Work From Home : కరోనా ఎఫెక్ట్.. ఆఫీస్కు రావొద్దు.. వచ్చే ఏడాది మొత్తం ఇలాగే..!

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. 20 రోజుల వ్యవధిలో సుమారు 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డ్రాగన్ కంట్రీ చుట్టు పక్కల దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కజికిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్,వియాత్నంతో పాటు భారత్, అమెరికా దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు చెబుతున్నాయి.
ఆఫీస్కు రావాల్సిందే.. కానీ
ఈ తరుణంలో ఆయా దేశాలకు చెందిన సంస్థలు ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఆఫీస్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. సంస్థలు సైతం ఉద్యోగులు ఆఫీస్ రావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో చేసేది లేక ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆఫీస్కు వద్దు ఇంట్లోనే ఉండండి..

కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైనట్లు తెలుస్తోంది. ఆఫీస్ రావాల్సిందేనని పట్టుబట్టిన కంపెనీలు .. ఉద్యోగులు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని బ్రతిమలాడుతున్నాయి.
వచ్చే ఏడాది మొత్తం ఇలాగే..
భారత్లో ఫ్లిప్కార్ట్, మారికో, టాటా స్టీల్, ఎల్టీఐమైండ్ ట్రీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలన్నీ 2023 లో సైతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్ను కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. అంతేకాదు తాము కల్పిస్తున్న ఈ సౌకర్యానికి ఉద్యోగులు ఆఫీస్ వర్క్ తో పాటు పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
92 శాతం మంది ఉద్యోగులు..

గతనెలలో టెక్ సంస్థ హెచ్పీ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 92 శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్కు జై కొడుతున్నట్లు తేలింది. కోవిడ్ రాకతో మొదలైన ఈ కొత్త వర్క్ కల్చర్ వల్ల ఇటు ఆఫీస్ వర్క్ను.. అటు పర్సనల్ వర్క్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. 88 శాతం మంది ఉద్యోగులు రిటెన్షన్ ఎక్కువగా ఉందని, 72 శాతం మంది వర్క్లో ప్రొడక్టివిటీ పెరుగుతుందనే తెలిపారు.