Skip to main content

పటిష్ట వ్యూహంతో పాలిటీని జయించండి

పోటీ పరీక్షల్లో ముఖ్య విభాగం ఇండియన్ పాలిటీ (భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ). పరీక్ష ప్రాముఖ్యాన్ని బట్టి ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య మారుతుంటుంది. తాజాగా విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్-2లో అన్నీ కలిపి ప్రశ్నల సంఖ్య 75 వరకు ఉండే అవకాశం ఉంది. సిలబస్ పరిధి, ప్రశ్నల స్థాయి, సరళిని గమనించి అభ్యర్థులు ప్రిపరేషన్ సాగిస్తే ఈ విభాగంలో గరిష్ట మార్కులు సాధించొచ్చు. అయితే రాజకీయ, రాజ్యాంగ గతి విధానాలు నిరంతరం మారుతుండటం వల్ల, తాజా సమాచారాన్ని అభ్యర్థులు ఎప్పటికప్పుడు సేకరించుకోవాలి.
అంశాలు: ఇండియన్ పాలిటీలో సాధారణంగా కింది అంశాలను పొందుపరుస్తారు. అవి..
రాజ్యాంగ చరిత్ర, రచన, రాజ్యాంగ ఆధారాలు, పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక, హక్కులు, నిర్దేశక సూత్రాలు, రాష్ర్టపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు నిర్మాణం, బిల్లులు-రకాలు, శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంటు కమిటీలు, న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర- రాష్ర్ట సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలు, పంచాయతీ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, సంక్షేమ యంత్రాంగం, గవర్నెన్‌‌స, రాజ్యాంగ సవరణ పద్ధతి మొదలైనవి.

ఈ అంశాలతోపాటు ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో రాజ్య విధులు, అధికారాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పరిపాలన, సుపరిపాలన, ఈ-గవర్నెన్‌‌స, హక్కుల సమస్యలు, అణగారిన వర్గాల వికాసం, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, అంతర్జాతీయ తీవ్రవాదం, పౌరసమాజం మొదలైన పరిణామాలను కూడా అధ్యయనం చేయాలి.

ప్రశ్నల స్థాయి- సరళి
సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
  1. జ్ఞానాత్మకమైనవి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి
  2. విషయావగాహనకు సంబంధించినవి
  3. విషయానువర్తనకు సంబంధించినవి.

జ్ఞానాత్మకమైనవి (లేదా) పరిజ్ఞానాన్ని పరిశీలించేవి
ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా అభ్యర్థి జ్ఞాపక శక్తిని, గుర్తించే పరిజ్ఞానాన్ని పరిశీలిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే విస్తృత పఠనంతోపాటు పదే పదే పునశ్చరణ అవసరం. ఈ తరహా ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక స్థాయి వరకు ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు. ఉదాహరణకు..
ఒక రాష్ర్టంలో పంచాయతీ లేదా మున్సిపాలిటీల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది?
ఎ) రాష్ర్ట ప్రభుత్వం
బి) కేంద్ర ప్రభుత్వం
సి) జిల్లా కలెక్టర్
డి) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమాధానం: (ఎ) రాష్ర్ట ప్రభుత్వం
వివరణ: పై ప్రశ్నకు సమాధానం గుర్తించడం తేలిక. ఇందులో ఎలాంటి తర్కం ఉపయోగించాల్సిన అవసరం లేదు. చదివిన అంశాన్ని గుర్తుంచుకుంటే చాలు.

అయితే కొన్ని ప్రశ్నలు సమాచారానికి సంబంధించినవే అయినా విస్తృత అధ్యయనం సాగిస్తే తప్ప వాటికి సమాధానం గుర్తించలేం. ఉదాహరణకు..

కింద పేర్కొన్న ఏ రాజ్యాంగ నిపుణుడు బర్మా (మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు?
ఎ) డా. బి.ఆర్. అంబేద్కర్
బి) డా. బి.ఎన్.రావు
సి) ప్రొ. కె.టి. షా
డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సమాధానం: (బి) బి.ఎన్.రావు
వివరణ: పైన పేర్కొన్న అన్ని పేర్లూ అభ్యర్థికి తెలిసినవే. కానీ వారికి సంబంధించి విస్తృత అధ్యయనం సాగిస్తే తప్ప ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేం.

విషయావగాహనకు సంబంధించినవి
కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల అవగాహన, తెలివితేటలను పరిశీలిస్తాయి. ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించగలం. ఉదాహరణకు..
కింది వారిలో ఎవరు అత్యధిక ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు?
ఎ) పార్లమెంటు సభ్యులు
బి) రాష్ర్ట విధాన సభ సభ్యులు
సి) విధాన పరిషత్ సభ్యులు
డి) సాధారణ ఓటరు
సమాధానం: (బి) రాష్ర్ట విధాన సభ సభ్యులు
వివరణ: పై ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాల్లో ఒకదానికొకటి ఉన్న సంబంధం, వాటి విస్తృతిపై సమగ్ర అవగాహన ఉండాలి. ఎవరెవరు ఏ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారో విశ్లేషించుకోవాలి. ఇలాంటి వాటికి వెంటనే సమాధానం గుర్తించడం సాధ్యం కాదు.

రాష్ర్ట విధాన సభ సభ్యులు రాష్ర్టపతి, రాజ్యసభ, రాష్ర్ట విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకోవడమే కాకుండా సాధారణ ఓటర్‌గా లోక్‌సభ, విధాన సభ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు వేస్తారు.

విషయానువర్తనకు సంబంధించినవి
ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలను ప్రదర్శించాలి. లోతుగా ఆలోచించాలి. సహజ ప్రతిభ, విచక్షణ శక్తి ఉపయోగించాలి. కేవలం సమాచారం, అవగాహన ఉంటే సరిపోదు. ఉదాహరణకు..
1. ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఉన్న అధికారాలు?
ఎ) వాయిదా వేసే అధికారం
బి) సవరించే అధికారం
సి) సిఫార్సులు చేసే అధికారం
డి) ఓటు వేసే అధికారం
1) పైవన్నీ సరైనవే
2) ఎ, బి, సి మాత్రమే సరైనవి
3) సి, డి మాత్రమే సరైనవి
4) ఎ, సి మాత్రమే సరైనవి
సమాధానం: (4) ఎ, సి మాత్రమే సరైనవి
వివరణ: పై ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే రాజ్యసభకు ద్రవ్య బిల్లుపై ఎలాంటి అధికారం ఉంటుందో సమగ్ర అవగాహన ఉండాలి. అలాగే ఇచ్చిన ఐచ్ఛికాల నుంచి సందర్భాన్ని బట్టి సరిపోయే అంశాలను గుర్తించగలగాలి. ఇందుకు అభ్యర్థి స్వతహాగా, విచక్షణతో నిర్ణయం తీసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
రాజ్యసభ ద్రవ్య బిల్లును 14 రోజుల వరకు వాయిదా వేయొచ్చు. సిఫార్సులు చేయొచ్చు. కానీ సవరించే, ఓటు వేసే అధికారాలు ఉండవు.

అంశాలవారీగా విశ్లేషణ
రాజ్యాంగ రచన ముఖ్య లక్షణాలు - విభాగంలో ప్రధానంగా ప్రశ్నలు సమాచారానికి సంబంధించి ఉంటాయి. సమావేశాలు, సంబంధిత తేదీలు, కమిటీలు, చైర్మన్లు, తీర్మానాల నుంచి నేరుగా ప్రశ్నలు వస్తాయి.

ప్రవేశిక, రాజ్యాంగ తత్వం - విభాగంలో ప్రవేశిక లక్ష్యాలు, ఆదేశాలు, వాటి అనువర్తనాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సుప్రీంకోర్టు తీర్పులను కూడా గుర్తుంచువాలి.

ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు - నుంచి వచ్చే ప్రతి ప్రశ్న ప్రకరణలకు సంబంధించి ఉంటుంది. అందువల్ల ప్రకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రాథమిక హక్కులు, విస్తృతి, సుప్రీంకోర్టు తీర్పులు, తాజా పరిణామాలు, ప్రాథమిక హక్కులకు, నిర్దేశిక నియమాలకు మధ్య వివాదాలు, వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వంలో రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి - నుంచి ఎన్నిక, ఎంపిక ప్రక్రియలో అర్హతలు, అధికార విధులు, వివిధ స్థాయిల్లో వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రికి సంబంధించి జీకే రిలేటెడ్‌తో ఉన్న అదనపు సమాచారాన్ని సేకరించుకోవాలి. ఉదాహరణకు..
  1. ఎంతమంది ముఖ్యమంత్రులు రాష్ర్టపతులయ్యారు?
  2. అవిశ్వాస తీర్మానాన్ని అత్యధికసార్లు ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
  3. కేంద్రంలో ఏ పదవీ చేపట్టకుండా ప్రధాని అయినవారు ఎవరు? తదితర సమాచారాన్ని సేకరించుకోవాలి.

కేంద్ర శాసనసభ, పార్లమెంటు, రాష్ర్ట శాసనసభ నిర్మాణం - విభాగంలో ఎన్నిక, అనర్హతలు, వివాదాలు, బిల్లులు-రకాలు, పార్లమెంటు కమిటీలు, పార్లమెంటు, శాసనసభకు మధ్య పోలికలు-వ్యత్యాసాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.

భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు - విభాగంలో నిర్మాణం, నియామకం, అధికార విధులు, తాజా పరిణామాలు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, సుప్రీంకోర్టు తాజా తీర్పులు తదితర అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.

భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ర్ట సంబంధాలు - విభాగంలో ఆర్థిక వనరుల విభజన, ముఖ్య ప్రకరణలు, కేంద్ర-రాష్ర్ట సంబంధాల సమీక్షకు నియమించిన కమిషన్లు, వాటి సిఫార్సులను అధ్యయనం చేయాలి.

నూతన పంచాయతీ వ్యవస్థ, 73, 74వ రాజ్యాంగ సవరణలు-ప్రత్యేకతలు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, స్థానిక సంస్థల పనితీరు, వాటి పరిమితులను సమగ్రంగా తెలుసుకోవాలి.

రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర, చట్టేతర సంస్థల గురించి విస్తృత అధ్యయనం చేయాలి. వీటి నిర్మాణం, నియామకాలపై సమాచార సంబంధ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.

ప్రతి అంశం సమకాలీనమే
రాజ్యాంగంలోని మూల సూత్రాలు, వివిధ వ్యవస్థలు సమకాలీన రాజకీయాలతో ప్రభావితం అవుతాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, వాస్తవికతకు గుణాత్మక వ్యత్యాసం ఉంటోంది. తాజా పరిణామాలు, సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులు, వ్యాఖ్యానాలు, సవరణలు, మొదలైన అంశాలను జోడించి పాలిటీని చదవాలి. ఉదాహరణకు..
తాజా వివాదాలు
వాక్ స్వాతంత్య్రం
పార్లమెంటు సభ్యుల స్వాధికారాలు, అనుచిత ప్రవర్తన
కొత్త రాష్ట్రాల ఏర్పాటు
రాష్ర్ట విధాన మండలి పునరుద్ధరణ
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ -కొలీజియం
స్థానిక సంస్థల నిర్బంధ ఓటింగ్
ప్రకరణ 370-జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ప్రతిపాదన
గ్రీన్ ట్రిబ్యునల్
లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థ,
ఉమ్మడి పౌర నియమావళి
మత, ప్రార్థనా స్థలాల్లోకి స్త్రీలకు ప్రవేశం
మొదలైన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

గుర్తుంచుకోవడం సాధ్యమే!
ఇండియన్ పాలిటీలో వివిధ ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లు, కనిష్ట, గరిష్ట వయసులు, జీతభత్యాలు, తొలగింపులు, వివిధ వ్యవస్థల అధికారాలు, విధులు, సమకాలీన సవరణలు... ఇలా విస్తృత సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాథమిక సమాచారంపై 8-10 ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యాంశాలను గుర్తుంచుకోవడానికి ఆయా అంశాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసుకోవాలి. తర్కబద్ధంగా వ్యవహరించాలి. ఉదాహరణకు..
కనిష్ట, గరిష్ట వయసుల అర్హతకు సంబంధించి కింది విధానాన్ని పాటించండి..
కనిష్ట వయోపరిమితి ఉన్న పదవులకు గరిష్ట వయో పరిమితులు ఉండవు. ఉదా: రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ.
అలాగే గరిష్ట వయో పరిమితి ఉన్న పదవులకు కనిష్ట వయో పరిమితి ఉండదు. ఉదా: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు.
పదవీకాలం ఉన్నా పదవీ విరమణ వయసు ఉండదు.
ఉదా: రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ.
తొలగింపు ప్రక్రియ, బిల్లులకు సంబంధించి కింది తర్కాన్ని గమనించండి..

ఉపరాష్ర్టపతిని తొలగించే తీర్మానం మినహా మిగిలిన ఎవరిని తొలగించాలన్నా ఆ తీర్మానాన్ని ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు.

సాధారణ బిల్లు, రెండోరకం ఆర్థిక బిల్లు విషయంలో తప్ప మిగిలిన బిల్లుల విషయంలో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

రాష్ర్ట శాసనసభలో ఏ బిల్లుపై కూడా సంయుక్త సమావేశం ఉండదు. దిగువ సభ తీర్మానమే నెగ్గుతుంది.
అదేవిధంగా రాజ్యాంగ ప్రకరణలను గుర్తుంచుకోవడానికి కూడా ప్రత్యేక టెక్నిక్స్‌ను అవలంబించాలి.

రీడింగ్, రిఫరెన్‌‌స బుక్స్..
అభ్యర్థులు రీడింగ్‌కు, రిఫరెన్‌‌సకు మధ్య తేడా గమనించాలి. ప్రాథమిక సమాచారం కోసం 1 లేదా 2 పుస్తకాలు చదివితే సరిపోతుంది.
అయితే విషయ విస్తృతి కోసం సంబంధిత అంశంపై అనేక పుస్తకాలను సంప్రదించాల్సి (రిఫరెన్‌‌స కోసం) ఉంటుంది.

ఉపయుక్త పుస్తకాలు..
భారత రాజ్యాగం, రాజకీయాలు - తెలుగు అకాడమీ ప్రచురణలు
తాజా సమాచారం కోసం దినపత్రికలు, మ్యాగజీన్లు చదవాలి.
Published date : 26 Nov 2016 11:18AM

Photo Stories