Skip to main content

యూకే కొత్త వీసా నిబంధనలతో..భారతీయ విద్యార్థులకు ప్రయోజనాలెన్నో...

అమెరికా, కెనడా, యూకే.. స్టడీ, వర్క్ అబ్రాడ్ పరంగా.. భారత విద్యార్థుల టాప్-3 గమ్యాలు! ఎంతోకాలంగా మన విద్యార్థుల చూపంతా అమెరికా వైపే! కానీ.. ట్రంప్ కఠిన నిబంధనల కారణంగా యూఎస్ వీసా లభించడం ఇప్పుడు అంతతేలిక కాదన్న విషయం స్పష్టమైంది. దాంతో ప్రత్యామ్నాయ దేశాల గురించి అన్వేషణ మొదలైంది. ఇదే సమయంలో ఇంతకాలం కఠిన వీసా నిబంధనలు అనుసరిస్తూ వచ్చిన యూకే... తాజాగా విదేశీ విద్యార్థులకు ఓ శుభ వార్తను అందించింది! పోస్ట్ స్టడీ వర్క్ గడువును రెండేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది!! కొత్త వీసా విధానం వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచే అమల్లోకి రానుందనే చల్లటి కబురు చెప్పింది. ఈ నేపథ్యంలో.. యూకే కొత్త వీసా నిబంధనలు.. భారతీయ విద్యార్థులకు ప్రయోజనాలపై కథనం...
బ్రెగ్జిట్ ప్రభావం:
బ్రెగ్జిట్.. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే వైదొలిగే ప్రక్రియ. ఇది దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 31 తర్వాత ఈయూ నుంచి బ్రిటన్ అధికారికంగా బయటికి రానుంది. నాలుగేళ్లుగా సాగుతున్న బ్రెగ్జిట్ వివాదం కారణంగా ఈయూ దేశాల విద్యార్థులు యూకేకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో బ్రిటన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. ఇదే ఇప్పుడు నాన్-ఈయూ దేశాల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు వరంగా మారిందని చెప్పొచ్చు.

పోస్ట్ స్టడీ వర్క్ :
దేశంలో నిపుణుల కొరత పెరుగుతున్న దృష్ట్యా యూకే ప్రభుత్వం.. నాన్-ఈయూ విద్యార్థులు తమ దేశంలో ఉన్నత విద్య అభ్యసించడంతోపాటు చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగ అన్వేషణ సాగించేందుకు వీలుగా పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలను సరళతరం చేసింది. పోస్ట్ స్టడీ వర్క్ గడువును రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా యూకే వర్సిటీల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే మన విద్యార్థులు.. రెండేళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ వ్యవధిలోపు ఉద్యోగం సొంతం చేసుకుంటే వర్క్ వీసా సులభంగానే మంజూరవుతుంది. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం- బ్రిటన్‌లోని విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఆరు నెలలు మాత్రమే అక్కడ ఉండి ఉద్యోగాన్వేషణ సాగించే వీలుంది.

నిపుణుల కొరతే కారణమా!
యూకే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వీసా విధానం 2020-21 నుంచి అమల్లోకి రానుంది. ఇది భారతీయ విద్యార్థులకు బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. యూకేలో అడుగుపెడుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా ఏటేటా భారత విద్యార్థులకు ఆ దేశం మంజూరు చేస్తున్న స్టూడెంట్ వీసాల సంఖ్య కూడా పెరుగుతోంది. 2017తో పోల్చితే 2018లో యూకే వీసాలు పొందిన భారత విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.

వీసాలు.. పలు కేటగిరీలు :
వాస్తవానికి ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వచ్చే విదేశీయులకు ఇచ్చే వీసాలను బ్రిటన్ ఆరు కేటగిరీలుగా (టైర్-1 నుంచి టైర్-6) వర్గీకరించింది. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులు టైర్-4 వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-4 వీసా మంజూరు కావాలంటే.. విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా బ్రిటన్‌లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. సదరు అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఆధారంగానే టైర్-4 వీసా మంజూరవుతుంది. టైర్-4 వీసాలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉంటుంది.

టైర్-2 వర్క్ వీసా :
యూకేలోని సంస్థల్లో ఉద్యోగం పొందిన విదేశీయులకు టైర్-2 వీసా పేరిట అనుమతి లభిస్తుంది. సదరు అభ్యర్థులు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ లేదా యాజమాన్యం నుంచి స్పాన్సర్‌షిప్ లెటర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అక్కడే విద్యను అభ్యసించి పోస్ట్ స్టడీవర్క్ గడువులో ఉద్యోగాన్వేషణ సాగిస్తూ.. ఉద్యోగం సొంతం చేసుకున్న విదేశీ విద్యార్థులు తమ టైర్-2 వీసాను టైర్-4 వీసాగానూ మార్చుకునే అవకాశం ఉంది.

టైర్-5.. టెంపరరీ వర్క్ వీసా :
యూకే అందిస్తున్న వీసాల్లో మరో ముఖ్యమైనది.. టైర్-5 టెంపరరీ వర్క్ వీసా. అంటే.. వేరే దేశంలో ప్రధాన కార్యాలయం ఉండి.. యూకేలో క్లయింట్లను కలిగి ఉన్న సంస్థలు... యూకేలోని ఆ క్లయింట్ల కార్యాలయంలో కొద్దికాలంపాటు పని చేసేందుకు వీలు కల్పించే వీసా.. టైర్-5 వీసా.

కనీస వేతనం తప్పనిసరి :
టైర్-2 వర్క్ వీసా సొంతం చేసుకునే క్రమంలో సదరు ఉద్యోగులు ఆయా రంగాలకు సంబంధించి నిర్దిష్ట మొత్తంలో కనీస వేతనంతో కూడిన ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఆయా రంగాలు.. వాటికి నిర్ధారించిన కనీస కనిష్ట వేతనాల వివరాలను యూకే ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.

వీసాలకు పాయింట్లు :
టైర్-1 నుంచి టైర్-6 వరకు.. ఒక్కో టైర్‌కు సంబంధించి వంద పాయింట్ల ఆధారిత స్కోరింగ్ విధానాన్ని యూకే అమలు చేస్తోంది. టైర్-2 జనరల్ వర్క్ వీసాకు మొత్తం నాలుగు అంశాల ఆధారంగా పాయింట్లు కేటాయించింది. ఆ పాయింట్లు పొందిన వారికే వీసాల మంజూరులో ప్రాధాన్యం ఉంటుంది.
అవి..
  1. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ - 30 పాయింట్లు
  2. వేతన శ్రేణి - 20 పాయింట్లు
  3. నిర్వహణ - 10 పాయింట్లు
  4. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ - 10 పాయింట్లు.
  • టైర్-4 స్టూడెంట్ వీసాకు సంబంధించి పరిగణించే అంశాలు-పాయింట్లు..
  1. సీఏఎస్ (కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్స్ ఫర్ స్టడీస్)-30 పాయింట్లు
  2. నిర్వహణకు సంబంధించిన అంశాలు - 10 పాయింట్లు.

ఈయూ సభ్య దేశాలు.. వేర్వేరు వీసాలు :
ఈయూలోని సభ్య దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఆయా దేశాల ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం వేర్వేరుగా వీసాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దేశంలో నిబంధనలు ఒక్కో విధంగా ఉంటున్నాయి. అన్ని దేశాలు కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి కోర్సుల కనీస కాల వ్యవధిని పేర్కొంటాయి. ఆ కోర్సుల్లో చేరి.. అడ్మిషన్ కన్ఫర్మేషన్ పొందిన అభ్యర్థులకే వీసాలు మంజూరు చేస్తున్నాయి.

షెంజెన్‌తో 26 దేశాలకు :
ఈయూ దేశాలు వీసాల పరంగా విదేశీయులకు కలిసొచ్చే అంశం.. షెంజెన్ (Schengen) వీసా విధానం. దీని ప్రకారం.. ఈయూలోని ఏదైనా ఒక దేశంలో వీసా పొందిన అభ్యర్థులు.. ఈయూ ప్రాంతంలోని ఇతర దేశాలకు సులువుగా పయనించే విధానం. అయితే ఈ షెంజెన్ వీసాలతో తాము వెళ్లిన ఇతర ఐరోపా దేశంలో ఎలాంటి ఉద్యోగం చేసే వెసులుబాటు ఉండదు.

సానుకూలతలెన్నో!
యూకేలో విద్య పరంగా మన విద్యార్థులకు పలు సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏడాది వ్యవధిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా అమెరికా వంటి ఇతర దేశాలతో పోల్చుకుంటే వ్యయం కొంత తక్కువే. అలాగే డిపెండెంట్స్‌తో కలిసి విద్యార్థులు అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువుకునే సమయంలో డిపెండెంట్స్ పూర్తి సమయం ఉద్యోగం చేసే వీలుంది. ఇలా డిపెండెంట్ హోదాలో ఉద్యోగం చేయాలనుకునే వారు కొలువు లభించాక ప్రత్యేకంగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

వీసా పరిమితి తొలగిస్తారా!?
విదేశీ ఉద్యోగులకు ఇచ్చే వీసా ‘క్యాప్’(వీసా పరిమితి)ని ఎత్తి వేయాలనే దిశగా యూకే ఇమిగ్రేషన్, హోం అఫైర్స్ విభాగాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఏటా విదేశీయులకు గరిష్టంగా 20,700 వీసాలను మంజూరు చేస్తున్నారు. 2021 నాటికి ఈ పరిమితిని ఎత్తి వేసే దిశగానూ యూకే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. దీనికి ఆమోదం లభిస్తే భారతీయులు భారీగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

2030 నాటికి ఆరు లక్షలు:
రానున్న సంవత్సరాల్లో భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులకు అనుమతులు ఇవ్వాలని యూకే భావిస్తోంది. 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులు యూకేలో అడుగు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఏటా క్రమేణా 30 శాతం మేర విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగేలా నిర్దిష్ట ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ విద్య ఔత్సాహికులకు యూకే ఉత్తమ గమ్యంగా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

తాజా నిర్ణయంతో ప్రయోజనం...
తాజాగా యూకే ప్రభుత్వం పోస్ట్ స్టడీ వర్క్‌కు గడువును రెండేళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఈయూ సభ్య దేశాలకు చెందిన వారు యూకే నుంచి వెనుదిరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల యూకేలో నిపుణుల కొరత పెరుగుతుంది. ఇది భారత విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు.
-దురిశెట్టి సంతోశ్ కుమార్, సీఎంఓ అండ్ యూకే హెడ్, Conduira వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్ డివిజన్
Published date : 28 Sep 2019 04:34PM

Photo Stories