Skip to main content

TS Inter Results 2024 Date : ఇంట‌ర్ ప‌రీక్షల‌ మూల్యాంకనం పూర్తి.. ఏప్రిల్ 25వ తేదీన‌ ఫ‌లితాల విడుద‌ల.. ?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల జవాబు పత్రాల మూల్యాంకనం ఇటీవ‌లే ముగిసిన విష‌యం తెల్సిందే. ఈ సారి క‌నీసం స్పాట్‌ కేంద్రాల్లోకి అధ్యాపకులకు కూడా ఫోన్లను అనుమతించ లేదు.
TS Inter Results 2024 Date

గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్‌ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 

మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్‌లో నమోదు చేశారు.

☛ AP Inter Public Exams Results 2024 Date : ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుద‌ల‌పై క్లారిటీ ఇదే.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే...?

విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్‌ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అలాగే కార్పొరేట్‌ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేశారు. 

ఈ ఏడాది 9,22,520 మంది విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొన్నారు.

గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్‌ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్‌ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇచ్చారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరిగింద‌ని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు.

ఇంట‌ర్ సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్‌లైన్‌లో ఫీడ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలించారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్‌ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. 

ఏప్రిల్ 25లోపు ఫ‌లితాలు విడుద‌ల..?
సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని.. ఏప్రిల్ 25వ తేదీలోపు ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్ ఫ‌లితాల‌ను ఒకే సారి విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఈ ఏడాది ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్‌ క‌లిపి మొత్తం 9 లక్షలకు మందికిపైగా విద్యార్థులు ప‌రీక్ష‌లకు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.

ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేశారు. అలాగే ఫలితాలను కూడా ఏప్రిల్ 25వ తేదీలోపే వెల్ల‌డించ‌నున్నారు. తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్ ఫ‌లితాల కోసం www.sakshieducation.com లో చూడొచ్చు.

Published date : 08 Apr 2024 07:33PM

Photo Stories