భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన అన్నారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో ఉన్నతి కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
మాట్లాడుతున్న విద్యాశాఖ కమిషనర్ దేవసేన
అనంతరం మాట్లాడుతూ ఉన్నతి కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించవచ్చన్నారు. విద్యార్థులకు తరగతి విద్యాబోధన సక్రమంగా జరగాలన్నారు. ప్రధానోపాధ్యాయులు సబ్జెక్టు ఉపాధ్యాయులకు సూచనలు చేసి విద్యార్థుల అభ్యసనంలో మార్పులు తీసుకురావాలన్నారు. విద్యార్థులను విభజన చేసి, అభ్యసనా ఫలితాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతి కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దాలన్నారు. అంతకు ముందు శిక్షణ కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈఓ నారాయణరెడ్డి ఉన్నారు.