Skip to main content

T Harish Rao : డీఎస్సీ కంటే.. ముందే టెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల్సిందే.. లేకుంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 పరీక్షల కంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పరీక్ష నిర్వహించి.. తాజాగా బీఈడీ, డీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
TET exam    DSC  2024  T Harish Rao Demands TET Exam Conduct Before DSC   Telangana TET Exam Announcement

ఇంతకుముందు టెట్ పరీక్ష రాసినప్పటికీ అర్హత సాధించని వారు.. తాజాగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న దాదాపు 50 వేల మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. అలాగే కేవలం టెట్ అర్హత లేని కారణంగా టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు. కావున నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే టెట్ నిర్వహించి.., త‌ర్వాత‌ డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవలే 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సర్కారు. అయితే గతంలో డీఎస్సీకి ముందు టెట్‌ను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు టెట్‌ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో గతంలో టెట్‌ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తిచేసినవారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. ఇటీవలే అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ (డీఎస్‌ఈ)ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ ఆందోళలను తీవ్రతరం చేశారు.

గతంలో క్వాలిఫై కాక మరో చాన్స్‌ కోసం వేచిచూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. టెట్‌ లేకుండా నేరుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్లు డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కనపెట్టి న్యాయం కోసం రోడ్డెక్కావల్సి వస్తున్నది. 

గతంలో నిర్వహించిన టెట్‌కు వివిధ కారణాల వల్ల అనేకమంది గైర్హాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైనవారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో ఒకసారి టెట్‌ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్‌ నిర్వహించి, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత 2022 జూన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. 

2023 ఆగస్టులో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించారు. పేపర్‌-1కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్‌-2కు 1,90,047 అభ్యర్థులు హాజరవగా 29,073 (15.30 శాతం) మంది అర్హత సాధించారు.

బీఎడ్‌ ఫైనల్‌ ఇయర్‌, ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్నవారు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిచ్చారు. డీఎడ్‌ రెండో సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నాటికి అన్ని రకాల అర్హతలనూ పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. 

కానీ టెట్‌ విషయానికి వచ్చేసరికి టెట్‌లో అర్హత సాధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేనాటికే టెట్‌లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో టెట్‌ మార్కులు అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన విధించారు. ఇలా రెండు విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్‌లో గమనార్హం. 


☛ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచింది. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. అప్పటికి మా వయోపరిమితి పూర్తవుతుంది. కనుక ఇప్పుడే అవకాశం కల్పించాలి.
☛ తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌లో ఫలితాలు ప్రకటించిన తర్వాత టెట్‌ మార్కులు అప్‌లోడ్‌ చేసే అవకాశాన్నిచ్చారు. ఇదే విధానాన్ని తాజా డీఎస్సీకి వర్తింపజేయాలి.
☛ గతంలో టెట్‌ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ దృష్ట్యా టెట్‌ను నిర్వహించాలి.
☛ అవకాశముంటే టెట్‌, డీఎస్సీ రెండింటిని ఒకేసారి నిర్వహించాలి.
లేదంటే డీఎస్సీ ఇప్పుడు నిర్వహించినా.. ఫలితాలు ఆపి టెట్‌ను నిర్వహించి, టెట్‌ ఫలితాలు ప్రకటించి, ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలి.

Published date : 14 Mar 2024 10:34AM

Photo Stories