Skip to main content

ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి...

‘‘ప్రస్తుతం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌లో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం కరిక్యులంలో మార్పులు, చేర్పులకే పరిమితం కాకుండా కొత్త విధానాలను అనుసరించాలి. అప్పుడే ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో నాణ్యమైన మేధోశక్తి బయటికొస్తుంది’’- అంటున్నారు ఐఐటీ ముంబై - మొనాష్ రీసెర్చ్ అకాడమీ సీఈవో ప్రొఫెసర్ మురళి శాస్త్రి. గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ డెరైక్టర్, టాటా కెమికల్స్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ వంటి కీలక హోదాల్లో పనిచేసిన ఆయనతో గెస్ట్ కాలం...
నేటి సాంకేతిక విద్యా విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరముంది. ఐఐటీల నుంచి సాధారణ ఇంజనీరింగ్ కళాశాలల వరకు ఈ దిశగా కృషి చేయాలి. ఈ మార్పులు వినూత్నంగా ఉండాలి. కేవలం పుస్తకాల్లోని అంశాల్లో కొత్తదనం తీసుకురావటం, వాస్తవ పరిస్థితులకు సరితూగే అంశాలను చేర్చటమే మార్పు అనుకుంటే పొరపాటే. వాస్తవానికి కరిక్యులం అంటే బోధన విధానానికి సంబంధించి మార్గనిర్దేశాలు చేసే సాధనమని గుర్తించాలి.

ప్రాక్టికాలిటీకి పెద్దపీట:
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే కరిక్యులం పరంగా ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేసేలా మార్పులు తేవాలి. మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు ప్రతి కోర్సు, ప్రతి ప్రోగ్రామ్, ప్రతి యూనిట్‌ను ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండే విధంగా రూపకల్పన చేయాలి. ఈ విషయంలో ఫ్యాకల్టీకి సైతం నైపుణ్యాలు అందించాలి.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లతో:
విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, వాస్తవ పరిస్థితులపై క్షుణ్నమైన అవగాహన కల్పించేందుకు ఉపకరించే విధానం ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. ఇవి రెండు రకాలు.. ఇండస్ట్రీ ఎక్స్ఛేంజ్, అకడమిక్ ఎక్స్ఛేంజ్. ఇండస్ట్రీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ వల్ల ఒక రంగంలోని పరిశ్రమలు, ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి సంయుక్తంగా రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. దీనివల్ల విద్యార్థులకు రియల్‌టైం ఎక్స్‌పోజర్ లభిస్తుంది. ఇక.. అకడమిక్ ఎక్స్ఛేంజ్ అంటే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రధానంగా ఒక రంగంలో పేరు గడించిన విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకోవడం. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలపై అవగాహన లభిస్తుంది. ఇప్పటికే ఐఐటీల స్థాయిలో ఈ విధానాలు అమలవుతున్నాయి. అయితే ఇవి ఆయా రాష్ట్రాల్లోని యూనివర్సిటీల స్థాయిలో సైతం జరగాలి. అప్పుడే చదువుకున్న ప్రాంతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నైపుణ్యాలు లభిస్తాయి. మనం చెప్పుకునే డెమోగ్రఫిక్ డివిడెండ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుంది.

పరిశోధనను ప్రోత్సహించాలి:
ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన ఫ్యాకల్టీని పొందడం తొలి సవాలు. అయితే.. ఆ ఫ్యాకల్టీ సుదీర్ఘకాలం కొనసాగేలా చేయడం ఇన్‌స్టిట్యూట్‌లకు మరో ప్రధాన సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ వ్యక్తిగత పరిశోధన చేసే దిశగా ప్రోత్సహించడం, అందుకు తగిన సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తే సదరు ఫ్యాకల్టీ సుదీర్ఘ కాలం ఉంటుంది. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రొఫెసర్లను నియమించుకునే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఈ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

కొత్త టెక్నాలజీలపై దృష్టి:
విద్యార్థులు కూడా కొత్త టెక్నాలజీలు, కొత్త అంశాలపై దృష్టిసారించాలి. కోర్ బ్రాంచ్‌ల్లో చేరినా కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇటీవల కాలంలో నానో టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి ప్రింటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు ఆయా రంగాల్లో ఆదరణ పొందుతున్నాయి. సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులు వాటిని నేర్చుకోవాలి.

సమకాలీన పరిజ్ఞానంతో:
విద్యార్థులు నిరంతరం తాము చేరిన కోర్సు, అందుకు సంబంధించిన రంగంలోని తాజా మార్పులను తెలుసుకోవాలి. వాటికి అకడమిక్ మూలాలు అన్వేషించి, ప్రాక్టికల్‌గా అన్వయిస్తూ సాధన చేయాలి. అప్పుడే నైపుణ్యాలు లభిస్తాయి. కేవలం తాము చేరిన కోర్సుకే పరిమితం కాకుండా అనుంబంధంగా ఉన్న ఇతర అంశాలను నేర్చుకోవాలి. ఈ విషయంలో ఇటీవల కాలంలో అమలవుతున్న ఇంటర్ డిసిప్లినరీ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు, మూడు అంశాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభిస్తుంది. ఇలా వీలైనంత వరకు అన్ని కోణాల్లో నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందు వరుసలో నిలవగలరు.
Published date : 25 Sep 2015 04:33PM

Photo Stories