Skip to main content

చేసేపనిని అత్యున్నతంగా చేయండి..

నానో ఎలక్ట్రానిక్స్‌లో కీలక పరిశోధనలు.. 400కు పైగా పరిశోధన పత్రాలు.. 32 పేటెంట్లు.. ఇదీ క్లుప్తంగా మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన డా. వి.రామ్‌గోపాల్ రావు నేపథ్యం. ఆయన ఇటీవల ‘ఐఐటీ ఢిల్లీ’కి డెరైక్టర్‌గా నియమితులు కావడం తెలుగు వారికి, ముఖ్యంగా ఇంజనీరింగ్‌తో సంబంధమున్న వారికి ఎంతో గర్వకారణం. ఐఐటీ ఢిల్లీకి డెరైక్టర్ కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెబుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష పరిశోధనలు చేసిన వారికి ఇచ్చే ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు విజేత కూడా అయిన రామ్‌గోపాల్‌రావు.. ఐఐటీల్లో పరిశోధనలు జరగాల్సిన తీరు, ఫ్యాకల్టీ కొరత తదితర అంశాలపై ‘భవిత’తో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
దేశంలోని సాధారణ ప్రజానీకం నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఐఐటీల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరముంది. భద్రత, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణం తదితర విభాగాల్లోని సమస్యల పరిష్కారానికి దారిచూపగలిగేలా ఉండాలి. ఇది నెరవేరాలంటే బహుళ అంశాల పరిశోధనా సంస్కృతి (Multi disciplinary research culture) అవసరం.

స్పష్టమైన లక్ష్యాలున్న బృందాలుండాలి
బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో అమోఘమైన మేధా సంపత్తి కలిగిన ఓ గొప్ప సంస్థ ఐఐటీ ఢిల్లీ. అయితే ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు చూపాలంటే స్పష్టమైన లక్ష్యాలున్న బృందాల్ని తయారు చేయడం ముఖ్యం.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్
గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను అర్థం చేసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్ చేసే దిశగా ఐఐటీ విద్యార్థులను ప్రోత్సహించాలి. అమెరికాలోని పేరున్న చాలా విశ్వవిద్యాలయాల నుంచి ఎందరో విద్యార్థులు భారత్‌లోని మారుమూల గ్రామాలను సందర్శిస్తున్నారు. తమ పరిశోధనలు చేసేందుకు వీలుగా సమస్యల్ని తెలుసుకొని వెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై మన విద్యార్థులకు తక్షణం అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మేధో వలసకు అడ్డకట్ట వేయాలంటే..
మన విద్యా సంస్థల ప్రాంగణాలు.. అధిక సంఖ్యలో ఇంక్యుబేషన్ కేంద్రాలపై దృష్టిసారించాలి. ఐఐటీల నుంచి బయటకు వచ్చే విద్యార్థుల్లో చాలామందిని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా తీర్చిదిద్దాలి. క్యాంపస్‌ల్లో టెక్నాలజీ ఇంక్యుబేషన్‌కు అవసరమైన సానుకూల వ్యవస్థను తక్షణం అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. టెక్నాలజీ కంపెనీలు సంపదను సృష్టిస్తూ, ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తాయి. ఉదాహరణకు కొత్త ఆవిష్కరణతో, తగిన ఖర్చుతో వ్యవసాయ ఉత్పాదకత స్థాయిని పెంచితే, అది సంపద సృష్టి అవుతుంది. ఐఐటీ ఇంజనీర్లు ఇలాంటి సమస్యలపైనే దృష్టిసారించాలి. పరిశ్రమలతో చాలా దగ్గరి సంబంధాలు పరిశోధనలపై దృష్టి సారించేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటి వాటివల్ల మేధో వలసను కూడా అడ్డుకోవచ్చు.

ఫీజు పెంపు ప్రతిపాదనలపై
ప్రవేశ ఫీజును పెంచడమనేది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి చైర్మన్‌గా ఉన్న ఐఐటీ కౌన్సిల్ క్షుణ్నంగా పరిశీలించాకే ఏ నిర్ణయమైనా వెలువడుతుంది. ఆదాయ వర్గీకరణ ఆధారంగా ఫీజు నిర్ధారించాలనేది (వేరియబుల్ ఫీ సిస్టం) వాస్తవ ప్రతిపాదన. దీని ప్రకారం సంపన్న వర్గాలు ఎక్కువ ఫీజు భరించాల్సి ఉంటుంది. అల్పాదాయ వర్గాల విద్యార్థులకు సున్నా వడ్డీతో రుణాలు, ఫీజుల్లో మినహాయింపు వంటి సౌకర్యాలుంటాయి. ఫీజు కారణంగా విద్యార్థికి ప్రవేశం తిరస్కరించినట్లు ఇంతవరకు ఐఐటీ చరిత్రలోనే లేదు. కాబట్టి అన్ని ఆదాయ వర్గాల అభ్యర్థులకు ఆమోదయోగ్యంగానే ప్రభుత ్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌పై
ప్రస్తుతం ఐఐటీ ప్రవేశ పరీక్ష ప్రధానంగా సబ్జెక్టులపైనే ఉంటుంది. గణితం, రసాయన, భౌతిక శాస్త్రాల సబ్జెక్టుల స్థాయి విద్యాలయాల్లో ప్రస్తుతం మెరుగ్గా ఉంటోంది. అయితే స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ పరీక్ష (శాట్) దాదాపు జీఆర్‌ఈ తరహాలో ఉంటుంది. ఇది విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను మాత్రమే పరీక్షిస్తుంది కానీ సబ్జెక్టు పరిజ్ఞానాన్ని కాదు. దీనివల్ల విద్యార్థులు సబ్జెక్టులు నేర్చుకొనే అవకాశాన్ని కోల్పోతారు. దీంతో ఆయా సబ్జెక్టుల స్థాయి దేశ వ్యాప్తంగా పడిపోతుంది. అందువల్ల సబ్జెక్టులపైనే ప్రవేశ పరీక్ష నిర్వహించడం ఉత్తమం.

కొత్త ఐఐటీలు
విద్యార్థులు, పరిశ్రమల నుంచి డిమాండ్ ఉన్నందున ప్రభుత్వం కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఐఐటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రమైంది. పాశ్చాత్య, సింగపూర్‌లోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది వివిధ దేశాలకు చెందిన వారుంటారు. ఇక్కడ కూడా అదే విధానాన్ని అనుసరిస్తే, ఫ్యాకల్టీ కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దాంతో పాటు భిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్న ఫ్యాకల్టీ బోధన వల్ల విద్యార్థులకూ ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ మంది విదేశీ బోధనా సిబ్బందిని ఐఐటీల్లో తీసుకునే దిశగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. మన విద్యాలయాల్లో నైపుణ్యం గల బోధనా సిబ్బంది, ఉత్తమ విద్యార్థులు, మెరుగైన సౌకర్యాలున్నాయి. అయితే ముందే చేప్పినట్లు బోధనా సిబ్బందిగా విదేశీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో నియమించాలి. ఇది మన విద్యాలయాల ర్యాంకింగ్స్ మెరుగవడానికి ఎంతో కీలకమని గ్రహించాలి.

ఐఐటీ బాంబే
ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, కాన్పూర్ వంటి ఐఐటీల్లో ప్రమాణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయి. విద్యార్థులు గత ఏడాది కౌన్సెలింగ్ ట్రెండ్‌నుబట్టి ఐఐటీలను ఎంపిక చేసుకుంటుంటారు. అందులో ఐఐటీ బాంబే వారికి మొదటి ప్రాథమ్యం అవుతోంది.

అప్పుడే ఉన్నత స్థానాలు
విశాల దృక్పథంతో ఉన్నప్పుడే ఉన్నత స్థానాలు లభిస్తాయి. చదువు పూర్తయిన వెంటనే ఆకర్షణీయమైన జీతంతో కొలువు దక్కితే చాలని చాలా మంది అనుకుంటున్నారు. కొందరు మాత్రమే పీహెచ్‌డీల గురించి ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితికి తల్లిదండ్రుల ఆలోచనావిధానం కూడా ఓ కారణమే.

యువ ఇంజనీర్లకు సలహా
మీరేదైతే చేయగలరని అనుకుంటున్నారో అంతకంటే గొప్ప లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం మీలో ఉంది. అయితే మీరు చేసేపనిని అత్యున్నతంగా చేయండి.. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో, ఇష్టంగా పనిచేస్తే తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.
Published date : 01 Apr 2016 03:59PM

Photo Stories