Skip to main content

ప్రపంచ బ్యాంకులో సభ్య దేశాల సంఖ్య ప్రస్తుతం ఎంత?

రెండో త్రైమాసికం 2019–20 క్యూ2 గణాంకాలు :
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. 2012–13 నాలుగో త్రైమాసికం (జనవరి–మార్చి)లో జి.డి.పి. వృద్ధి అల్పంగా 4.3 శాతం కాగా, తిరిగి అల్ప వృద్ధి 2019–20 రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో నమోదైంది. స్థిర ధరల వద్ద (2011–12) 2019–20 రెండో త్రైమాసికంలో జి.డి.పి. రూ.35.99 లక్షల కోట్లు కాగా స్థూల కలుపబడిన విలువ రూ.33.16 లక్షల కోట్లు.
  • 2018–19 రెండో త్రైమాసికంతో పోల్చినప్పుడు 2019–20 రెండో త్రైమాసికంలో వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగంలో వృద్ది క్షీణించింది. పారిశ్రామిక రంగంలో వృద్ది 0.5 శాతం కాగా, ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ది ఒక శాతం క్షీణించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిని రిజర్వ్‌బ్యాంకు (6.1 శాతం), ఐఎంఎఫ్‌ (6.1 శాతం), ఓఈసీడీ (5.9 శాతం), ప్రపంచ బ్యాంకు (6 శాతం),ఎస్‌ అండ్‌ పీ (6.3 శాతం), ఫిచ్‌ (5.5 శాతం) మూడీస్‌ (5.8 శాతం)గా రెండో త్రైమాసికం ఫలితాలు వెలువడటానికి ముందు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో వృద్ధి క్షీణత నేపథ్యంలో ఆయా సంస్థలు వార్షిక అంచనాలను సవరించే అవకాశం ఉంది.
2019–20 రెండో త్రైమాసికం–వివిధ రంగాల వృద్ధి:
  • 2019–20 రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో వ్యవసాయరంగంలో 2.1 శాతం, పారిశ్రామికరంగంలో 0.5 శాతం, సేవారంగంలో 6.8 శాతం వృద్ధి నమోదైంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నామినల్‌ జి.డి.పి. వృద్ధి 8 శాతం కాగా, రెండో త్రైమాసికంలో 6.1 శాతానికి తగ్గింది.
  • మొదటి త్రైమాసికంలో స్థూల కలుపబడిన విలువలో వృద్ది 4.9 శాతం కాగా రెండో త్రైమాసికంలో 4.3 శాతానికి తగ్గింది.
  • మొదటి త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారంలో వృద్ది 7.1 శాతం కాగా, రెండో త్రైమాసికంలో 4.8 శాతానికి తగ్గింది.
  • మొదటి త్రైమాసికంలో మైనింగ్‌ రంగంలో వృద్ది 2.7 శాతం కాగా రెండో త్రైమాసికంలో 0.1 శాతానికి తగ్గింది.
  • మొదటి త్రైమాసికంలో విద్యుత్, ఇతర పబ్లిక్‌ యుటిలిటీస్‌లో వృద్ది 8.6 శాతం కాగా, రెండో త్రైమాసికంలో 3.6 శాతానికి తగ్గింది.
  • మొదటి త్రైమాసికంలో నిర్మాణ రంగంలో వృద్ది 5.7 శాతం కాగా, రెండో త్రైమాసికంలో 3.3 శాతానికి తగ్గింది.

అల్ప జి.డి.పి. వృద్ధి(4.5 శాతం)కి కారణాలు..
1. చిన్న వ్యాపారాలు, వినియోగదారులకు పరపతినందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో సంక్షోభం
2. క్షీణించిన గ్రామీణ వినియోగ వ్యయం
3. ప్రపంచ వృద్ధి క్షీణత
4. వినియోగ డిమాండ్, ప్రైవేటు పెట్టుబడి తగ్గుదల
5. వ్యవసాయ రంగ కార్యకలాపాల్లో క్షీణత
6. తయారీరంగ వృద్ధి క్షీణత
7. ఎగుమతుల వృద్ధి క్షీణత
8. పట్టణ ప్రాంతాల ఆదాయ వృద్ధి అంచనాల్లో క్షీణత కారణంగా వినియోగ డిమాండ్‌ తగ్గుదల

ఇటీవలి కాలంలోవృద్ధి పెంపునకు ప్రభుత్వ చర్యలు:
1. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
2. స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు
3. అవస్థాపనా సౌకర్యాల కల్పనకు సంబంధించి వ్యయ ప్రణాళికలను రూపొందించుకోవడం
4. ఆటో రంగానికి మద్దతు
5. కార్పొరేషన్‌ పన్ను రేటు తగ్గింపు ద్వారా అధిక ప్రైవేటు పెట్టుబడికి చర్యలు
6. ప్రత్యేక రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌ ఏర్పాటు
7. విదేశీ పెట్టుబడిదారులపై అధిక పన్ను ఉపసంహరణ
8. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం

ఎనిమిది కీలక అవస్థాపనా పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి :

  • 2019 అక్టోబర్‌లో ఎనిమిది కీలక అవస్థాపనా పరిశ్రమల ఉత్పత్తి వృద్ధిలో క్షీణత (5.8 శాతం) అల్ప ఆర్థికవృద్ధి తీవ్రతను సూచించింది. మొత్తంగా 8 పరిశ్రమలకుగాను ఆరు పరిశ్రమల్లో ఉత్పత్తి వృద్ధి అక్టోబర్‌లో క్షీణించింది. బొగ్గు, క్రూడ్‌ చమురు, సహజ వాయువు, సిమెంటు, ఉక్కు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి వృద్ధి క్షీణించింది. మరోవైపు ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి 2018 అక్టోబర్‌తో పోల్చినప్పుడు 2019 అక్టోబర్‌లో 11.8 శాతం నమోదైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి వృద్ధిలో క్షీణత 2018 అక్టోబర్‌లో 1.3 శాతం కాగా, 2019 అక్టోబర్‌లో 0.4 శాతం.
వివిధ సంస్థల వృద్ధి అంచనాలు :
  • భారత వృద్ధి 2019లో 5.6 శాతానికి పరిమితమవుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. వినియోగ డిమాండ్‌ను పెంపొందించడంలో ప్రభుత్వ చర్యలు ఉపకరించలేదని మూడీస్‌ పేర్కొంది. గతంలో ఊహించిన దాని కంటే అధిక కాలంగా వృద్ధి క్షీణత కొనసాగుతున్నది. 2020, 2021లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. తద్వారా 2020లో 6.6 శాతం, 2021లో 6.7 శాతం వృద్ధిని భారత్‌ సాధిస్తుందని మూడీస్‌ పేర్కొంది.
  • 2019–20లో భారత జి.డి.పి. వృద్ధిని, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (6.1 శాతం), ఆసియా అభివృద్ధి బ్యాంకు (6.5 శాతం), యూఎన్‌సీటీఏడీ (6 శాతం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (5 శాతం)గా అంచనా వేసాయి.
  • 2019–20లో భారత జి.డి.పి. వృద్ధి 5.5 శాతంగా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2020–21లో 6.2 శాతం, 2021–22లో 6.7 శాతం వృద్ధిని భారత్‌ సాధించగలదని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఇటీవల కార్పొరేషన్‌ రేటు తగ్గింపు లాంటి చర్య నెమ్మదిగా ఉపకరిస్తుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి పరపతిల లభ్యత తక్కువగా ఉండటం కూడా ప్రస్తుత ఆర్థిక వృద్ధి్ద క్షీణతకు కారణంగా ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.
  • నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ 2019–20లో భారత వృద్ధిని 4.9 శాతంగా అంచనా వేశాయి. కార్ల అమ్మకాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు, కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు, పారిశ్రామిక రంగానికి పరపతి, ప్రభుత్వ స్థూల పన్ను రాబడి, నూతన గృహ అమ్మకాల్లాంటి అధిక ఫ్రీక్వెన్సీ కల్గిన ఆర్థిక సూచికల ఆధారంగా ఆయా సంస్థలు జి.డి.పి. అంచనాలను రూపొందించాయి.
నిపుణుల అభిప్రాయాలు :
  • రెండో త్రైమాసికంలో సాధించిన 4.5 శాతం వృద్ధి్దని సమ్మతం కాని అంశంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత వృద్ధి 8–9 శాతంగా ఉండాలని మన్మోహన్‌ ఆశించారు. ఆర్థిక విధానాల్లో మార్పులు ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదపడవని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో మార్పును తీసుకురావడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా భారత్‌ సాంవత్సరిక వృద్ధి్దని 8 శాతంగా నిర్వహించవచ్చని మన్మోహన్‌ అభిప్రాయపడ్డారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జి.డి.పి. గణాంకాలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ‘అతను చక్రవర్తి’ వాఖ్యానిస్తూ వృద్ధి క్షీణత కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి వృద్ధి పుంజుకుంటుందని పేర్కొన్నారు.
  • వినియోగ వ్యయం, ఎగుమతుల వ్యయంలో తగ్గుదల భారత్‌లో అల్ప జి.డి.పి. వృద్దికి కారణాలుగా అనేకమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత స్వదేశీ, ప్రపంచ వాతావరణంలో వృద్ధి పెంపులో ప్రభుత్వ పాత్ర అధికంగా ఉండాలని ఇండియా రేటింగ్స్‌ ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌ ‘సునీల్‌ కుమార్‌ సిన్హా’ పేర్కొన్నారు.
  • తయారీ ఉత్పత్తి వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పెట్టుబడులపై దృష్టి సారించడం ద్వారా వృద్ధి క్షీణతను నివారించాలని రాజీవ్‌ బిశ్వాస్‌ పేర్కొన్నారు. స్వల్ప కాలంలో ఆర్థిక వ్యవస్థ పురోగమించాలంటే రోడ్లు, రైల్వేస్, నౌకాశ్రయాల లాంటి అవస్థాపనా ప్రాజెక్టులపై ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచాలి. పట్టణ ప్రాంత అవస్థాపనలైన అందుబాటు గృహాలు, ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన కోశపరమైన ప్రోత్సాహకాలను అందించాలని రాజీవ్‌ బిశ్వాస్‌ పేర్కొన్నారు.
మాదిరి ప్రశ్నలు :
Published date : 07 Dec 2019 01:42PM

Photo Stories