Skip to main content

ప్రశ్నించే తత్వంతోనే.. కొత్త ఆవిష్కరణలు!!

బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే తప్పనిసరిగా సొంతం చేసుకోవాల్సిన నైపుణ్యం.. కమ్యూనికేషన్ స్కిల్స్. వ్యాపార నిర్వహణలో.. పుస్తకాల్లోని సిద్ధాంతాలు, కేస్ స్టడీల కంటే వాస్తవ విధుల్లో చూపే కమ్యూనికేషన్ స్కిల్స్‌దే కీలక పాత్ర. దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ సైతం ఈ విషయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీని ప్రభావం అంతిమంగా విద్యార్థులపైనే పడుతోంది. కాబట్టి విద్యార్థులే సొంతంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే దిశగా కృషి చేయాలని సూచిస్తున్నారు.. ‘మైకా’గా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్ ప్రెసిడెంట్ అండ్ డెరైక్టర్ ప్రొఫెసర్ నగేశ్ రావు. భారత్‌లో ఎంబీఏ పూర్తి చేసి.. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఆయన.. అమెరికా, భారత్‌లలోని ప్రముఖ యూనివర్సిటీల్లో రెండు దశాబ్దాల బోధన అనుభవం గడించారు. నేడు దేశంలో బిజినెస్ ఎడ్యుకేషన్, విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రొఫెసర్ నగేశ్ రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలోని బి-స్కూల్స్ కూడా బోధన, అధ్యయనంపరంగా మార్పులు ప్రవేశపె డుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామమే! అయితే, కేవలం కోర్ ఏరియాస్‌లో మార్పులకే అధిక ప్రాధాన్య మిస్తున్నాయి. ఒక సమర్థమైన బిజినెస్ లీడర్‌గా రూపుదిద్దుకోవాలంటే.. కోర్ నాలెడ్జ్‌తోపాటు క్రియేటివిటీ, ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ వంటి సహజ నైపుణ్యాల ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. విద్యార్థులు ‘అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్’ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. తద్వారా కొత్త ఆలోచనలు చేయడానికి.. సామాజిక అవసరాలకు అనుగుణంగా వాటికి కార్యరూపం ఇవ్వడానికి ఆస్కారం లభిస్తుంది.

ఉమ్మడి సబ్జెక్టులుండాలి
ప్రస్తుతం మన మేనేజ్‌మెంట్ విద్యలో స్పెషలైజేషన్ల పాత్ర అధికంగా ఉంటుంది. విద్యార్థి తాను ఎంచుకున్న స్పెషలైజే షన్‌లో మాత్రమే రాణించగలిగేలా కోర్సులు, కరిక్యులం ఉంటున్నాయి. వీటితోపాటు బ్రాండ్ మేనేజ్‌మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్, అడ్వర్టయిజింగ్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ఉమ్మడి సబ్జెక్ట్‌లుగా రూపొందించాలి. అప్పుడే విద్యార్థులకు అన్ని నైపుణ్యాలూ లభిస్తాయి.

గ్లోబల్ మైండ్‌సెట్
బిజినెస్ లీడర్లుగా ఎదగాలనుకునే వ్యక్తులు గ్లోబల్ మైండ్‌సెట్‌ను సొంతం చేసుకోవాలి. అదే సమయంలో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రూపొందించే నైపుణ్యం కూడా చాలా అవసరం. స్వీయ ఆలోచన, నిర్ణ యాలు తీసుకునే సామర్థ్యంలో ముందంజలో ఉండాలి. అమెరికా, భారత్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఇదే. అక్కడ ఇండిపెండెంట్ థింకింగ్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంగా.. ఎన్నో కొత్త ఆవిష్కరణలు, సరికొత్త వ్యూహాలు రూపొందుతున్నాయి. దీనివల్ల గ్లోబల్ బిజినెస్ లీడర్లు ఆవిర్భవిస్తున్నారు. కానీ మన దేశంలోని విధానాల కారణంగా అకడెమిక్‌గా, కెరీర్ పరంగా ఎన్నో పరిమితులు ఉన్నాయి. వీటికి స్వస్తి పలికితే మన బిజినెస్ ఎడ్యుకేషన్‌ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రూపొందించొచ్చు.

పరిశోధనలకు అవకాశాలెన్నో!
మేనేజ్‌మెంట్ రంగంలో పరిశోధనలకు అపార అవకాశాలున్నాయి. నిర్దిష్ట స్పెషలైజేషన్‌లో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తర్వాత పీహెచ్‌డీ చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మార్కెటింగ్, స్ట్రాటజీస్‌కు సంబంధిం చి పరిశోధనలు చేసే వీలుంది. మన దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం హెల్త్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్‌లో పరిశోధనల ఆవశ్యకత ఎంతో ఉంది.

స్టార్ట్-అప్స్‌కు ఫండింగ్
ఇంజనీరింగ్‌తో పోల్చితే.. బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో స్టార్ట్-అప్స్‌కు కార్యరూపం ఇవ్వడం కొంత తేలిక. మంచి ఆలోచన, సదరు ప్రొడక్ట్ మార్కెటింగ్, సుస్థిరతకు సంబంధించిన పదునైన వ్యూహాలతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తే.. ఇప్పుడు ఫండింగ్ ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి. చాలామంది స్టార్ట్-అప్ ఔత్సాహికులు మార్కె టింగ్ వ్యూహాలు, ఫండింగ్‌పై అవగాహన లేని కారణంగా తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వలేకపోతున్నారు.

కమ్యూనికేషన్, బ్రాండింగ్
ఒక వ్యాపార విజయంలో కమ్యూనికేషన్, బ్రాండింగ్ అంశాలదే కీలకపాత్ర. స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ వంటి ఎన్ని కోర్ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం సాధించినా.. పటిష్టమైన కమ్యూనికేషన్ స్కిల్స్, బ్రాండింగ్ లేకుంటే ఆ వ్యాపారం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. దీన్ని గుర్తించే.. ‘మైకా’లో కమ్యూనికేషన్, బ్రాండింగ్ స్పెషలైజేషన్స్‌గా అందిస్తున్నాం.

సహజ నైపుణ్యాలకు అనుగుణంగా
మన దేశంలో ఉన్నత విద్య అనగానే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మాత్రమే అనే భావన ఉన్న మాట కొంత మేర వాస్తవమే! అయితే, ఇటీవల కాలంలో పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కెరీర్, కోర్సుల ఎంపిక విషయంలో విస్తృతమైన, విశాలమైన దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థు లే కాకుండా.. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ తదితర కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటమే ఇం దుకు నిదర్శనం. మరోవైపు తల్లిదండ్రులు కూడా ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తున్నారు. తమ పిల్లల్లోని సహజ నైపుణ్యాలకు అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకునేందుకు ప్రోత్సాహమందిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన దేశం అన్ని రంగాల నిపుణులకు కేరాఫ్‌గా నిలవడం ఖాయం.

విద్యార్థులు ఇన్నోవేటర్‌‌సగా మారాలి
మేనేజ్‌మెంట్, టెక్నికల్, నాన్-టెక్నికల్.. ఏ కోర్సులైనా విద్యార్థులు తమను తాము ఇన్నోవేటర్స్‌గా మార్చుకునేలా అడుగులు వేయాలి. చిన్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఎన్నో సందేహాలు, తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటాయి. కానీ.. ఒకసారి విద్యార్థిగా తరగతి గదిలోకి అడుగుపెట్టాక పుస్తకాలు, అందులోని అంశాలకే పరిమితమవుతున్నారు. తర్వాత కాలేజ్‌లో సీనియర్లను అనుసరించడం వంటి మూస ధోరణికే పరిమితం అవుతు న్నారు. అయితే, ప్రశ్నించే తత్వంతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని గుర్తించాలి. దీనికి అనుగుణంగా ఐక్యూ, ఇక్యూ రెండింటినీ పెంపొందించుకోవాలి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో దీన్ని సరైన సమయంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. ‘దిస్ ఈజ్ ద రైట్ టైమ్ ఫర్ ఇన్నోవేటర్స్’..
Published date : 11 Aug 2014 12:16PM

Photo Stories