Skip to main content

ఏపీ డీఎస్సీకి 6 లక్షలకు పైగా దరఖాస్తు వచ్చే అవకాశం

సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీ కోసం నాలుగేళ్ల నుంచి నిరీక్షిస్తుండగా డీఎస్సీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7,729 పోస్టులకే పరిమితం చేయడంపై లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఒకపక్క దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతుండగా సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు అన్ని కేటగిరీల్లోనూ పోస్టులు చాలా తక్కువగా ప్రకటించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సగానికిపైగా ఎస్జీటీ పోస్టులు కుదింపు :
2014 డీఎస్సీలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టెట్ కమ్ టీఆర్టీ)ని ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,849 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,244 ప్రకటించారు. ఈసారి మాత్రం ఎస్టీటీ పోస్టులు 3,666 మాత్రమే కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా తక్కువగా 1,625 మాత్రమే ఉన్నాయి. గతంలో భాషోపాధ్యాయ పోస్టులు 812 ఉండగా ఈసారి వాటి సంఖ్య తగ్గిపోయింది. పీఈటీ పోస్టులు గతంలో 156 ఉండగా ఈసారి 476 అని ప్రకటించారు. గతంలో నిర్వహించిన టెట్ కమ్ టీఆర్టీకి 4.20 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎస్జీటీ పోస్టులకు 61,489 మంది, ఎస్‌ఏ లాంగ్వేజెస్ పోస్టులకు 60,476 మంది, ఎస్‌ఏ నాన్ లాంగ్వేజెస్ పోస్టులకు 2,33,362 మంది, భాషా పండిత పోస్టులకు 56,497 మంది, పీఈటీ పోస్టులకు 8,878మంది హాజరయ్యారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించలేదు. ఈ వ్యవధిలో డీఈడీ, బీఈడీ, భాషా పండితులు తదితర కోర్సులు పూర్తి చేసిన వారి సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. దీంతో ఈసారి పోటీ పడే అభ్యర్థుల సంఖ్య 6 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వయోపరిమితి సడలింపుతో మరికొంత మంది కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో అరకొరగా పోస్టుల భర్తీకి సిద్ధం కావడంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గతంలో ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఈడీ పూర్తి చేసిన వారిని మాత్రమే అర్హులుగా పరిగణించారు. అందువల్లే గత డీఎస్సీలో ఈ పోస్టులు 8 వేల వరకు ఉన్నా కేవలం 61 వేల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈసారి బీఈడీ పూర్తి చేసిన వారిని కూడా ఎస్జీటీ పోస్టులకు జాతీయ విద్యాశిక్షణ మండలి అనుమతించడంతో వారు కూడా దరఖాస్తు చేయనుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ పోస్టులకు పోటీపడే వారి సంఖ్య 3 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బీఈడీ చేసిన వారిని వేర్వేరు విద్యార్హతలతో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండంతో పోటీ పెరగనుంది. భాషా పండితుల పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బీఈడీతో పాటు ఎంఏ లాంగ్వేజెస్ చదివిన వారిని సైతం అనుమతిస్తుండటంతో టీచర్ పోస్టుల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

23 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా...
ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో డీఎస్సీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ 3,666, స్కూల్ అసిస్టెంట్లు 1625, భాషా పండితులు 452, పీఈటీ 476, టీజీటీ 715, పీజీటీ 583, ప్రిన్సిపాల్ 89, ఆర్ట్ 22, క్రాఫ్ట్ 25, మ్యూజిక్ పోస్టులు 76 ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 4,341 పోస్టులతో పాటు ఆదర్శ పాఠశాలల్లో 909, మున్సిపల్ పాఠశాలల్లో 1,100, గిరిజన పాఠశాలల్లో 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలల్లో 175, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 404 పోస్టులున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 23 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం అతి తక్కువగా డీఎస్సీలో పోస్టులను అనుమతించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
Published date : 01 Nov 2018 06:01PM

Photo Stories