Skip to main content

Telangana: ‘ఎస్‌ఎంసీ’ల గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల చదువుతో పాటు పా ఠశాలకు మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించేలా స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల పాత్ర కీలకం. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న కమిటీల నిర్వహణ ప్రస్తుతం నీరుగారుతోంది.
Extension of term of SMCs  Adilabad Town

 ఆ పాఠశాలలో తమ పిల్లలు చదువు పూర్తి చేసుకొని ఉన్నత విద్యకు వెళ్లినప్పటికీ పాత వారే కమిటీ సభ్యులుగా, చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు బడి వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎస్‌ఎంసీల లక్ష్యం నెరవేరని పరిస్థితి. 2019లో ఈ కమిటీలను ఏర్పాటు చేయగా, 2021లో గడువు ముగిసింది.

ఇప్పటికే మూడుసార్లు గడువు పెంచిన విద్యాశాఖ తాజాగా మరో నెల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌ర్ 31 వరకు పొడిగించగా.. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు వీరే కొనసాగుతారని స్పష్టం చేసింది.

చదవండి: Telangana: గురుకులాలను పటిష్టం చేయాలి

నీరుగారుతున్న లక్ష్యం..

విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎస్‌ఎంసీల ద్వారా సులభంగా సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరు కాకపోయినా, బడీడు పిల్లలు బడి బయట ఉన్నా, పాఠశాలకు అభివృద్ధి కోసం ఏవైనా నిధులు మంజూరైనా చర్చించి పనులు చేపట్టాలి. మరోవైపు ఇప్పటికే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది.

చదవండి: Telangana: గురుకులంలో ఏం జరుగుతోంది..?

తల్లిదండ్రులు ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో వీటిని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే కమిటీల గడువు ముగిసినప్పటికీ పదవి కాలం తరచూ పొడిగిస్తుండడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదనే విమర్శలున్నాయి.

తల్లిదండ్రుల భాగస్వామ్యం..

ఎస్‌ఎంసీలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకం. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరవుతున్నారా.. సమయపాలన పాటిస్తున్నారా అనే వాటిని ఈ కమిటీ పర్యవేక్షించాలి. దీంతో పాటు నాణ్యమైన బోధన, భోజనం అందిస్తున్నారా అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీ యాల్సి ఉంటుంది.

విద్యార్థుల అభ్యసన తీరుపై స మావేశం నిర్వహించి తల్లిదండ్రులకు వివరించాలి. పాఠశాలకు నిధులు మంజూరైతే తీర్మానం చేసి పనులు చేట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన ఊరు–మనబడి పనులు కొనసాగుతున్నప్పటికీ చాలా ఎస్‌ఎంసీలు వీటి నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.

ఆరు నెలల్లోగా మౌలిక వసతులకు సంబంధించి పనులు పూర్తి చేయాల్సి ఉండగా, దాదాపు ఏడాదిన్నర గడిచినా పనులు పూర్తి కావడం లేదనే విమర్శలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 15 మంది సభ్యులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 21 మంది, ఉన్నత పాఠశాలల్లో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోగా, మిగతా వారు సభ్యులుగా కొనసాగుతారు.

ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆ పాఠశాలల్లో కమిటీ సభ్యుల పిల్లల చదువు పూర్తయి ఇతర పాఠశాలల్లో చేరితే వారి తల్లిదండ్రులను కమిటీ నుంచి తొలగించాల్సి ఉంటుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా పాతవారినే కొనసాగిస్తుండడం గమనార్హం.

కొత్త ప్రభుత్వంలోనైనా ఏర్పాటయ్యేనా..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎంసీల పదవికాలం ముగిసినా పలుమార్లు పొ డగిస్తూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చింది.

విద్యా శాఖను ఇంకా ఎవరికి కేటాయించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఆ శాఖ ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ తర్వాత అయిన కొత్త కమి టీలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

జిల్లాలో.. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య

  • ప్రాథమిక పాఠశాలలు: 466
  • ప్రాథమికోన్నత పాఠశాలలు: 105
  • ఉన్నత పాఠశాలలు: 130
  • విద్యార్థుల సంఖ్య: 65వేలు

ఈ నెలాఖరు వరకు..

ఎస్‌ఎంసీల పదవీ కాలం గతనెల 30తో ముగిసింది. దీంతో విద్యాశాఖ డైరెక్టర్‌ ఈనెలాఖరు వరకు లేదా కొత్త కమిటీలు ఏర్పాటయ్యేంత వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీలు 2019లో ఏర్పాటయ్యాయి.

– సుజాత్‌ఖాన్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

Published date : 11 Dec 2023 03:09PM

Photo Stories