Skip to main content

ఆంధ్రప్రదేశ్ - భూగోళ శాస్త్రం

శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ర్టం ఏర్పడింది. అయితే 1956, నవంబరు 1న అప్పటి వరకు ఉన్న ఆంధ్ర రాష్ర్టంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణను కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్.

ఉనికి
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆగ్నేయంగా 12°37' - 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య 76°46' - 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. దీని వైశాల్యం 275,045 చ.కి.మీ. భారతదేశంలోని రాష్ట్రాల్లో వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట.
ఆంధ్రప్రదేశ్ భారత ద్వీపకల్పంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమోత్తరం గా మహారాష్ర్ట, పశ్చిమంగా కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు దాదాపు 972 కి.మీ. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 23 జిల్లాలున్నాయి. విస్తీర్ణంలో అనంతపురం జిల్లా అన్నిటికంటే పెద్దది. హైద రాబాద్ జిల్లా చిన్నది.
 
కోస్తా ఆంధ్ర
కోస్తా ఆంధ్రా ప్రాంతంలో తొమ్మిది జిల్లాలున్నాయి. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.
కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం 92,900 చ.కి.మీ. ఈ ప్రాంతంలో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ఏర్పరచిన సారవంతమైన డెల్టా మైదానాలున్నాయి. రాష్ర్టంలో ఆహార, వాణిజ్య పంటల్లో అత్యధికం ఈ ప్రాంతంలోనే పండిస్తున్నారు. అందుకే కోస్తా ఆంధ్రా ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పిలుస్తారు.
ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులకు సంబం ధించిన అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇవేకాకుండా నూనెశుద్ధి కర్మాగారం, నౌకానిర్మాణ కేంద్రం, హిందూస్థాన్ జింకు, కోరమండల్ ఎరువుల కర్మాగారం వంటి పెద్ద పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి.

రాయలసీమ
రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. అవి.. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం రాయలసీమ ప్రాంతం వైశాల్యం 67,400 చ.కి.మీ. కరువుకాటకాలు ఎక్కువగా ఉండటం వల్ల రాయలసీమలో జనసాంద్రత అత్యల్పంగా ఉంది. మిగతా రెండు ప్రాంతాల కంటే రాయలసీమ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనుకంజలోఉంది. శిలామయమై నిస్సారమైన మృత్తికలతో, స్వల్పంగాను, నిలకడ లేని వర్షపాతంతో ఈ ప్రాంతముంది. పారిశ్రామికంగా కూడా బాగా వెనుకంజలో ఉంది.

తెలంగాణ
తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. అవి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ. తెలంగాణ ప్రాంత వైశాల్యం 1,14,800 చ.కి.మీ. ఇక్కడి ప్రజలు ఎక్కువగా నిరక్షరాస్యులు, పేదవారు. ఈ ప్రాంతం చాలావరకు అనార్ద్రతతో కూడిన చవిటి నేల. కాబట్టి ఇక్కడ మెట్ట పంటలను చెరువుల ద్వారా పండిస్తున్నారు. పారిశ్రామికంగా మిగతా రెండు ప్రాంతాల కంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. ఈ పరిశ్రమలను చాలావరకు హైదరాబాద్- సికింద్రాబాద్ పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు.

నైసర్గిక మండలాలు, నదులు
ఆంధ్రప్రదేశ్‌ను మూడు నైసర్గిక మండలాలుగా విభజించవచ్చు. అవి..
1. తీరమైదానం
2. తూర్పు కనుమలు
3. పడమటి పీఠభూమి

తీరమైదానం
తీర మైదానం తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. ఈ మైదానంలో చాలాభాగం నదులు తెచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడింది. దాదాపు 972 కి.మీ. పొడవున వ్యాపించి ఉంది. ఈ తీర మైదానం ఉత్తర, దక్షిణ భాగాల్లో సన్నగా ఉంది. మధ్యలో కృష్ణా, గోదావరి నదులు ఏర్పరచిన డెల్టాల వల్ల సుమారు 160 కి.మీ. వెడల్పు ఉంది. ఒండ్రుమట్టితో ఏర్పడిన ఈ డెల్టాలు మిక్కిలి సారవంతమైనవి.
కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య పల్లపు ప్రాంతం కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. ఇది మంచినీటి సరస్సు. ఈ సరస్సు వైశాల్యం 250 చ.కి.మీ. నెల్లూరు జిల్లాకు, తమిళనాడుకు మధ్య సముద్రపు నీరు ఈ తీరమైదానంలోకి చొచ్చుకొని వచ్చి పులికాట్ సరస్సు ఏర్పడింది. 460 చ.కి.మీ. వైశాల్యం ఉన్న పులికాట్ సరస్సులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇది ఉప్పునీటి సరస్సు.

తూర్పు కనుమలు
తూర్పు కనుమలు తీర మైదానానికి, పడమటి పీఠభూమికి మధ్య ఉన్నాయి. ఇవి కొండల వరుసలతో ఉండి ఎక్కువగా స్థానికమైన తెంపులను కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఈ కొండలు దాదాపు 70 కి.మీ. పొడవున వ్యాపించి, చాలాచోట్ల 1200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇవి చార్నోకైట్, ఖొండాలైట్ శిలలతో ఏర్పడ్డాయి. ఈ కొండల్లో విశాఖపట్నంలోని అరకులోయ, ఉభయగోదావరి జిల్లాలోని పాపికొండలు ముఖ్యమైనవి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం మహేంద్రగిరి.
తూర్పుకనుమలని తూర్పుగోదావరి, పశ్చి మ గోదావరి జిల్లాల్లో పాపికొండలు, ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కొండలు, నెల్లూరు జిల్లాలో వెలికొండలు, అనంతపురం జిల్లాలో మడకసిరకొండలు, కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు, చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండలు, ఏనుగు మల్లమ్మ కొండలు, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కొండలు, కరీంనగర్ జిల్లాలో రాఖీ కొండలు, ఖమ్మం జిల్లాలో పాపికొండలు, ధూమకొండలు అని పిలుస్తారు.

పడమటి పీఠభూమి
ఇది పురాతనమైన ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలు ఈ పీఠభూమిలో చేరి ఉన్నాయి. ఈ పీఠభూమి ఎత్తు 150 మీ-750 మీ వరకు ఉంటుంది. పీఠభూమి ఉత్తరభాగంలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గోండ్వానా శిలలు ఉన్నాయి. ఈ గోండ్వానా శిలల్లో బొగ్గు లభిస్తోంది. పీఠభూమి ఎర్రమట్టితో కలిసి చాలా చోట్ల కొండలు, గుట్టలు, పొదలతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ సుమారు 600 మీటర్ల ఎత్తులో ఈ పీఠభూమి మధ్యలో ఉంది. ఏడాదిలో ఎక్కువ భాగం ఎండిపోయే వాగులు, నదులు, చిన్న చిన్న లోయలు, చెరువులు ఈ పీఠభూమిపై ఉన్నాయి.

నదులు
ఆంధ్రప్రదేశ్‌లో నదులు ఎక్కువ. రాష్ర్ట భూభాగం వాయవ్యం ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉండటం వల్ల మన రాష్ర్టంలో ప్రవహించే నదులన్నీ తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈ నదులన్నీ వర్షాధారాలే. వీటిలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, మంజీర నదులు ముఖ్యమైనవి.

గోదావరి
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి పెద్దది. 1465 కి.మీ. పొడవు ఉన్న గోదావరి మహారాష్ర్టలో పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకం అనేచోట పుట్టి ఆదిలాబాద్ జిల్లాలో బాసర వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది సుమారు 770 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు మొదలైనవి గోదావరి ముఖ్య ఉపనదులు. గోదావరి నదిపై రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టారు. రాజమండ్రికి దిగువన గోదావరి నది.. గౌతమి, వశిష్ట, వైనతేయ అనే మూడు పాయలుగా చీలి డెల్టాను ఏర్పరచుకొని బంగాళాఖాతంలో కలుస్తోంది.

కృష్ణానది
కృష్ణానది మహారాష్ర్టలో పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద జన్మించి తూర్పుగా ప్రవహించి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తోంది. కర్నూలు జిల్లాలో సంగం వద్ద తుంగభద్రను కలుపుకొని శ్రీశైలం, విజయవాడ మీదుగా ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీని మొత్తం పొడవు 1400 కి.మీ. మన రాష్ర్టంలో కృష్ణానది పొడవు సుమారు 720 కి.మీ.
కృష్ణానదికి విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి కట్టి దానిపై రోడ్డును నిర్మించారు. విజయవాడకు 64 కి.మీ. దూరంలో పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలి మళ్లీ ఒకటిగా కలిసిపోయింది. ఈ పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని దివిసీమ అంటారు.
నందికొండ వద్ద కృష్ణానదిపై నాగార్జునసాగర్ ఆనకట్టను నిర్మించారు. ఇది దేశంలోని పెద్ద ఆనకట్టల్లో ఒకటి. శ్రీశైలం వద్ద కూడా ఒక ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టల జలాశయాల నుంచి జలవిద్యుచ్ఛక్తిని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. తుంగభద్ర, దిండి, పాలేరు, కోయనా, వర్ణ, పంచగంగ, మూసీ, భీమ, ఘటప్రభ, మున్నేరు మొదలైనవి కృష్ణానది ముఖ్య ఉపనదులు.

తుంగభద్ర
కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో వరాహ పర్వతాల్లో పుట్టి తుంగ, భద్ర అను రెండు ఉపనదుల కలయిక వల్ల ఈ నది ఏర్పడి కర్నూలు జిల్లాలో కృష్ణానదిలో కలుస్తోంది. తుంగభద్ర కృష్ణానది ఉపనదులన్నింటిలోకి పెద్దది. తుంగభద్రపై కర్ణాటకలోని హోస్పేట్ వద్ద నీటిపారుదలకు, జల విద్యుచ్ఛక్తికి అనువుగా ఒక ఆనకట్టను కట్టారు.

పెన్నానది
కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో పుట్టిన పెన్నానది ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ప్రవేశించి కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. జయమంగళి, సగిలేరు, పాపఘ్ని, చిత్రావతి, చెయ్యేరు దీని ఉపనదులు. నెల్లూరు వద్ద ఆనకట్ట నిర్మించారు.

మంజీర నది
ఈ నది మహారాష్ర్టలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి మెదక్ జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి గోదావరిలో కలుస్తోంది. తెలంగాణలో ప్రవహిస్తున్న నదుల్లో మంజీర ముఖ్యమైంది. నిజాంసాగర్ ప్రాజెక్టును మంజీర నదిపై నిర్మించారు.

మాదిరి ప్రశ్నలు
1. తీరమైదానం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
1) బంగాళాఖాతం
2) నర్మదా నది
3) పడమటి కనుమలు
4) తూర్పు కనుమలు
2. పెన్నానది ఏ కొండల్లో జన్మించింది?
1) నందిదుర్గ
2) నల్లమల
3) ఎర్రమల
4) శేషాచలం
3. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్న నది?
1) మూసీ
2) మంజీర
3) తుంగభద్ర
4) మున్నేరు
4. మనరాష్ర్టంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటుంది?
1) ఆదిలాబాద్
2) విశాఖపట్నం
3) చిత్తూరు
4) రామగుండం
5. ఆంధ్రప్రదేశ్‌లో అడవుల కిందనున్న భూభాగ శాతం?
1) 9.57
2) 10.53
3) 14.61
4) 15.35
6. రూసా గడ్డి అధికంగా లభించే జిల్లా?
1) విశాఖపట్నం
2) ఖమ్మం
3) నిజామాబాద్
4) ఆదిలాబాద్
7. ఏ జిల్లాలో అత్యల్ప శాతం అడవులు ఉన్నాయి?
1) కృష్ణా
2) మెదక్
3) అనంతపురం
4) నల్గొండ
8. తరచూ వరదలు వచ్చే ఒక ప్రాంతం?
1) కడప జిల్లా
2) అనంతపురం జిల్లా
3) కర్నూలు జిల్లా
4) కొల్లేరు సరస్సు ప్రాంతం
9. హార్‌‌సలీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) గుంటూరు
2) కర్నూలు
3) చిత్తూరు
4) అనంతపురం
10. మనరాష్ర్టంలో కరువు ప్రాంతాలు ఉన్న జిల్లాలు ఎన్ని?
1) 13
2) 11
3) 15
4) 9
సమాధానాలు
1) 4 2) 1 3) 2 4) 4 5) 3 6) 3 7) 1 8) 4 9) 3 10) 2
Published date : 19 Dec 2014 11:57AM

Photo Stories