Skip to main content

సౌర కుటుంబం - భూమి

సౌర కుటుంబంలో సూర్యుడు, ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. ఎనిమిది గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. సూర్యుడి ఉపరితలంపై 6000°c, కేంద్రంలో 1,000,000°c ఉష్ణోగ్రత ఉంటుంది.
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే పాలవెల్లి, ఆకాశగంగ అని కూడా అంటారు.
మొత్తం గ్రహాల సంఖ్య - 8. గ్రహాల్లో బుధుడు సూర్యుడికి అతి చేరువలో ఉంటాడు. తర్వాత వరుసగా శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలున్నాయి.
గ్రహాలను రెండు భాగాలుగా విభజించారు. అవి..
1) అంతర్ గ్రహాలు
2) బాహ్య గ్రహాలు
అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు.
బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫే (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.
భూమి.. సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.లు. సౌర కుటుంబం పుట్టుక గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అవి:
భూచలనాలు - వాటి ఫలితాలు
భూమికి రెండు చలనాలున్నాయి. ఒకటి భూభ్రమణం, రెండోది భూపరిభ్రమణం. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను పశ్చిమం వైపు నుంచి తూర్పునకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు.
భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన ఒక బిందువు, దక్షిణాన ఒక బిందువు స్థిరంగా ఉంటాయి. ఉత్తరాన ఉన్న స్థిర బిందువును ఉత్తర ధ్రువమని, దక్షిణాన ఉన్న స్థిర బిందువును దక్షిణ ధ్రువమని అంటారు. భూభ్రమణం వల్ల రాత్రి, పగలు ఏర్పడతాయి.
ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి ద్వారా గీసిన ఊహారేఖను ‘అక్షం’ అంటారు. భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై సూర్యకాంతి పడి పగలు, మిగిలిన అర్ధ గోళంలో రాత్రి ఏర్పడుతుంది.
భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు అంటే 24 గంటలు లేదా ఒక రోజు పడుతుంది. భూభ్రమణం వల్ల రేయింబవళ్లు ఏర్పడడమే కాకుండా పవనాలు, సముద్ర ప్రవాహాల మార్గాల్లో మార్పులు సంభవిస్తాయి. సముద్రంలో రోజుకి రెండుసార్లు పోటుపాట్లు కలగడానికి భూమ్రణమే కారణం.
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి రావడాన్ని ‘భూ పరిభ్రమణం’ అంటారు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ‘కక్ష్య’ అంటారు. ఈ కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంది. దీని పొడవు 965 కి.మీ. భూ పరిభ్రమణానికి ఒక సంవత్సర కాలం అంటే 365 1/4 రోజుల సమయం పడుతుంది.
సాధారణంగా సంవత్సరంలో 365 రోజులుంటాయి. అయితే మిగిలిన 1/4 రోజును (6 గం॥నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలిపి 366 రోజులుగా లెక్కిస్తారు. ఈ సంవత్సరాన్ని ‘లీపు సంవత్సరం’ అంటారు. అందువల్ల లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. భూ పరిభ్రమణం వల్ల పగలు, రాత్రి వేళలో తేడాలు ఉంటాయి. రుతువులు ఏర్పడతాయి.
సూర్యుడి నుంచి అతి తక్కువ దూరంలో ఉండే భూమి స్థానాన్ని పరిహేళి అంటారు. సూర్యుడి నుంచి భూమికి కనిష్ట దూరం 147 మిలియన్ కి.మీ. ఈ పరిహేళి జనవరి 3న సంభవిస్తుంది.
సూర్యుడి నుంచి ఎక్కువ దూరంలో ఉండే భూమి స్థానాన్ని ‘అపహేళి’ అంటారు.ఈ అపహేళి జూలై 4న సంభవిస్తుంది. సూర్యుడి నుంచి భూమికి గరిష్ట దూరం 152 మిలియన్ కి.మీ. భూమి అక్షం వంగి ఉండడం, భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల నిడివి తగ్గడం వంటి కారణాలతో రాత్రింబవళ్లలో వ్యత్యాసం ఏర్పడుతుంది. భూమి అక్షం భూకక్ష్య మీది క్షితిజ లంబం నుంచి 23 1/2°లు వంగి ధ్రువ నక్షత్రానికి ఎదురుగా ఉంటుంది.
భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. అదేవిధంగా ధ్రువాల వద్ద భూభ్రమణ వేగం - 0. భూమి అక్షం 23 1/2° వంగి ఉండడంతోపాటు భూమి.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల రుతువులు ఏర్పడతాయి.
భూమి అక్షం వంగి ఉండక నిటారుగా ఉన్నట్లయితే సూర్యుడు ఎప్పుడూ భూమధ్యరేఖకు లంబంగానే ఉండేవాడు. దీనివల్ల భూమిపై ప్రాంతాలన్నీ సంవత్సరం పొడవునా ఒకే రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉండేవి. ఇప్పటిలాగా రుతువులు ఏర్పడేవి కాదు.
సూర్యుడు మకరరేఖ నుంచి ఉత్తరానికి పయనించడం ప్రారంభిస్తే ఉత్తరాయనమని, సూర్యుడు కర్కటరేఖ నుంచి దక్షిణాభిముఖంగా పయనించడం ప్రారంభించినప్పటి నుంచి దక్షిణాయనమని అంటారు.
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం తీసుకుంటున్నందువల్ల మనం చంద్రుడిని ఒకే వైపు చూడగలుగుతున్నాం. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి 27 1/3 రోజులు సమయం పడుతుంది.

గ్రహణాలు
సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు.. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ గ్రహణ కాలంలో సూర్యుడిపైన, చంద్రుడిపైన నీడ పడినట్లు కనిపిస్తుంది. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ‘చంద్రగ్రహణం’ ఏర్పడుతుంది.
భూమి ఎప్పుడూ సూర్యుడి ఎదురుగా ఉండి మిగతా సగం సూర్యకిరణాలు పడక చీకటిగా ఉంటుంది. అంటే భూమి మిగతా సగం తన నీడ భాగం. ఈ నీడ భాగాన్ని ‘ప్రచ్ఛాయ’ అని, నీడ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ’ అని అంటారు.
చంద్రుడు ప్రచ్ఛాయలోకి వచ్చినప్పుడు ‘చంద్ర గ్రహణం’ ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజు వస్తుంది. చంద్రుడి కక్ష్యతలం భూ కక్ష్య తలానికి 5°9 నిమిషాల కోణంలో ఉన్నందువల్ల భూ కక్ష్య తలానికి బాగా పైన లేదా కింద ఉన్నప్పుడు అన్ని పౌర్ణమి దినాల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డు వస్తే అప్పుడు ‘సూర్యగ్రహణం’ ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజుల్లో వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ మీద ఉన్నప్పుడు చంద్రబింబం సూర్యకాంతి ఆవరణాన్ని కప్పినట్లు కనిపిస్తుంది. అప్పుడు నేరుగా చంద్రుడి నీడలో ఉన్న భూ భాగంలో ‘సంపూర్ణ సూర్య గ్రహణం’ ఏర్పడుతుంది.

అక్షాంశాలు - రేఖాంశాలు
ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో, భూమి మధ్య, భూమి చుట్టూ గీసిన ఊహారేఖను ‘భూమధ్యరేఖ’ అంటారు. ఇది భూమిని రెండు గోళాలుగా విభజిస్తుంది. భూమధ్యరేఖకు ఉత్తరాన ఉండే గోళాన్ని ‘ఉత్తరార్ధ గోళమని’, దక్షిణాన ఉండే గోళాన్ని ‘దక్షిణార్ధ గోళమని’ అంటారు.
భూమి చుట్టూ ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు గీసిన ఊహారేఖలను ‘అక్షాంశాలు’ అని అంటారు. ఇవి వృత్త రేఖలు. భూమిని మొత్తం 1° అంతరంతో మొత్తం 180 అక్షాంశాలుగా విభజించారు. భూమధ్యరేఖను కలుపుకుంటే మొత్తం 181. భూమధ్యరేఖ 0°ల అక్షాంశం కాగా, ఉత్తర ధ్రువం 90° ఉత్తర అక్షాంశం, దక్షిణ ధ్రువం 90° దక్షిణ అక్షాంశం. భూమధ్యరేఖనే ‘గ్రేట్ సర్కిల్’ అంటారు.
అక్షాంశాలని ‘సమాంతర రేఖలు’ అని కూడా అంటారు. వీటిలో పెద్ద అక్షాంశం భూమధ్యరేఖ. అక్షాంశాల వల్ల ఒక ప్రదేశం శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు. అక్షాంశాలు ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి. అక్షాంశాలన్నీ ఊహారేఖలే. అక్షాంశాలన్నీ తూర్పు, పడమరలుగా వ్యాపించి ఉన్నాయి. అంటే అడ్డంగా సమాంతరంగా ఉన్నాయి. ఒక అక్షాంశం 111 కి.మీ.లకు సమానం. అదేవిధంగా రెండు వరుస అక్షాంశాల మధ్య దూరం 111 కి.మీ.
23 ½°ల ఉత్తర అక్షాంశరేఖను కర్కటరేఖ అని, 23 ½°ల దక్షిణ అక్షాంశ రేఖను మకర రేఖ అని అంటారు. 66 ½° ఉత్తర అక్షాంశాన్ని ‘ఉత్తర ధ్రువ వలయం’ అని, 66 ½° దక్షిణ అక్షాంశాన్ని ‘దక్షిణ ధ్రువ వలయం’ అని అంటారు.
సూర్య కిరణాలు భూమిపై 23 ½° ఉత్తర అక్షాంశం, 23 ½° దక్షిణ అక్షాంశ రేఖల మధ్య ఉండే ప్రదేశాల మీద లంబంగా పడతాయి. ఈ రెండు రేఖలకు బయటి ప్రదేశాల్లో ఎప్పుడూ లంబంగా పడవు. ఈ రెండు అక్షాంశ రేఖలనే ఇతర రేఖాంశాలను గుర్తించేందుకు సూచికగా పరిగణిస్తారు. దీన్నే ‘0°’ లేదా ‘గ్రీనిచ్ మెరిడియన్’ అంటారు.
భూమధ్యరేఖను ఖండిస్తూ ధ్రువాలను కలుపుతూ భూమి చుట్టూ లంబంగా గీసిన వృత్తాలను ‘రేఖాంశాలు’ అంటారు. వీటిని ‘అర్ధ వృత్తాలు, మధ్యాహ్న రేఖలు’ అని పిలుస్తారు. రేఖాంశాల వల్ల వివిధ ప్రదేశాల్లోని కాలంలో తేడాలను గుర్తించవచ్చు. రేఖాంశాలు ధ్రువాల వద్ద కేంద్రీకృతం అవుతాయి. రేఖాంశాలన్నీ కూడా ఊహారేఖలే.
రేఖాంశాలన్నీ ఉత్తర, దక్షిణాలుగా వ్యాపిం చి ఉన్నాయి. అంటే నిలువుగా లంబంగా ఉన్నాయి. రేఖాంశాలు మొత్తం 360. గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180° వరకు 180 తూర్పు రేఖాంశాలు, పశ్చిమంగా 180° వరకు 180 పశ్చిమ రేఖాంశాలు ఉన్నాయి.
రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ ఒకేసారి ‘మధ్యాహ్నం’ అవుతుంది. కాబట్టి రేఖాంశాలను ‘మధ్యాహ్న రేఖలు’ అంటారు. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపునకు పోయే కొద్దీ రేఖాంశాల మధ్య దూరం తగ్గుతుంది. ధ్రువాల వద్ద రేఖాంశాలన్నీ కలుస్తాయి. అక్కడ వాటి మధ్య దూరం ‘0’ అవుతుంది.
లండన్ సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా వెళ్లే రేఖాంశాన్ని ‘ప్రామాణిక రేఖాంశం’గా తీసుకున్నారు.
గ్రీనిచ్ రేఖకు, 180° తూర్పు రేఖాంశానికి మధ్య ఉన్న భూభాగాన్ని ‘పూర్వార్ధ గోళం’ అని, గ్రీనిచ్ రేఖకు, 180°ల పశ్చిమ రేఖాంశానికి మధ్య ఉన్న భూభాగాన్ని ‘పశ్చిమార్ధ గోళం’ అని అంటారు. భూమి 1ని రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. భూమిపై ఒక ప్రాంత ఉనికిని తెలుసుకోవడానికి అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగపడతాయి. 180°ల తూర్పు రేఖాంశం, 180° పశ్చిమ రేఖాంశం ఒకటే రేఖాంశం అవుతుంది. ఈ రేఖాంశాన్నే ‘అంతర్జాతీయ దినరేఖ’ అంటారు. ఇది పసిఫిక్ సముద్రం ద్వారా పోతుంది.
రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు 12 గంటలుగా తీసుకొని నిర్ణయించిన కాలాన్ని ‘స్థానిక కాలం’ అంటారు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ప్రామాణిక రేఖాంశాన్ని నిర్ణయించి దీనిపై ఉన్న స్థానిక కాలాన్ని ఆ ప్రాంత ‘ప్రామాణిక కాలం’ అంటారు. గ్రీనిచ్ స్థానిక కాలాన్నే ‘ప్రపంచ ప్రామాణిక కాలం’గా పరిగణిస్తున్నారు. సముద్రయానం చేసేవారి నౌక ఏ రేఖాంశంపై ఉందో తెలుసుకోవడానికి ‘క్రోనోమీటర్’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
సూర్యుడు ఉత్తరార్ధ గోళంలో ఉండే ఆరు నెలల కాలంలో ఉత్తర ధ్రువ వలయం అంటే 66 ½°ల ఉత్తర అక్షాంశంపైన ఉన్న భూభాగంలో 24 గంటలు పగలు ఉంటుంది. అదే సమయంలో దక్షిణ ధ్రువ వలయం అంటే 66½°ల దక్షిణ అక్షాంశంపైన ఉన్న భూభాగంలో 24 గంటలు రాత్రి ఉంటుంది. సూర్యుడు దక్షిణార్థ గోళంలో ఆరు నెలల కాలంలో ఉత్తర ధ్రువ వలయం 24 గంటలు చీకటిలో ఉంటే, దక్షిణ ధ్రువ వలయం 24 గంటలు వెలుతురులో ఉంటుంది.
82½°ల తూర్పు రేఖాంశాన్ని ప్రమాణంగా తీసుకొని భారత్ ప్రామాణిక కాలాన్ని నిర్ణయిస్తారు. ఈ రేఖాంశం అలహాబాద్ ద్వారా వెళ్తుంది. మన రాష్ర్టంలో కాకినాడ ద్వారా పోతుంది. గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే మనదేశ ప్రామాణిక కాలం 5½ గంటల ముందు ఉంటుంది.
అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం రష్యా. సూర్యుడు ఉత్తరార్ధ గోళంలో ఉన్నప్పుడు, ఉత్తర ధ్రువ ప్రాంతంలో జూన్‌లో కొన్ని రోజులు సూర్యుడు రోజుకీ 20 గంటలకు పైగా కనిపించడాన్ని ‘అర్ధరాత్రి సూర్యుడు’ అంటారు. నార్వేను ‘ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్’గా పేర్కొంటారు. సూర్యుడు అన్ని దేశాల కంటే ముందుగా జపాన్‌లో ఉదయిస్తాడు. అందుకే జపాన్‌ని ‘ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్’ అంటారు.

మాదిరి ప్రశ్నలు

  1. సూర్యుడి ఆకర్షణ శక్తి.. భూమి ఆకర్షణ శక్తికి ఎన్నిరెట్లు అధికంగా ఉంటుంది?
    1) 32
    2) 28
    3) 22
    4) 36
  2. సూర్యుడి వయసు సుమారుగా?
    1) 3 మిలియన్ సంవత్సరాలు
    2) 8 మిలియన్ సంవత్సరాలు
    3) 5 బిలియన్ సంవత్సరాలు
    4) 10 బిలియన్ సంవత్సరాలు
  3. అత్యల్ప సాంద్రత గల గ్రహం?
    1) గురుడు
    2) శుక్రుడు
    3) బుధుడు
    4) శని
  4. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం?
    1) శుక్రుడు
    2) శని
    3) నెప్ట్యూన్
    4) యురేనస్
  5. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు?
    1) బుధుడు, శుక్రుడు
    2) శుక్రుడు, కుజుడు
    3) కుజుడు, గురుడు
    4) నెప్ట్యూన్, బుధుడు
  6. పవనాల మార్గాలు, సముద్ర ప్రవాహ మార్గాల్లో మార్పులు వేటివల్ల సంభవిస్తాయి?
    1) రుతువులు
    2) భూ పరిభ్రమణం
    2) భూ భ్రమణం
    4) గ్రహణాలు
  7. భూభ్రమణం గంటకు ఎంత వేగం?
    1) 1610 కి.మీ.
    2) 1016 కి.మీ.
    3) 1601 కి.మీ
    4) 1616 కి.మీ.
  8. భూకక్ష్య పొడవు?
    1) 695 కి.మీ.
    2) 956 కి.మీ
    3) 965 కి.మీ.
    4) 659 కి.మీ.
  9. పరిహేళి ఎప్పుడు సంభవిస్తుంది?
    1) జూలై 4
    2) జనవరి 4
    3) జనవరి 3
    4) జూలై 3
  10. చంద్రుడి కక్ష్యతలం.. భూమి కక్ష్యతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?
    1) 9°ల 5 నిమిషాలు
    2) 8°ల 9 నిమిషాలు
    3) 5°ల 9 నిమిషాలు
    4) 9°ల 4 నిమిషాలు
  11. పరిహేళి దశలో భూమి, సూర్యుడికి ______ మి.కి.మీ. దూరంలో ఉంటుంది?
    1) 152
    2) 150
    3) 147
    4) 137
  12. సూర్యుడికి.. భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది?
    1) జనవరి 3
    2) జూలై 4
    3) మార్చి 21
    4) సెప్టెంబర్ 23
  13. అక్షాంశ - రేఖాంశాలను ఆధారం చేసుకొని మానవ చరిత్ర రచనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన శాస్త్రవేత్త?
    1) అరిస్టాటిల్
    2) హోమర్
    3) స్ట్రాబ్
    4) టాలమీ
  14. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి ద్వారా వెళ్తుంది?
    1) బేరింగ్
    2) పాక్
    3) పనామా
    4) సూయజ్ కాలువ
  15. కర్కటరేఖ మనదేశంలోని ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది?
    1) 3
    2) 5
    3) 8
    4) 9
  16. భూమిని మూడు పొరలుగా విభజించిన శాస్త్రవేత్త?
    1) సుయెస్
    2) వెజ్‌నర్
    3) వాండర్‌గ్రాచ్
    4) ఎవాన్‌‌స

సమాధానాలు

1) 2 2) 3 3) 4 4) 3 5) 1 6) 3 7) 1 8) 3
9) 3 10) 3 11)3 12) 1 13) 4 14) 1 15) 3 16) 1
Published date : 03 Jan 2015 04:15PM

Photo Stories