Rojgar Mela: యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం
![Rojgar Mela: Creating jobs for the youth](/sites/default/files/images/2023/08/29/rojgar-mela-1693302526.jpg)
తాటిచెట్లపాలెం: దేశంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే ప్రధాని మోదీ ఆశయమని, దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా సోమవారం 8వ రోజ్గార్ మేళా నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు నేరుగా నియామకపత్రాలు అందజేశామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు. సోమవారం సాలగ్రామపురంలోని పోర్టు సాగరమాల కన్వెన్షన్లో జరిగిన రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ రోజ్గార్ మేళా ప్రారంభించి, ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మందికి పైగా వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించారన్నారు. సోమవారం వర్చువల్గా మరో 51 వేల మందికి నియామకపత్రాలు దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో అందజేశామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ 2024 మే నెలాఖరు నాటికి 10 లక్షల ఉద్యోగాలు మోదీ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు.