Skip to main content

అమెరికావైపే మన విద్యార్థులు...

అమెరికా.. స్టడీ అబ్రాడ్, వర్క్ అబ్రాడ్ దిశగా మన విద్యార్థులకు కలల గమ్యం! అగ్రరాజ్యంలో అడుగుపెట్టి భవిష్యత్తు బంగారుమయం చేసుకోవాలనేది స్వప్నం!! ట్రంప్ సర్కారు వీసాలు, గ్రీన్‌కార్డ్‌ల జారీలో కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ... భారతీయ విద్యార్థులపై పెద్దగా ప్రభావం చూపడంలేదు.
నేటికీ స్టడీ అబ్రాడ్ పరంగా అమెరికానే తమ తొలి గమ్యంగా భారతీయ విద్యార్థులు భావిస్తున్నారు. ఫలితంగా గతేడాది కూడా అమెరికాకు వెళ్లిన మన విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఓపెన్ డోర్స్-2018 నివేదిక వెలువడిన నేపథ్యంలో అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు, ప్రాధాన్యమిస్తున్న కోర్సులపై విశ్లేషణ...

స్టడీ అబ్రాడ్ పరంగా దశాబ్దాలుగా మన దేశ విద్యార్థులకు తొలి గమ్యం అమెరికా. ఇటీవల కాలంలో ట్రంప్ సర్కారు కఠిన వీసా నిబంధనలతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోందనే వార్తలొచ్చినా.. 2017-18లో కూడా భారతీయుల తొలి గమ్యం అమెరికానే అని రుజువైంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌లు సంయుక్తంగా తాజాగా విడుదల చేసిన ఓపెన్ డోర్స్-2018లో ఈ విషయం వెల్లడైంది.

రెండో స్థానంలో భారత విద్యార్థులు..
ఓపెన్ డోర్స్-2018 నివేదిక ప్రకారం గత విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల పరంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2017-18లో మొత్తం 1,96,271 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని పలు యూనివర్సిల్లో విద్యనభ్యసిస్తున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే.. ఈ సంఖ్య 5.4 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. పొరుగు దేశం చైనా 3,63,341 మంది విద్యార్థులతో తొలి స్థానంలో నిలిచింది.

సగం చైనా, భారత్ నుంచే...
అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది చైనా, భారత్‌ల నుంచే ఉండటం గమనార్హం. చైనా విద్యార్థుల సంఖ్య 33 శాతంగా; భారత విద్యార్థుల శాతం 18 శాతంగా నమోదైంది. అమెరికాలో 2017-18 నాటికి మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 10,94,792 మంది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే పెరుగుదల చాలా తక్కువగా 1.5 శాతం మాత్రమే. గత కొన్నేళ్లుగా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో అమెరికా ముందంజలో నిలుస్తోంది. ఓపెన్ డోర్స్ తాజా నివేదిక ప్రకారం ఫాల్ సెషన్‌లో మాత్రం కొత్త విద్యార్థుల ప్రవేశం 6.6 శాతం తగ్గడం గమనార్హం. అంతకుముందు సంవత్సరంతో పోల్చితో 19,098 మేర తగ్గినట్లు నివేదిక తెలిపింది.

స్టెమ్ కోర్సులకే ప్రాధాన్యం...
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారత విద్యార్థులు చేరుతున్న కోర్సులను పరిశీలిస్తే.. దాదాపు 80 శాతం మంది స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల్లోనే చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. 2017-18లో అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన భారతీయ విద్యార్థులు దాదాపు 73 శాతం మంది మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడం విశేషం. అలాగే మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2017-18లో కేవలం 10 శాతం మంది మాత్రమే బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరారు. అలాగే 8 శాతం మంది ఫిజికల్ సైన్స్, హెల్త్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందారు. మొత్తంగా చూస్తే 2017-18 నాటికి అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో స్టెమ్ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 4,97,413 మంది. అలాగే బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 2016-17లో 2,00,754 మంది విద్యార్థులు ఉండగా.. 2017-18లో ఆ సంఖ్య 1,06, 054 కు పడిపోయింది.

గ్రాడ్యుయేట్ కోర్సుల్లో తగ్గుదల...
అమెరికాలో గ్రాడ్యుయేట్ కోర్సులుగా పిలిచే మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌లో చేరే భారత విద్యార్థుల సంఖ్య 2017-18లో తగ్గుముఖం పట్టింది. ఈ కోర్సుల్లో 2016-17లో 1,04,899 మంది విద్యార్థులు ఉండగా.. 2017-18లో మాత్రం 95,961మంది మాత్రమే చదువుతున్నారు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్‌గా పిలిచే బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 6.2 శాతం పెరిగి 23,346గా నమోదైంది.

ఓపీటీ వైపు మొగ్గు :
ఓపెన్ డోర్స్ తాజా నివేదిక ప్రకారం అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)కు నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17తో పోల్చితే 2017-18లో 32 శాతం పెరిగింది. 2017-18లో 75,390 మంది విద్యార్థులు ఓపీటీ కోసం నమోదు చేసుకున్నారు. ఓపీటీ విధానం వల్ల సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు తమ కోర్సులు పూర్తయ్యాక 12 నెలలు అమెరికాలోని కంపెనీల్లో శిక్షణ పొందే అవకాశముంది. అలాగే స్టెమ్ కోర్సుల విద్యార్థులు గరిష్టంగా 36 నెలలు శిక్షణ పొందే వీలు లభిస్తుంది. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఓపీటీకి నమోదు చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఓపీటీలో చేరడం ద్వారా సదరు వ్యవధిలో రాణించి, సంస్థల నుంచి పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకోవాలని, తద్వారా హెచ్-1బి వీసాకు అర్హత పొందాల భావిస్తున్నారు.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో తగ్గుముఖం :
నాన్-డిగ్రీ కోర్సులుగా పిలిచే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో, నాన్-క్రెడిట్ ప్రోగ్రామ్స్‌లో అడుగుపెట్టే విద్యార్థుల సంఖ్య 2017-18లో తగ్గింది. ఈ సంఖ్య 2016-17లో 2,259 ఉండగా.. 2017-18లో కేవలం 1,884. వాస్తవానికి గతేడాది వరకు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ఫలితంగా అంతర్జాతీయ నైపుణ్యాలు లభిస్తాయనే అభిప్రాయంతో విద్యార్థులు నాన్-డిగ్రీ ప్రోగ్రామ్‌లవైపు మొగ్గు చూపేవారు. కానీ.. గత కొన్ని నెలలుగా డాలర్ విలువ పెరగడంతో కొద్ది కాలం ఉండి స్వదేశానికి తిరిగి రావాల్సిన ఈ కోర్సులపై అనాసక్తి నెలకొంది. ఇదే ధోరణి.. నాన్-క్రెడిట్ ప్రోగ్రామ్స్‌గా పిలిచే ఇతర స్వల్ప కాలిక సర్టిఫికెట్ కోర్సుల్లోనూ ప్రస్ఫుటమవుతోంది.

యూజీ విద్యార్థులు పెరగడానికి కారణం ?
విదేశీ విద్య అనగానే సాధారణంగా పీజీ స్థాయి కోర్సులే గుర్తొస్తాయి. కానీ, తాజా నివేదిక ప్రకారం పీజీ కోర్సుల్లో చేరే భారత విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదు కాగా.. యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య పెరగడం విశేషం. దీనికి పలు అంశాలు కారణంగా నిలుస్తున్నాయి. యూజీగా నిలిచే బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరితే.. వాటిని పూర్తి చేసుకున్నాక.. అక్కడే పీజీ కోర్సుల్లో తేలిగ్గా ప్రవేశం పొందొచ్చు. ఎఫ్-1 వీసా వ్యవధిని కూడా పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత ఓపీటీ విధానంలో మరో మూడేళ్లు ఉండే అవకాశం లభిస్తుంది. అంటే.. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో చేరిన ఒక విద్యార్థి గరిష్టంగా దాదాపు ఏడెనిమిదేళ్లు అమెరికాలోనే నివసించే అవకాశం లభిస్తుంది. అందుకే యూజీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది నిపుణుల అభిప్రాయం. అంతేకాకుండా.. ఆ తర్వాత అక్కడ హెచ్-1 వీసా వచ్చినా.. రాకపోయినా.. స్వదేశానికి తిరిగొస్తే ఉన్నతమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అందుకే గత రెండేళ్ల కాలంలో శాట్, ఏసీటీ వంటి పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో యూజీ కోర్సులను అన్వేషించే విద్యార్థుల్లో అధికశాతం మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారని చెబుతున్నారు.

భారత్‌లో అమెరికా విద్యార్థులు :
2015-16లో భారత్‌లో అమెరికా విద్యార్థుల సంఖ్య 4,181. కాగా, 2016-17లో 12.5 శాతం పెరిగి.. మొత్తం 4,704 మంది అమెరికా విద్యార్థులు భారత్‌లో అడుగుపెట్టారు. అంకెల్లో ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ.. విదేశీ విద్యార్థులను ఆకర్షించే క్రమంలో ఐఐటీలు, ఐఐఎంలు అనుసరిస్తున్న విధానాలే ఈ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి.
గత రెండేళ్లలో కోర్సుల వారీగా భారత విద్యార్థులు...
కోర్సు స్థాయి 2016-17 2017-18
అండర్ గ్రాడ్యుయేట్ 21,977 23,346
గ్రాడ్యుయేట్ 1,04,899 95,651
నాన్-డిగ్రీ 2,259 1,884
ఓపీటీ 57,132 75,390

ఫేవరెట్ యూనివర్సిటీలు :
అమెరికాలో అడుగు పెట్టాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు.. ఆయా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫేవరెట్ యూనివర్సిటీలుగా నిలుస్తున్న టాప్-10 వర్సిటీలు..
1. న్యూయార్క్ యూనివర్సిటీ
2. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా
3. నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ - బోస్టన్
4. కొలంబియా యూనివర్సిటీ
5. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ
6. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్
7. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా - లాస్‌ఏంజెల్స్
8. పురుడె యూనివర్సిటీ
9. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా - శాన్‌డియాగో
10. బోస్టన్ యూనివర్సిటీ

అమెరికాలో విదేశీ విద్యార్థులు (2017-18) టాప్-10 కంట్రీస్ :
దేశం విద్యార్థులు
చైనా 3,63,341
భారత్ 1,96,271
దక్షిణ కొరియా 54,555
సౌదీ అరేబియా 44,432
కెనడా 25,909
వియత్నాం 24,325
తైవాన్ 22,454
జపాన్ 18,753
మెక్సికో 15,468
బ్రెజిల్ 14,620

ఎఫ్-1 పరంగా ఇబ్బందులు లేవు :
 అమెరికాలో ఎఫ్-1 (స్టూడెంట్ వీసా) పరంగా ఎలాంటి ఇబ్బందులు, కఠినమైన నిబంధనలు లేకపోవడంతో ఇప్పటికీ ఆ దేశమే స్టడీ అబ్రాడ్ పరంగా భారతీయ విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. కానీ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ ధోరణి మారే పరిస్థితి కనిపిస్తోంది. డాలర్‌తో పోల్చితో రూపాయి విలువ తగ్గడం, పర్యవసానంగా విద్యార్థులపై అదనపు భారం పడే పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అమెరికానే తమ గమ్యంగా భావించే విద్యార్థులు ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలి. అవసరమైన స్టాండర్డ్ టెస్ట్‌లలో మంచి స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి.
- ఆలపాటి శ్రీకర్, సీఈఓ, గ్లోబల్ ట్రీ అకాడమీ.
Published date : 28 Nov 2018 12:04PM

Photo Stories