా..
![tspsc paper leak case news telugu](/sites/default/files/inline-images/tspsc%20latest%20news_4.jpg)
రద్దైన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా అర్హులే. మొత్తం నాలుగు పరీక్షల కోచింగ్ మెటీరియల్ ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో పెడతాం. 2 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన పరీక్షలను సాధ్యమైనంత వేగంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేస్తాం. రీడింగ్రూమ్లు 24 గంటలు తెరిచే ఉంటాయన్నారు. అలాగే భోజన వసతి కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.