Skip to main content

గురుకుల టీచర్ పోస్టుల షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురుకుల టీచర్ పోస్టుల్లో ప్రధానమైన ట్రైన్‌‌డ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)తో పాటు ఫిజికల్ డెరైక్టర్ (పీడీ) పోస్టులకు మే 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మిగతా పోస్టులకు మే/జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహిస్తామని..
తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపింది. మొత్తంగా వివిధ గురుకుల పోస్టుల కోసం అభ్యర్థుల అర్హతల పూర్తి వివరాలను, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలను ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టులకు కనీస అర్హత మార్కులను డిగ్రీ, పీజీల్లో 50 శాతానికి తగ్గించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం పొంది ఉన్నా చాలని స్పష్టం చేసింది. కొన్ని కేటగిరీల పోస్టుల్లో వివిధ విద్యార్హతలున్న వారికి అవకాశం కల్పించింది. జోనల్ విధానంలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనా జోన్‌లలో పాత జిల్లాల పరిధినే ప్రామాణికంగా తీసుకుంటారు. రాత పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) నమోదు చేసుకోని వారు ముందుగా ఓటీఆర్ నమోదు చేసుకుని పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు.

టీచర్ పోస్టులకు జూన్‌లో మెయిన్ పరీక్షలు
4,362 టీజీటీ, 921 పీజీటీ, 6 పీడీ పోస్టులకు ఈనెల 18 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీతోపాటు మెయిన్ పరీక్షలను కూడా (భాషలు మినహా) ఇంగ్లిషులోనే నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలు మే 28న జరుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో రాతపరీక్ష కేంద్రాలు ఉంటాయి. ప్రిలిమినరీ అర్హత సాధించిన వారిలో 1:15 నిష్పత్తిలో రిజర్వేషన్ల ప్రకారం మెయిన్‌కు అర్హత కల్పిస్తారు. మెయిన్ పరీక్షలను జూన్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారిత) నిర్వహించాలా? అన్న దానిపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది.

టీజీటీ, పీజీటీ పోస్టులకు అర్హతలివీ..
  • టీజీటీ పోస్టులకు అభ్యర్థులు డిగ్రీ (బీఏ, బీఎస్సీ, బీకాం)లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థుళకు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు.
  • డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టుతో బీఎడ్ చేసి ఉండాలి. మొదటి నోటిఫి కేషన్‌లో ప్రథమ శ్రేణి/ద్వితీయ శ్రేణిలో బీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనగా.. ఇప్పుడు దానిని తొలగించారు. పీజీటీ పోస్టులకు బోధనా అనుభవం ఉండాలన్న నిబంధనను తొలగించారు.
  • బీఎడ్‌తోపాటు టెట్ (తెలంగాణ టెట్/సెంట్రల్ టెట్/ ఏపీ టెట్ పేపర్-2)లో అర్హత సాధించి ఉండాలి. ఏపీ టెట్ అయితే 2014 జూన్ 2వ తేదీకి ముందు అర్హత సాధించినదై ఉండాలి. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • ఇంటగ్రేటెడ్ కోర్సుల వారికి అవకాశమిచ్చారు. బీఎడ్‌తోపాటు బీఏబీఈ డీ, బీఎస్సీబీఈడీ వంటి ఇంటిగ్రీటెడ్ కోర్సులు చేసిన వారు అర్హులే. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్‌లో పొందవచ్చు.
  • డీఎడ్-డిగ్రీ కలిగిన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు.

పీఈటీ పోస్టులకు..
616 పీఈటీ పోస్టులకు ఈనెల 20 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సాధారణ అభ్యర్థులు ఇంటర్‌లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45% మార్కులు సాధించి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్ /అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/డిప్లొ మా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్కులు సాధించి ఉండాలి.

మ్యూజిక్ టీచర్ పోస్టులకు
197 మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతితోపాటు డిప్లొమా ఇన్ ఇండియన్ మ్యూజిక్/ ఇండియన్ మ్యూజిక్‌లో డిగ్రీ/ నాలుగేళ్ల డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఏ ఫోక్ ఆర్‌‌ట్స/ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్‌‌ట్స/ డిగ్రీపాటు కర్ణాటక-హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్‌లో డిప్లొమా చేసిన వారు అర్హులు.

ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ పోస్టులకు..
ఆరు ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అందులో సాధారణ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులైతే 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇందులో మరికొన్ని అర్హతలు కలిగిన వారికి అవకాశం కల్పించారు. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

లెబ్రేరియన్ పోస్టులకు..
256 లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్‌‌సలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

స్టాఫ్ నర్సు పోస్టులకు..
533 స్టాఫ్ నర్సు పోస్టులకు ఈనెల 20 నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరి స్తారు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులు. వాటితోపాటు ఏపీ/తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో అభ్యర్థులు రిజి స్టర్ చేసుకుని ఉండాలి.

ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు..
372 ఆర్ట్ టీచర్, 43 క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్ట్ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా ఇన్ ఆర్‌‌ట్స/ ఫ్రీహ్యాండ్ ఔట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్/ డిజైన్ అండ్ పెయింటింగ్ కోర్సు చేసి ఉండాలి. వాటితోపాటు హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వుడ్ వర్క్/ టైలరింగ్/ బుక్‌బైండింగ్/ ఎంబ్రాయిడరీ/ కార్పెంటర్/స్యూయింగ్ టెక్నాలజీ/ డ్రెస్ మేకింగ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ టీటీసీ చేసి ఉండాలి.

ఫీజుల వివరాలివీ..
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థి రూ.200 చెల్లించాలి. పరీక్ష ఫీజు మరో రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు
అభ్యర్థులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. 1-7-2017 నాటికి జనరల్ అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు కలుపుకొని 58 ఏళ్లు దాటిన వారు అనర్హులు. పదేళ్ల సడలింపునకు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఆర్టీసీ వంటి వాటిల్లో చేస్తున్న ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎక్స్‌సర్వీసుమెన్, ఎన్‌సీసీలో పనిచేసిన వారికి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల అదనపు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
Published date : 17 Apr 2017 12:20PM

Photo Stories