Skip to main content

వైద్య విద్యకు ఏకరూప సిలబస్ అమలు చేయాలి

‘మన దేశంలో వైద్య విద్య.. ఇతర దేశాలతో పోల్చితే మెరుగ్గానే ఉంది. ప్రస్తుత రోగాలు, నివారణ పద్ధతులను బోధించే విధంగా కరిక్యులంలో మార్పులు చేయాలి’ అంటున్నారు వైద్య విద్యలో దేశస్థాయిలో గుర్తింపు పొందిన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)-పుదుచ్చేరి డెరైక్టర్.. డాక్టర్ సుభాష్ చంద్ర పరీజా. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయనతో గెస్ట్ కాలమ్..
నీట్‌తో విద్యార్థులకు మేలు
నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ద్వారా దీర్ఘకాలంలో విద్యార్థులకే ప్రయోజనం. ప్రస్తుతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఒకట్రెండేళ్ల తర్వాత నీట్‌పై మెజారిటీ వర్గాలు సానుకూలంగా మారడం ఖాయం. నీట్ పరిధిలోకి ఎయిమ్స్, జిప్‌మర్, ఏఎఫ్‌ఎంసీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లను తీసుకురాకపోవడంపై విమర్శ తగదు. కేవలం మూడు ఇన్‌స్టిట్యూట్‌లు నీట్ పరిధిలోకి రానంత మాత్రాన నీట్ ఉద్దేశం నెరవేరదనే అభిప్రాయాలు సరికాదు. ఇంజనీరింగ్‌లో సింగిల్ ఎంట్రన్స్ విధానం దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఐఐటీలకు ప్రత్యేక పరీక్ష ఉంటుందని చెబుతున్నారు. కారణం.. ఇంజనీరింగ్‌లో ఆ ఇన్‌స్టిట్యూట్‌లు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా ఉండటమే! అదేవిధంగా వైద్య విద్యలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), జిప్‌మర్, ఆర్‌‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఏఎఫ్‌ఎంసీ)-పుణె సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు దాదాపు 20 మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు హాజరవుతున్న విద్యార్థులు ఇకపై నీట్‌తో కలిపి నాలుగైదు ప్రవేశ పరీక్షలు రాస్తే సరిపోతుంది.

ఏకరూప సిలబస్
వాస్తవానికి ఏ విభాగంలోనైనా ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లే మెరుగు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ వైద్య విద్యలో మాత్రం ఇందుకు భిన్నం. మన దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల పరిస్థితి మెరుగ్గా ఉంది. మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా ఎంబీబీఎస్ స్థాయి నుంచే దేశవ్యాప్తంగా ఏకరూప సిలబస్ విధానం అమలు చేయాలి. ఫలితంగా ప్రస్తుత ఆరోగ్య సమస్యలు, ఆయా భౌగోళిక పరిస్థితుల ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్న వ్యాధులు, వాటి నివారణ, చికిత్స విధానాలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వాటికి చికిత్స అందించే నైపుణ్యాలు ప్రస్తుత కరిక్యులం, సిలబస్ విధానంతో సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్‌నెస్ అండ్ డిసీజ్ ప్యాట్రన్స్‌లో మార్పులకు అనుగుణంగా కరిక్యులం మార్చాలి. దాంతోపాటు సమర్థవంతంగా ఆరోగ్య సంరక్షణ విధానాలు అమలు చేసే విధంగా టెక్నాలజీ ఆధారిత చికిత్స పద్ధతులను కూడా పొందుపర్చాలి.

కనీసం ఐదేళ్లకోసారి
కరిక్యులంను నిరంతరం మార్చడం అంటే కొంత క్లిష్టమైన ప్రక్రియే. అయితే కనీసం ఐదేళ్లకోసారైనా మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జాతీయ స్థాయిలో ఏకీకృత సిలబస్‌ను అమలు చేయాలి. పబ్లిక్ హెల్త్, హెల్త్ కేర్ సిస్టమ్స్‌పై లోతైన నైపుణ్యాలు అందించేలా ఉండాలి. ఎంబీబీఎస్ స్థాయి నుంచే రీసెర్చ్ మెథడాలజీని బోధించాలి. ఇందుకోసం (మెడికల్ రీసెర్చ్) అవసరమైన ఆర్థిక ప్రోత్సాహకాల మొత్తాలను పెంచాలి.

పేదలకు మెరుగైన సేవలు
ఎయిమ్స్ క్యాంపస్‌లను విస్తరించడం, అదేవిధంగా మరికొన్ని ప్రభుత్వ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్ల సంఖ్య పెంపు వంటివాటితో ఎంతో మేలు కలుగుతుంది. పేద ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందుతాయి. అయితే ఇప్పటికీ ఈ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటిలో ఫ్యాకల్టీ కొరత ఉందనేమాట వాస్తవం.

1:1000 కష్టసాధ్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) సిఫార్సుల మేరకు డాక్టర్-పేషెంట్ నిష్పత్తి 1:1000గా చేయడం మన దేశ పరిస్థితుల్లో కష్టసాధ్యమే. ఎందుకంటే మెడికల్ కళాశాలు, సీట్ల సంఖ్య తక్కువగా ఉండటమే! జనాభా పెరుగుదల మరో సమస్య. కాబట్టి డాక్టర్-పేషెంట్ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ఇటు ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించడంతోపాటు, అటు డాక్టర్ల సంఖ్య పెరిగేలా వైద్య విద్యా సంస్థలను విస్తృతం చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో హాస్పిటల్స్ ఏర్పాటు ద్వారా 1:1000 సిఫార్సు అమలు దిశగా ప్రయత్నించాలి.

మెడికల్ టు సివిల్ సర్వీసెస్
ఇటీవల కాలంలో పలువురు మెడికల్ పట్టభద్రులు సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతున్న మాట నిజమే. ఒక రకంగా ఇది మంచి పరిణామమే. మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా వాస్తవ సేవా దృక్పథం ఉన్న వారు సివిల్ సర్వీసెస్ ద్వారా పరిపాలనలోనూ దాన్ని ప్రతిబింబించగలుగుతారు. సామాజిక అభివృద్ధి, ప్రజల కనీస అవసరాల్లో భాగమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు సమర్థంగా అమలు చేయగలిగే సామర్థ్యం, తపన వారిలో ఉంటుంది. మొత్తం మెడికల్ పట్టభద్రుల్లో నాకు తెలిసినంతవరకు సివిల్ సర్వీసెస్ లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల వైపు వెళ్లే వారి సంఖ్య పది శాతం లోపే ఉంటోంది.

ఆసక్తి, సంసిద్ధత ముఖ్యం
ప్రజలు దైవంతో సమానంగా కొలిచే వృత్తి.. వైద్య వృత్తి. ఇంత ప్రాధాన్యమున్న వృత్తిలో రాణించాలంటే వాస్తవ ఆసక్తి, మానసిక సంసిద్ధత చాలా అవసరం. మెడికల్ కోర్సుల శిక్షణ కూడా కఠినంగానే ఉంటుంది. దాన్ని తట్టుకునే విధంగా భౌతిక, మానసిక బలం ఎంతో అవసరం. కఠినంగా ఉండే కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ప్రొఫెషన్‌లో రాణించడం ఎంతో సులభమవుతుంది. కాబట్టి కోర్సులో అడుగుపెట్టిన నాలుగైదు నెలల్లోనే భయపడటం సరికాదు. అందుకే కోర్సులో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే సైకలాజికల్ కౌన్సెలింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇన్‌స్టిట్యూట్‌లు శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి ఒక పరిపూర్ణమైన వైద్యుడిగా రూపుదిద్దుకోవడం సాధ్యమవుతుంది.

ఎంబీబీఎస్‌కు ఆల్టర్నేటివ్స్ ఎన్నో
ఎంబీబీఎస్‌లో సీటు పొందలేని విద్యార్థులకు సలహా.. ఎంబీబీఎస్ ఒక్కటే ఆప్షన్ కాదు. దీనికి ప్రత్యామ్నాయాలుగా మరెన్నో వైద్య విధానాలు, వాటికి సంబంధించిన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా కూడా ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఆకాంక్ష బలంగా ఉంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే వైద్య కోర్సును వ్యాపార కోణంలో చూడటం సరికాదు!!
Published date : 07 Jun 2016 12:08PM

Photo Stories