Skip to main content

ఏపీ ఎంసెట్-2016 మెడికల్ టాపర్ సక్సెస్ స్పీక్స్

‘ఎంసెట్‌లో విజయానికి కావాల్సింది.. సబ్జెక్ట్‌పై నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికాలిటీ.ఈ విధానాన్ని ప్రిపరేషన్‌లో అమలు చేస్తే ఎంసెట్‌లో ఆశించిన ర్యాంకు సొంతం చేసు కోవచ్చు. ఇక.. ఫస్ట్ ర్యాంకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా లక్ష్యం నెరవేరడమే కాకుండా.. మా కోసం నాన్న పడ్డ కష్టానికి న్యాయం చేకూర్చినట్లయింది’ అంటున్నారు ఏపీ ఎంసెట్-2016 అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో 156 మార్కుల తో ఏపీ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన మాచాని హేమలత. చిన్నప్పటి నుంచే వైద్య వృత్తిపై ఉన్న ఆకాంక్షే తనను ఎంబీబీఎస్ వైపు అడుగులు వేసేలా చేసిందని చెబుతున్న హేమలత సక్సెస్ స్పీక్స్ ఆమె మాటల్లోనే..
మా స్వస్థలం కర్నూలు సమీపంలోని జొహరాపురం. నాన్న మాచాని వీరన్న వస్త్ర దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నారు. అమ్మ కళావతి గృహిణి. అమ్మ, నాన్నలకు ముగ్గురమూ అమ్మాయిలమే. అయినప్పటికీ పిల్లలు ఉన్నత స్థానంలో నిలవాలనే లక్ష్యంతో నాన్న ఎంతో శ్రమించేవారు. ఆర్థిక ఇబ్బందులు మా దృష్టికి రానీయకుండా జాగ్రత్త పడేవారు. చదువుకునేందుకు ప్రోత్సహించేవారు. దాని ఫలితంగానే అక్క సౌజన్య అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. చెల్లెలు విజయశ్రీ కూడా 9.7 జీపీఏతో పదో తరగతి పూర్తి చేసింది.

చిన్నప్పటి నుంచే ఎంబీబీఎస్ ఆకాంక్ష
పదో తరగతి వరకు నా చదువంతా జొహరాపురంలోనే. పదో తరగతి ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాను. 2013లో పదో తరగతిలో 10/10 జీపీఏతో ఉత్తీర్ణత సాధిస్తే.. కర్నూలులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల ఉచితంగా ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం కల్పించింది. ఇంటర్‌లో 985 మార్కులు వచ్చాయి. వైద్య వృత్తికి మంచి క్రేజ్ ఉండటంతో ఎంబీబీఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నా.

గత ఏడాదే ఎంబీబీఎస్ సీటు..
వాస్తవానికి ఎంసెట్-2015లోనే 245వ ర్యాంకు సాధించాను. కౌన్సెలింగ్‌లో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు లభించినా కనిష్ట వయోపరిమితి దృష్ట్యా 17 రోజులు తగ్గడంతో సీటు నిరాకరించారు. దీంతో.. ఈ ఏడాది మరింత మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో కృషి చేశాను.

ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే..
ఇంటర్ మొదటి ఏడాది నుంచే తీవ్రంగా కృషి చేశాను. ప్రతి టాపిక్‌ను ప్రాక్టికల్ థింకింగ్‌తో, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదివాను. దీంతో అన్ని టాపిక్స్‌లో సమగ్ర అవగాహన లభించింది. మొదట్లో ఫిజిక్స్ అంటే భయపడ్డాను. దీంతో మరింత శ్రద్ధ పెట్టి చదివాను. అన్ని ఫార్ములాలు, సిద్ధాంతాలను ప్రాక్టికల్‌గా అన్వయించుకుంటూ అధ్యయనం చేశాను.

ప్రతి రోజూ పది గంటలు తగ్గకుండా
మొదట్నుంచీ రోజూ పది గంటలు తగ్గకుండా చదివేలా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఈ సమయంలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజు చదవడంతోపాటు ముఖ్యాంశాలను నోట్ చేసుకున్నాను. లాంగ్‌టర్మ్ కోచింగ్ సమయంలో పూర్తిగా ప్రాక్టీస్, రివిజన్‌కు ప్రాధాన్యమిచ్చాను.

ఎయిమ్స్‌కు ప్రాధాన్యం
ఎంసెట్‌తోపాటు ఎయిమ్స్, జిప్‌మర్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఎయిమ్స్‌లో మంచి ర్యాంకు సాధించడమే నా లక్ష్యం. ఏపీలో నా తొలి ప్రాధాన్యం కర్నూలు మెడికల్ కళాశాలకే. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత న్యూరో సర్జన్ స్పెషలైజేషన్‌తో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేయడమే నా లక్ష్యం. ఆ తర్వాత వృత్తిపరంగా పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రాధాన్యమిస్తాను.

మొదటి ఏడాది నుంచే కదలాలి
ఎంసెట్‌లో విజయం సాధించాలంటే ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది నుంచే ఆ దిశగా కదలాలి. నాలుగు సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవడం, ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. అంతేకాకుండా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్టులకు హాజరవాలి.
Published date : 24 May 2016 03:33PM

Photo Stories