Skip to main content

ఆసక్తి+అన్వేషణ=ఉజ్వల కెరీర్!

‘సైన్స్ రంగంలో పరిశోధనలు పెరగటం ద్వారా సామాజిక ప్రయోజనాలు నెరవేరటంతోపాటు ప్రజల జీవనశైలిలో మార్పు వస్తుంది’ అని డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందుకున్న ఆయన ప్రస్తుతం సీఎస్‌ఐఆర్ పరిధిలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో పరిశోధకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్ సంశ్లేషణలో చేసిన పరిశోధనలకు భట్నాగర్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ రెడ్డితో గెస్ట్‌కాలం...
జీవ రసాయన శాస్త్రాలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ. అందుకే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఆ దిశగా గమ్యాన్ని నిర్దేశించుకున్నాను. 1991లో బీఎస్సీ (బీజెడ్‌సీ), ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. రసాయన శాస్త్రంలోని మూలకాలు, ధర్మాల ద్వారా పలు సహజ ఉత్పత్తులను సంశ్లేషణం చేసి, సులువైన విధానంలో రూపకల్పన చేయాలనే ఆలోచనతో పీహెచ్‌డీలో సింథటిక్స్ సంబంధిత అంశాన్ని ఎంచుకున్నాను. ఇదే విభాగంలో దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.

భయం వీడాలి
సైన్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయినా విద్యార్థులు సైన్స్, ముఖ్యంగా కెమిస్ట్రీ అంటే భయపడతారు. ఈ ఆందోళన ఇంటర్మీడియెట్ స్థాయి నుంచే ఉంటోంది. కానీ..కొద్ది రోజులు ఏదైనా లేబొరేటరీలో కెమిస్ట్రీలో నిబద్ధతతో పరిశోధనలు నిర్వహిస్తే ఆసక్తి ఏర్పడుతుంది. ప్యూర్ సైన్స్ విభాగాల్లో కెరీర్ దిశగా దీర్ఘకాలం వేచి చూడాలి అనే అభిప్రాయం కొంతవరకు వాస్తవమే! కానీ సైన్స్ రంగంలో పరిశోధనలు సమాజానికి ఉపయోగపడిన తీరు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణల్లోనే వాస్తవ ఫలితాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

సైన్స్‌పై ఆసక్తి పెరగాలి
ఇన్‌స్పైర్, కేవైపీవై ద్వారా హైస్కూల్, ఇంటర్మీడియెట్/+2 స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన, ఆసక్తి కల్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత చాలా మంది ఉద్యోగం సొంతం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారు. గేట్ వంటి పరీక్షల ద్వారా ప్రవేశాలు పొందితే ఎమ్మెస్సీ స్థాయి నుంచే స్కాలర్‌షిప్స్ అందుకోవచ్చు.

ప్రాధాన్యాన్ని గుర్తించాలి
కేవలం ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులే భవిష్యత్తు ఉపాధి వేదికలు అనే అభిప్రాయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చుకోవాలి. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు సైన్స్ కోర్సును ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే పూర్తి ఆసక్తితో చేరుతున్నారు. కానీ, వాస్తవానికి సైన్స్ కోర్సులను ప్రధాన ప్రాథమ్యాలుగా గుర్తించాలి. ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి వాటికి సైతం సైన్స్‌లోని అంశాలే మూలమని గుర్తించి, ప్రాధాన్యతను తెలుసుకోవాలి.

కొలాబరేటెడ్ రీసెర్చ్
అకడమిక్ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్‌లు అంతర్గతంగా ఆర్ అండ్ డీ కార్యకలాపాలు నిర్వహించే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, నిధుల సౌకర్యం ఎక్కువగా ఉన్న సంస్థలు.. దీనిపై దృష్టిసారించాలి. ఆర్ అండ్ డీ కోణంలో పరిశ్రమలు, విద్యాసంస్థల దృక్పథంలో మార్పు రావాలి. కొలాబరేటెడ్ రీసెర్చ్, స్పాన్సర్డ్ రీసెర్చ్ దిశగా అడుగులు వేయాలి. ఇటీవల కాలంలో కొన్ని పరిశ్రమలు సొంతగా ఆర్ అండ్ డీ కేంద్రాలను తమ సంస్థల ప్రగతి కోణంలో ఏర్పాటుచేస్తున్నాయి. కానీ కొలాబరేటెడ్ రీసెర్చ్ ఫలితంగా రెండు వర్గాలకు అవసరమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. విద్యార్థులకు వీటిలో పాల్పంచుకునే అవకాశం లభించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.

అనువర్తనాల ఆధారంగా..
సైన్స్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్థులు.. ఆసక్తితో చేరినా.. ప్రత్యామ్నాయంగా ప్రవేశం పొందినా.. అనువర్తనాల ఆధారంగా ముందుకు సాగాలి. ఒక అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయిస్తూ అధ్యయనం చేస్తే ఆసక్తి పెరుగుతుంది. సైన్స్ రంగంలో నిరంతరం జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలు, ఫలితాలు, వాటిలో తమ అకడమిక్ డొమైన్‌తో సరితూగే వాటి గురించి నిరంతర అన్వేషణ సాగిస్తుంటే కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది.

ఇతర అవార్డులు
  • డ్రగ్ డిస్కవరీ విభాగంలో సీడీఆర్‌ఐ-2013 అవార్డు
  • ఎన్‌సీఎల్ రీసెర్చ్ ఫౌండేషన్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ - 2013
  • సీఆర్‌ఎస్‌ఐ కాంస్య పతకం
  • ఎన్‌ఏఎస్‌ఐ- రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాటినమ్ జూబిలీ అవార్డు
Published date : 10 Oct 2015 11:05AM

Photo Stories