Skip to main content

విద్యలో పెనుసంస్కరణలు

చిల్లకూరు: దేశ చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుండిపోయేలా విద్యలో పెను సంస్కరణలు తీసుకొచ్చారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
Reforms in Education
విద్యలో పెనుసంస్కరణలు

చిల్లకూరులోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో శుక్రవారం రూ.1.91 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యానికి అండగా నిలిచి ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే సీబీఎస్‌ఈ చదువును బడుగు, బలహీన వర్గాల వారికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టి పిల్లల ఉజ్వల భవితకు బాటలు వేశారని కొనియాడారు.

రూ.400 కోట్లతో అంబేడ్కర్‌ విగ్రహం

డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని రూ.400 కోట్లతో స్మృతివనంలో ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ తొలిసారి చిల్లకూరులో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, అలాంటి పాఠశాలలో నేడు నూతన భవనాలను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ మాట్లాడుతూ ప్రతి బిడ్డా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పిల్లలు చేరుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి మాట్లాడారు. గురుకుల పాఠశాలలో ఇంకా చేపట్టాల్సిన పనులు ఉన్నాయని, వీటికి నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరారు. నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొనకా దేవసేనమ్మ, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఆర్డీఓ ఎం.కిరణ్‌కుమార్‌, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, డీసీఓ విజయభారతి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు బత్తిని విజయకుమార్‌, మండల కన్వీనర్‌ అన్నంరెడ్డి పరంధామిరెడ్డి, గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Published date : 29 Jul 2023 03:39PM

Photo Stories