Skip to main content

6th Class Admissions in Navodaya Vidyalaya: నాణ్యమైన విద్యకు.. నవోదయం

జవహర్‌ నవోదయ విద్యాలయాలు.. సంక్షిప్తంగా జేఎన్‌వీలు. సృజనాత్మక పద్ధతుల్లో బోధన, ఆహ్లాదకర వాతావరణంలో లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలలు. స్కూల్‌ స్థాయిలోనే విద్యార్థుల్లో వాస్తవ దృక్పథం పెంపొందిస్తూ.. ఉన్నతంగా రాణించేలా దోహదపడుతున్నాయి ఈ విద్యాలయాలు!! ఇలా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న జేఎన్‌వీల్లో.. 2024 విద్యా సంవత్సరంలో.. ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జేఎన్‌వీల ప్రత్యేకత, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
free education and quality education in navodaya vidyalaya
  • 2024 ప్రవేశ ప్రక్రియ ప్రారంభించిన జేఎన్‌వీలు
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశం
  • జాతీయ స్థాయిలో.. మొత్తం 649 జేఎన్‌వీలు
  • లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానంలో బోధన

విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య ఎంతో కీలకమైంది. ఈ దశలో వినూత్న బోధన విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైనవే.. జవహర్‌ నవోదయ విద్యాలయాలు. ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యంగా జేఎన్‌వీలు కృషి చేస్తున్నాయి.

జాతీయ స్థాయిలో.. 649 జేఎన్‌వీలు

  • జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా 649 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ఏపీలోని 15 పాఠశాలల్లో 2 పాఠశాలలను ఎస్‌సీ/ఎస్‌టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 
  • ప్రతి నవోదయలో ఆరో తరగతిలో గరిష్టంగా 80 సీట్లు, కనిష్టంగా 40 సీట్లు ఉంటాయి. 2022 వరకు వరకు గరిష్ట సీట్ల సంఖ్య ప్రతి పాఠశాలలో 60గా మాత్రమే ఉండేది. 2023 నుంచి 80కి పెరగడంతో మరింతమంది విద్యార్థులకు నవోదయ విద్య అవకాశం లభించనుంది.

ఉచిత విద్య.. ఉన్నత బోధన
జేఎన్‌వీల మరో ప్రత్యేకత.. ఉచితంగా విద్యను అందించడం. రెసిడెన్షియల్‌ విధానంలో ఉండే ఈ జేఎన్‌వీల్లో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

ఆరో తరగతి ప్రవేశాలు–అర్హతలు

  • విద్యార్థులు 2023–24లో అయిదో తరగతి చదువుతుండాలి. 
  • గ్రామీణ విద్యార్థుల కోటాకు దరఖాస్తు చేసుకు­నే విద్యార్థులు.. మూడు నుంచి అయిదో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ,ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల్లో చదువుతుండాలి.
  • విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న జేఎన్‌వీ నెలకొన్న జిల్లాలకు చెందిన వారై ఉండాలి. జిల్లాల పునర్విభజన జరిగితే.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సంబంధిత జిల్లాకు చెంది ఉండాలి.
  • వయసు: మే 1, 2012– జూలై 31, 2014 మధ్యలో జన్మించి ఉండాలి.

100 మార్కులకు ప్రవేశ పరీక్ష

  • ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఆరో తరగతిలో అడ్మిషన్స్‌ కల్పిస్తారు. 
  • దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జాతీయ స్థాయిలో.. జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎస్‌టీ)ను నిర్వహిస్తారు. పరీక్ష మూడు విభాగాలుగా మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. 
  • ఈ ప్రవేశ పరీక్షలో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, అర్థమెటిక్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులు, లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులు.. ఇలా మొత్తం 80 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది. 
  • ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు.
  • విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. 
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశముంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమంలోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది. 
  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి కూడా పరీక్ష ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే దీని ద్వారా భర్తీ చేస్తారు. 

పరీక్షలో మంచి మార్కులకు
జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో మంచి మార్కులు పొందేందుకు విద్యార్థులు.. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలి. ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను అభ్యసనం చేయాలి.

జిల్లా స్థాయిలో ఎంపిక
ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అంటే.. విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో నెలకొన్న జేఎన్‌వీల్లో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థులు సదరు జేఎన్‌వీ నెలకొన్న జిల్లాకు చెందిన వారై ఉండాలి.జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో సాధించిన మార్కు­లు, దరఖాస్తు చేసుకున్న జిల్లా.. సదరు జిల్లాలోని జేఎన్‌వీలో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. రిజర్వేషన్లు తదితరాల ఆధారంగా జిల్లా స్థాయిలో మెరిట్‌ జాబితా ప్రకటించి ప్రవేశం కల్పిస్తారు.

పల్లె విద్యార్థులకు ప్రాధాన్యం
జేఎన్‌వీలలోని సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను పల్లే ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అదే విధంగా బాలికలను ప్రోత్సహించేలా మొత్తం సీట్లలో విద్యార్థినులకు 33 శాతం(1/3 వంతు) సీట్లను కేటాయిస్తున్నారు.

గురుకుల విధానం
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు సదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువు కోవాల్సి ఉంటుంది. క్లాస్‌ రూమ్‌ బోధనతోపాటు.. అది పూర్తయిన తర్వాత హాస్టల్స్‌లో మెంటార్స్‌ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది.

ఎనిమిది నుంచి ఇంగ్లిష్‌
ఆరో తరగతి వరకు విద్యార్థులు తమ మాతృ భాష లేదా తమ ప్రాంతీయ భాషలో చదివే అవకాశం కల్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి నుంచి మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదవాల్సి ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచి మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌ మీడియంలో, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ను హిందీ మీడియంలో చదవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌
జవహర్‌ నోవదయ విద్యాలయాల్లో ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానాన్ని అనుసరిస్తారు. అంటే.. ఏదైనా అంశాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించి ప్రాక్టికల్స్‌ లేదా పజిల్స్, క్విజ్‌లు వంటివి నిర్వహిస్తారు. తద్వారా సదరు అంశంపై విద్యార్థికి పూర్తి స్థాయి అవగాహన, ఆసక్తి కలిగేలా బోధన ఉంటుంది. విద్యార్థుల్లో వాస్తవ దృక్పథం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుకోసం యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్ట్‌లలో ప్రాక్టికల్‌ బోధనకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రాజెక్ట్‌ వర్క్, లేదా ఆయా సబ్జెక్ట్స్‌లో స్కూల్‌ స్థాయిలో ఎగ్జిబిషన్స్‌ నిర్వహిస్తూ.. విద్యార్థులకు తాము నేర్చుకున్న అంశాలకు వాస్తవ రూపం ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 10.08.2023
  • జేఎన్‌వీఎస్‌టీ పరీక్ష తేదీ: 20.01.2024
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/
Last Date

Photo Stories