Skip to main content

Group 1&2 Notification 2023: గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఉద్యోగార్థులకు శుభవార్త అందించింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌.. స్వప్నంగా భావించే.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 సర్వీసుల్లో.. 1000 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు! వీలైనంత త్వరగా.. నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో.. గ్రూప్స్‌ అభ్యర్థులు తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో త్వరలో వెలువడనున్న గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..
group 1&2 notification details and exam pattern and preparation tips
  • మరికొద్ది రోజుల్లో గ్రూప్‌–1, 2 నోటిఫికేషన్లు
  • గ్రూప్‌–1లో 100, గ్రూప్‌–2లో 900 పోస్ట్‌లు
  • నియామకానికి ప్రభుత్వ ఆమోదం
  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పోటీ పడే అవకాశం
  • గ్రూప్స్‌ కల సాకారానికి సన్నద్ధమవ్వాల్సిన తరుణం

గతేడాది జారీ చేసిన గ్రూప్‌–1 నియామక ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌లపై స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రూప్‌ 1తోపాటు గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి కూడా ఉపక్రమించడంతో.. అభ్యర్థులకు ఒకే సమయంలో రెండు పరీక్షలకు పోటీ పడే అవకాశం కూడా లభిస్తుంది.

చ‌ద‌వండి: APPSC Jobs 2023: గ్రూప్‌2.. కీలక మార్పులు ఇవే!

గ్రూప్‌–1లో 100, గ్రూప్‌–2లో 900

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ద్వారా 100 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ, ఆర్‌టీఓ, సీటీఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదే విధంగా గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ ద్వారా 900 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ తహశీల్దార్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ రిజిస్ట్రార్, ఏసీటీఓ వంటి పోస్ట్‌లు ఉంటాయి. ఈ రెండు సర్వీసులకు కూడా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

గ్రూప్‌–1 పరీక్ష విధానం

  • గ్రూప్‌–1 పరీక్ష రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌. 
  • ప్రిలిమ్స్‌: తొలి దశ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో హిస్టరీ అండ్‌ కల్చర్, రాజ్యాంగం, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు; భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ, జాగ్రఫీ అంశాలు 120 మార్కులకు ఉంటాయి. పేపర్‌2లో జనరల్‌ అప్టిట్యూడ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు 120 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తంగా రెండు పేపర్లు 240 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు.
  • 750 మార్కులకు మెయిన్‌: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో అయిదు పేపర్లుగా 750 మార్కులకు ఉంటుంది. 
  • పర్సనాలిటీ టెస్ట్‌: గ్రూప్‌–1లో మెయిన్‌లో పొంది­న మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకొని విజేతలను ఖరారు చేస్తారు. 

గ్రూప్‌–2 రెండు దశలు.. మూడు పేపర్లు

  • గ్రూప్‌–2 పరీక్ష.. స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌.. ఇలా రెండు దశలుంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. 
  • మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేపర్‌–1, జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో భారత చరిత్ర, భౌగోళిక శాస్త్రం, భారత సమాజం, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ అంశాలు ఉంటాయి. 
  • రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 
  • పేపర్‌ 1లో సెక్షన్‌–1 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర,సెక్షన్‌–2 భారత రాజ్యాంగం 150 మార్కులకు;పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సెక్షన్‌–2: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 150 మార్కులకు..ఇలా మొత్తం 300 మార్కులకు మెయిన్‌ ఎగ్జామ్‌ జరుగుతుంది. 
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.
  • ప్రతి పేపర్‌లోనూ ఒక్కో సెక్షన్‌ నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు.
  • గ్రూప్‌–2లో అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహించే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

సిలబస్‌పై అవగాహన

ముందుగా అభ్యర్థులు సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. ఇప్పటి వరకు చదివిన టాపిక్స్, సిలబస్‌లో వాటికి కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి. రెండు పరీక్షల్లో దాదాపు 80 శాతం సిలబస్‌ అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. కాబట్టి గ్రూప్స్‌ అభ్యర్థులు గ్రూప్‌–1, 2 రెండు సర్వీసుల ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. 

విశ్లేషణతో విజయం దిశగా

  • అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన చేసుకోవాలి.
  • ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, అమలు చేస్తున్న పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను ఔపోసన పట్టాలి. 
  • రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపై దృష్టి సారించాలి. అదే విధంగా జాతీయ స్థాయిలో తాజా రా­జ్యాంగ సవరణలు,నూతన జాతీయ విద్యా విధా­నం, కీలకమైన తీర్పుల గురించి తెలుసుకోవాలి.

అన్వయ దృక్పథం

గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివేటప్పుడు అన్వయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు సమ్మిళితంగా ఉండే ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల్లో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అదే విధంగా చదివే సమయంలోనే రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి.

చ‌ద‌వండి: APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

గత ప్రశ్న పత్రాల సాధన

గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం, వాటిని సాధన చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల పరీక్షలో సదరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన లభిస్తుంది. ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. దీంతో..ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు.. పరీక్షలో ప్రశ్నలు అడిగే కోణంలో సమాధానాలు సిద్ధం చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది.

షార్ట్‌ నోట్స్‌

గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ కోణంలో అనుసరించాల్సిన మరో వ్యూహం.. షార్ట్‌ నోట్స్‌ను రూపొందించుకోవడం. ఆయా అంశాలను చదువుతున్నప్పుడే.. వాటిలోని ముఖ్యాంశాలు, కాన్సెప్ట్‌లతో షార్ట్‌ నోట్స్‌ రాసుకుంటే..పరీక్షకు ముందు పునశ్చరణకు ఉపయుక్తంగా ఉంటుంది. షార్ట్‌ నోట్స్‌ ఆధారంగా వేగంగా రివిజన్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది.

గ్రూప్‌–2.. మార్పులను పరిశీలించి

గ్రూప్‌–2కు సంబంధించి గతేడాది మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఆయా అంశాల నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్యను కూడా నిర్దిష్టంగా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ సమయాన్ని వెచ్చించాలి. ఇలా సిలబస్‌ పరిశీలనతో ప్రారంభించి పునశ్చరణ వరకు ప్రతి విషయంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే..గ్రూప్స్‌ పరీక్షల్లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

పట్టు సాధించాల్సిన అంశాలు

  • హిస్టరీ: రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొ­దలు ఆధునిక చరిత్ర వరకూ..ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. 
  • జాగ్రఫీ: రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు..వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • పాలిటీ: రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు.. తాజా పరిణామాలు (రాజ్యాంగ సవరణలు, వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి తెలుసుకోవాలి.
  • ఎకానమీ: మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తుల నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.
  • పునర్విభజన చట్టం: గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అభ్యసించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమకాలీన అంశాలతో కూడిన సమాచారంతో పరీక్ష సమయానికి సన్నద్ధత సాధించాలి.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు: అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలపైనా అవగాహన పెంచుకోవాలి. నవరత్నాలు, వాటి పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, లబ్ధిదారులు, ఇప్పటి వరకు మంజూరు చేసిన మొత్తాలు వంటి వాటిపై గణాంక సహిత సమాచారంతో సన్నద్ధమవ్వాలి. 
Published date : 05 Jun 2023 07:17PM

Photo Stories